ఈ నగరానికేమయ్యింది..? ఓ వైపు నుసి.. మరోవైపు పొగ… ! ఇది ఒకప్పుడు ఫేమస్ యాడ్ డైలాగ్. సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో రెండు గాజులు అమ్ముకున్నాను అనే ముఖేశ్ యాడ్ లాగా ఇది కూడా అన్నట్టు. ఇప్పుడు దీన్ని తెలంగాణ స్టేట్కు అన్వయించుకోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్రానికేమయ్యింది..? అని. ఓవైపు క్షుద్రపూజలంటూ రాజకీయ పరస్పర విమర్శలు.. మరోవైపు కవిత జ్యోతిష్యుడితో సంప్రదింపులు..!
ఇవి కాకుండా ఓ వైపు రెబల్ గళాలు.. మరో వైపు నోటీసుల వాతలు అనేది కూడా మరో అంశంగా ఉంది. కానీ మనమిప్పుడు.. ఓ వైపు క్షుద్రపూజలు.. మరోవైపు జ్యోతిష్యుల సంప్రదింపుల అంశంపై చర్చించుకుందాం. హరీశ్రావు తమిళనాడు, కర్ణాటకల్లోని శివమొగ్గ, తిరుచ్చిలలోని దేవాలయకుల వెళ్లి క్షుద్రపూజలు చేశాడని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఆ పూజలు వర్షాలు పడొద్దని, కరువు రావాలని, రాష్ట్రం పడిపోవాలని చేశారనేది అధికార పార్టీ ప్రధాన ఆరోపణ.
దీనిపై హరీశ్ కూడా ఘాటుగానే స్పందించాడు. తాను గుడులకు వెళ్లింది నిజమేనని ఒప్పుకున్నాడు. కానీ క్షుద్రపూజలు చేసినట్టుగా ఆధారాలు చూపాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగులు ఇచ్చాడు. కానీ వినడం లేదు సీఎం రేవంత్రెడ్డి. ఏ మీటింగులకు వెళ్లినా ఆయన ప్రసంగంలో చివరగా దీన్ని చేర్చి మాట్లాడుతున్నాడు. కేసీఆర్, హరీశ్లను మంత్రగాళ్లుగా అభివర్ణిస్తున్నాడు. జనాలు వీరిని చెట్టుకు కట్టేసి కొట్టాలని కూడా పిలుపునిస్తున్నాడు.
ఈ అంశంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది సర్కార్. కేసీఆర్కు దైవభక్తి మెండు. యాగాలు చేపిస్తాడు. అయుత చండీయాగంలాంటివి చేసి..వీటి ద్వారా తను అనుకున్నవి ఫలిస్తాయని గట్టిగా నమ్మకం ఉన్నవాడు. ఇంత వరకు ఓకే గానీ.. క్షుద్ర పూజలు చేయించి… జనాలు ఇబ్బంది పడాలని, సర్కార్ పడిపోవాలని కోరుకునేంత అజ్ఞాని అయితే కాదనే అభిప్రాయం రాజకీయాలకు అతీతంగా వస్తోంది.
కానీ రేవంత్ మాత్రం దీన్ని తన పార్టీ రాజకీయ మైలేజీ కోసం, జనాల వద్ద బీఆరెస్ ఓ తాంత్రిక పూజలు చేసే పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నా.. జనం దీన్ని ఎంత వరకు విశ్వసిస్తున్నారనేది చెప్పలేం. ఇప్పట్నుంచే దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారంటే.. మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల వరకూ ఇది రేవంత్ ఆరోపణల అస్త్రాల్లో ప్రధాన అస్త్రంగా చేరిందని అనుకోవచ్చు.
ఇక ఈ రచ్చ ఇలా కొనసాగుతున్న తరుణంలో కవిత ఓ కొత్త చర్చను తీసుకొచ్చి పెట్టారు. విజయ్ వద్ద జ్యోతిష్యుడిగా పనిచేసిన రాధన్ అనే సిద్దాంతిని ఏకంగా తనింటికే రప్పించుకున్నారు. తన కొడుకుతో కలిసి ఆమె ఆయనకు స్వాగతం పలికి.. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. జ్యోతిష్యంపై జనాలకు నమ్మకాలున్నాయి. జాతకాలకూ కొందరు నమ్ముతారు. కేసీఆర్ కూడా. ఇప్పుడు కవిత కూడా విజయ్లా తను మొదటి ప్రయత్నంలోనే పార్టీ పెట్టి సక్సెస్ కావాలని, సీఎం కావాలనే గట్టి ప్రయత్నమే చేస్తున్నారామె.
కేసీఆర్లాగా ఆమెకూ జ్యోతిష్యాలు, జాతకాలంటే బోలెడంత నమ్మకం ఉన్నట్టుంది. అందుకే విజయ్ పాటించిన సలహాలు, సూచనలను పాటించడం ద్వారా తన రాజకీయ వ్యూహాలను దీనికి జోడించి.. సీఎం సీటును దక్కించుకోవచ్చనే ప్రయత్నమేనని ఈ పరిణామం వెనుకున్న అసలు పరమార్థమని చెప్పొచ్చు.
అసలు విజయ్ను సీఎం అవుతారని ఎవరన్నా అనుకున్నారా? రిజల్టు వచ్చేదాకా ఎవరికీ తెలియదు. చాలా మంది నోళ్లు వెళ్లబెట్టారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అక్కడ రాజకీయ శూన్యత కావొచ్చు.. విజయ్ సినీ చరిష్మా కావొచ్చు.. ఇస్తానన్న పథకాలు కావొచ్చు.. ప్రభుత్వ వ్యతిరేకతా కావొచ్చు… కలిసి వచ్చాయనుకోవాలి.
కానీ వీటికి అదనంగా జ్యోతిష్య బలం, తమ జాతకాలు కలిసి వచ్చిన వేళ అని విజయ్ అనుకుని ఉంటాడు. ఇప్పుడు కవిత కూడా ఇదే అనుకుంటున్నట్టున్నారు. అలాగే జరగాలని భావిస్తున్నట్టున్నారు. మొత్తానికి తమ సొంత బలం, దైవ బలంతో పాటు.. ఓ వైపు క్షుద్రపూజల ప్రభావం, మరోవైపు జాతకాల అనుకూలతలపైనా ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయనే విధంగా తెలంగాణలో పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడే కాదు.. దేశ వ్యాప్తంగా ఓ చర్చకైతే తెర తీసిందనే చెప్పాలి.