తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్ ఇవాళ హైదరాబాద్లోని కవిత నివాసంలో కలిశారు. కవితతో పాటు ఆమె పెద్ద కుమారుడు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కవితతో రాధన్ భేటీ రాష్ట్ర రాజకీయల్లో చర్చకు తెర తీసింది. విజయ్ తరహాలో కవిత కూడా కొత్త పార్టీ పెట్టడం.. తను సీఎం కావాలనే ఆకాంక్షను పదే పదే వినిపిస్తున్న నేపథ్యంలో జాతకాలు, జ్యోతిషాల్లో మంచి హస్తవాసిగా పేరున్న రాధన్తో ఈ విషయంలో కవిత భేటీ అయ్యారని తెలుస్తోంది.
కేసీఆర్ మాదిరిగానే కవితకూ జ్యోతిష్యాలపై అపారమైన నమ్మకం. జాతకాలను కూడా అనుసరిస్తారని అంటారు. తండ్రిలాగే ఆమె ముహూర్తాలు, రాహుకాలలను బాగా పట్టించుకుంటారు. ఏదైనా కార్యం చేసే ముందు వీటిని అనుసరించే ముందుకు సాగుతారు. ఇప్పుడు కొత్త పార్టీతో తన రాజకీయ భవిష్యత్ను తీర్చిదిద్దుకునేందుకు ఆమె అడుగులు వేస్తున్నారు.
ప్రధాన పార్టీలతో పోటీ పడి .. తను అధికారంలోకి వస్తాననే ధీమా వ్యక్తం చేయడం.. ఈ క్రమంలోనే ఆమె ప్రముఖ జ్యతిష్యుడితో భేటీ కావడం.. తన రాజకీయం గురించేననే విషయాన్ని స్పష్టం చేస్తోంది.తమిళనాడులో విజయ్ సీఎం కావడానికి ప్రధానంగా ఈ జ్యోతిష్యుడి సూచనల మేరకు నడుచుకోవడమేననే ప్రచారం ఉంది.
విజయ్ రాధన్ను ఏకంగా తన ప్రభుత్వంలో ఓఎస్డీగా కూడా నియమించడం… ప్రతిపక్షాలు దీనిపై దుమ్మెత్తిపోయడంతో వెనక్కి తగ్గారు. అయితే ఆయన సీఎం కాకముందు నుంచే పార్టీలో అధికార ప్రతినిధిగా విజయ్కు సన్నిహితంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు రాధన్. గతంలో పలుమార్లు కవిత.. విజయ్లా తనూ సీఎం అవుతానని చెబుతూ వస్తున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ తొలి ఎటెంప్ట్లోనే సీఎం అయిన విధానాన్ని ఉదహరిస్తు .. అక్కడి ఫలితాలను తనకు ఆపాదించుకున్నారు కవిత.
ఇప్పుడు ఏకంగా విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడినే ఇంటికి రప్పించుకుని మరీ చర్చించడం వెనుక.. సేమ్ విజయ్ మాదిరిగానే ఆ జ్యోతిష్యుడి సలహాలు ఫాలో అయ్యేందుకేననే విషయం స్పష్టమవుతోంది. ఇందులో దాపరికమేమీ లేకుండా.. ఆమె ఫోటోను కూడా విడుదల చేయడం వెనుక.. రాజకీయాల్లో ఇది చర్చకు రావాలని కోరుకుంటున్నట్టుగా కూడా భావించవచ్చు..