Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేలు ఆశల పల్లకిలో విహారిస్తున్నారు. అంతే కాదు సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దయ చూపితే తమ భవిష్యత్ బంగారం అవుతుందని ఆరాట పడుతున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. త్వరలో మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే మంత్రి నారా లోకేష్ కరుణ కోసం కూటమి ఎమ్మెల్యేలు క్యూలు కడుతున్నారంట ఆశల పల్లకిలో విహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు లోకేష్ వర్గానికి మంత్రివర్గంలో బెర్గ్ ఖాయం అని భావిస్తూ.. ఆయన గుడ్లుక్స్లో పడటానికి పాపం తెగ కష్టపడుతున్నారంట
ఆంధ్రప్రదేశ్లో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది.ఈసారి కేబినెట్లో మార్పులు చేర్పులుంటాయని, కొత్త వారికి అవకాశం ఉంటుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగానే వనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తర్వలో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో.. పనితీరు బాలేని మంత్రులకు ఉద్వాసన తప్పదంటున్నారు. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో లోకేష్ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే ప్రచారం కూడా ఊపు అందుకుంది. మంత్రి వర్గ విస్తరణ జరిగితే లోకేష్ అనుచరులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రచారంలో నిజానిజాల సంగతేమో కాని, మంత్రి పదవి ఆశావహులు మాత్రం ఇప్పటి నుంచే లాబీయింగ్లు మొదలుపెట్టి తెగ హైరానా పడిపోతున్నారంట
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవి చూసిన తర్వాత పార్టీ ఇబ్బందిలో పడింది. ఆ సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ పూర్తి బాధ్యతలు తీసుకొని అడుగులు వేశారు. అప్పట్లో అధికారంలో వున్న వైసీపీ అడుగడుగునా ఇబ్బంది పెట్టినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తెచ్చారు.. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు పార్టీని ధైర్యంగా నడిపారు. వైసీపీ ప్రభుత్వం పై ఒంటరిగా పోరాటం చేశారు.
Also Read: Telangana Politics: బీజేపీలో బాంబు పేల్చిన పైడి రాకేష్ రెడ్డి.. ఆందోళనలో కమళనాథులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి వైసీపీ ప్రభుత్వం పైన సమర భేరి మోగించి తల పండిన రాజకీయ నేతలను సైతం ఔరా అనిపించారు. ఇక 2024 ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన వారికి టికెట్స్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మంత్రి వర్గం కూర్పులో కూడా లోకేష్ తన ముద్ర వేసుకోవటంలో ముందే వున్నారు. ఇక ఇప్పుడు మంత్రి వర్గం విస్తరణ జరుగుతుందనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో లోకేష్ వర్గం మరింతగా చురుకుగా మారింది. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగితే.. లోకేష్ వర్గానికి పెద్ద ఎత్తున అవకాశం లభిస్తుందని టీడీపీ సీనియర్ల అభిప్రాయంగా ఉంది.
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో సీఎం, డిప్యూటీ సీఎం సహా 25 మంది ఉన్నారు. ఒక స్థానం ఇంకా ఖాళీగా ఉంది. ఉన్న వారిలో సగానికి పైగా కొత్తవారికి అవకాశం దక్కింది. అయితే మంత్రివర్గంలో కొత్తగా అవకాశం దక్కించుకున్న కొందరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండేళ్లు కావస్తున్నా కొందరు ఇంకా శాఖలపై అవగాహన పెంచుకోలేదని, కొందరు సొంత పెత్తనాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అలాంటి వారు తీరు మార్చుకోకపోవడంతో వారి స్థానంలో ఇతర ఎమ్మెల్యేలకు అవకాశం దక్కుతుందని కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఆ క్రమంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగితే.. ఎంత మందికి కొత్తగా మంత్రి వర్గంలో స్థానం ఇస్తారు? ఎవరెవరికి అవకాశం ఉంటుంది..? కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన వున్న దృష్ట్యా మంత్రి వర్గ కూర్పు ఎలా ఉండబోతోంది? లోకేష్ ఎవరిని ఎంపిక చేస్తారు? ఇలాంటి చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఊపు అందుకుందట. ఇప్పటికే లోకేష్ ఓ ముగ్గురు, నలుగురు పేర్లు సెలక్ట్ చేసి పెట్టుకున్నట్టు టీడీపీలోని ముఖ్యనేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అయితే మంత్రి పదవులు ఆశించే వారు చాలా మందే వున్నారు. ముఖ్యంగా లోకేష్ టచ్ లో ఓ డజన్ మంది టీడీపీ యువ ఎమ్మెల్యేలు ఉన్నట్టు వినికిడి.
ప్రస్తుత మంత్రి వర్గంలో పనితీరు బాగా లేని వారికి అప్పుడే ఉద్వాసన చెపుతారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మంత్రి వర్గం మార్పు వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఇప్పటి నుంచే లోకేష్ అంతర్గత సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు ప్రచారం నడుస్తోందట. మంత్రి పదవులు ఆశించి అవి రాకపోతే అలిగే ఎమ్మెల్యేలు ఎవరో ఇప్పటికే లోకేష్ పసి గట్టి, వారికి వేరే పదవులు ఇచ్చే అవకాశం గురించి అంతర్గతంగా పార్టీల పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చారంటున్నారు.
మంత్రి వర్గంలో మార్పులు జరిగితే లోకేష్ ముద్ర ఈ సారి ఖచ్చితంగా ఉంటుందని అందరు నమ్ముతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో లోకేష్ ముందుండి నడిపిస్తున్నారనే చర్చ ఇప్పటికే పార్టీ నేతలు చెబుతున్న పరిస్ధితి. అందుకు తగ్గట్లుగానే లోకేష్కు ప్రాధాన్యత ఉంటుందని అందరు నమ్ముతున్నారు. ఏ ఎమ్మెల్యేకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ పదవులు ఇవ్వాలి? ఆ ఎమ్మెల్యే కెపాసిటీ ఎంత? పార్టీకి, క్యాడర్ కు అతని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి?… ఇలాంటి అంశాలపై లోకేశ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయించి, రహస్య నివేదికలు తెప్పించుకుంటున్నారంట. పార్టీకి జవాబుదారీగా వుంటూ, విశ్వసనీయతతో పని చేసే ఎమ్మెల్యేలకే లోకేష్ అవకాశం ఇస్తారని పార్టీ నేతలు అంటున్నారు.
ఏపీ మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఖచ్చితంగా ఉంటాయని మూడు భాగస్వామ్య పార్టీల నేతలు కూడా బహిరంగంగానే అంటున్నారు. ఈ సారి మంత్రి వర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన యువతకు ప్రాధాన్యత ఉండవచ్చని కొందరి అంచనా. అయితే ఇప్పటికే లోకేష్ ఓ జాబితా సిద్ధం చేసుకున్నట్లు కూడా టీడీపీలో వినిపిస్తున్న మాట. లోకేష్ కు అత్యంత సన్నిహితులుగా ఉండే పార్టీ సీనియర్ నేతల అనుచరులైన ఎమ్మెల్యేలు .. లాబీయింగ్ ముమ్మరం చేస్తున్నారంట. నిరంతరం లోకేష్ తో టచ్లో ఉండి తమ వారికి మంత్రి వర్గంలో బెర్త్ ఇప్పించుకోవటానికి సీనియర్ టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో లోకేష్ రోజంతా బిజీగా గడిపే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు.
అసలు ఉగాదికే మంత్రవర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని భావించారు. ఆ ముహూర్తం దాటిపోయింది. కొత్త ముహూర్తం ఎప్పుడో క్లారిటీ లేకపోయినా.. ఖచ్చితంగా విస్తరణ ఉంటుందన్న నమ్మకం అందరిలో కనిపిస్తోంది. దాంతో మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు పడరాని పాటలు పడుతూ అటు ఇంటిలిజెన్స్ అధికారులు ఇటు లోకేష్ సన్నిహిత వ్యక్తులతోనూ కలుస్తూ నానా హడావుడి చేస్తున్నారు. మరి అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉంటే ఎప్పడనేది సస్పెన్స్గా తయారైంది.
Storey By: Appa Rao Big Tv