కాంగ్రెస్లో అంతే. కొంపలు మునిగిపోయే రేంజ్లో కొట్లాడుకుంటారు. బాహాటంగా తీవ్ర విమర్శలు చేసుకుంటారు. ఏదో జరగబోతోంది….? తీవ్ర పరిణామలుండబోతాయని కూడా అంతా అనుకుంటారు. నోటీసులతో హడలెత్తిసార్తు. క్రమశిక్షణా చర్యలు ఇక తప్పేలా లేవనే విధంగా సీరియస్ వాతావరణం క్రియేట్ చేస్తారు. కొన్ని రోజులకే అది టీ కప్పులో తుఫాన్ అని తేలిపోతుంది.
కాంగ్రెస్లో ఇంతేనని సరిపెట్టుకుంటారు. ఉత్కంఠగా, ఆసక్తిగా చూసిన వారికి నిరాశే మిగుల్చుతారు. అది పార్టీని డ్యామేజీ చేసిందా…? ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందా? జనాల్లో పలుచనయ్యారా? ఎన్నికల్లో ప్రభావం ఉంటుందా? ఇవన్నీ పట్టించుకోరు. వారి గమనంలో ఉండవు. అంతే. భవిష్యత్ పరిణామాలు భవిష్యత్తులో చూసుకుందాం.. అని ప్రస్తుతానికైతే లైట్గా తీసేసుకుంటారు.
కాంగ్రెస్లో ఇలాంటి గొడవలు, గ్రూపు విభేదాలు, పదవుల రచ్చలు వెరీ కామన్. నేతలు గల్లీలో ఉన్నా.. వీరికి ఢిల్లీ సంబంధాలుంటాయి. మాట్లాడితే ఢిల్లీ అంటారు. అవసరమైతే అధిష్టానం వద్ద వాలుతారు. అసమ్మతి వాదన అక్కడ కూడా వినిపించి మరీ వస్తారు. నేను సీనియర్.. నేనే సీరియరనని నొక్కి మరీ చెప్పి వస్తారు. అంతిమంగా వీరిపై చర్యలుండవు.
సరే, సరే, ఓ సారి చెప్పెయ్యరాదు.. అనే సూచన మేరకు.. అయితే సారీ, అని చెప్పేస్తే సరి. దాసుడి తప్పులు దండంతో సరి.. అన్నమాట. గతంలోనూ ఇదే కొనసాగింది. ఇప్పుడూ అదే కొనసాగనుంది. రేవంత్ తన మార్కు పాలన కొనసాగించగలరేమో గానీ, నేతలందరినీ తన మాట వినేలా చేసుకోవడం జరగని పని. అది ఆయనకూ తెలుసు. అందుకే అన్నీ అధిష్టానానికే వదిలేస్తారు. తను చెప్పాల్సింది చెబుతాడంతే.
చర్యలు ఢిల్లీ లెవల్కే పరిమితం. ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ కూడా అంతే కానుంది. కొండా మురళి మున్నూరుకాపు, కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం. మంత్రివర్గంలో ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వేరొకరు లేరు. మరి కొండా సురేఖ మంత్రిగా కొనసాగడం వల్ల ఈ రెండు కులాల పట్ల ప్రభుత్వం కమిట్మెంట్తో ఉందనే సిగ్నల్స్ ఇచ్చినట్టే కదా. మరి ఎలా తొలగిస్తారు..? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.
దీనికి తోడు సీఎం కూడా ఈ మధ్య వేదికల మీద సామాజిక న్యాయం ..నా పాలన ద్వారానే సాధ్యమవుతున్నదని చెబుతున్నారు. ఉదాహరణగా సీతక్క, సురేఖల పేర్లను కూడా తీసుకుంటున్నారు సీఎం. అందుకే సుష్మిత ఎపిసోడ్ మళ్లీ సారీతో సరిపెట్టుకునేదిగానే చూడాల్సి వస్తుందంటున్నారు.
ఇక చిన్నారెడ్డి అంశాన్ని కూడా లైట్గానే తీసుకుంటారు. నోటీసులిచ్చారు… ఆయన దీనికి సారీ అని సమాధానమిస్తాడు. అంతే .. కొట్లాట క్లోజ్! ఇక కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో కయ్యానికి కాలుదువ్వేలా లేదు సర్కార్. అందుకే ఎంత వాదించినా వారింపు దిశగానే అధిష్టానం అడుగులుంటాయి తప్ప.. చర్యల దిశగా ఆలోచన ఉండదు. ఇది క్లారిటీ. కాంగ్రెస్లో అంతే. కాంగ్రెస్ అంతే మరి!