Panchadarla Mining: అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండలో మైనింగ్ రగడకు తెరపడింది. స్థానికుల నిరసనలు, పర్యావరణ వేత్తల ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం.. పంచదార్ల కొండలోని 153 హెక్టార్ల లీజును రద్దు చేసింది. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ కొండపై గ్రావెల్ తవ్వకాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కొండ దిగువన ఉన్న ప్రసిద్ధ శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, అక్కడి సహజ సిద్ధమైన జలధారల ఉనికి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మైనింగ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తవ్వకాలను తక్షణమే నిలిపివేయించారు. జలధారల రంగు మారడంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించాలని ఆదేశించారు. గనుల శాఖ ఉన్నతాధికారుల నివేదికతో మైనింగ్ లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. పర్యావరణాన్ని కాపాడుకునేలా ప్రభుత్వం మైనింగ్ను రద్దు చేయడంతో స్థానిక గ్రామాల ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.