POK Protests: ఉద్రిక్తతల వెనుక స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ – జాక్ నేతృత్వంలో దాదాపు ఏడాది కాలంగా సాగుతున్న ఉద్యమం ఉంది. వాళ్లు ప్రధానంగా 38 డిమాండ్లతో ఒక చార్టర్ను రూపొందించారు. అందులో కీలకమైనవేంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా పీఓకేలో పిండి, గోధుమలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అక్కడి ప్రజలు సబ్సిడీ ధరలపై ఆహార ధాన్యాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పీఓకే ప్రాంతంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్ భారీగా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, స్థానిక ప్రజలకు మాత్రం విపరీతమైన కరెంట్ బిల్లులు వేస్తున్నారు. ఈ వివక్షపై ప్రజల్లో ఆగ్రహం వీపరీతంగా పెరిగింది. పీఓకేలోనే కరెంట్ ఉత్పత్తి అవుతున్నా ఇక్కడి ప్రజలకు విద్యుత్ కోతలు పెట్టడాన్ని పూర్తిగా నిలిపివేయాలంటున్నారు.
ఉద్రిక్తతలకు మరో రీజన్ జులై 27న పీఓకేలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న శరణార్థుల కోసం 12 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేశారు. ఈ సీట్ల ద్వారా ఇస్లామాబాద్ తమకు నచ్చిన వారిని గెలిపించుకుని పీఓకే పాలిటిక్స్ ను కంట్రోల్ చేయాలని చూస్తోందని, ఈ కోటాను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక కౌన్సిళ్లకు అధికారాలు ఇచ్చి, అభివృద్ధి పథకాలకు నిధులు పెంచాలన్నది మరో డిమాండ్. పీఓకే మంత్రులు, సలహాదారులు, బ్యూరోక్రాట్లు, ఎమ్మెల్యేలు అనుభవిస్తున్న విలాసవంతమైన అలవెన్సులు, ప్రత్యేక అధికారాలను రద్దు చేయాలన్న డిమాండ్లను JAAC నేతలు వినిపిస్తున్నారు.
తాజాగా పీఓకేలో ఉద్రిక్తతలకు కారణం పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలే. జాక్ నేతృత్వంలో జూన్ 9న జరగాల్సిన భారీ నిరసన ప్రదర్శనకు ముందే అంటే జూన్ 5నే పాకిస్తాన్ ప్రభుత్వం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధించింది. ఆ సంస్థ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రారంభించింది. అంతే కాదు.. రావల్కోట్లో ఒక మానవ హక్కుల కార్యకర్త పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. అతను జాక్ లీడర్ కూడా. ఆయన అంత్యక్రియల కోసం వేలాది మంది జనం ఒకచోట చేరినప్పుడు పాక్ రక్షక దళాలు వారిని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశాయి. ఇది కాస్తా తీవ్ర స్థాయి ఘర్షణకు దారి తీసింది.
Also read: అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు
నిరసనలను అణచివేయడానికి జనాన్ని చెల్లాచెదురు చేయడానికి పాక్ సర్కార్ పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించింది. సాధారణంగా నిరసనకారులను చెదరగొట్టడానికి వాడే రబ్బర్ బుల్లెట్లు కాకుండా, పాక్ బలగాలు ఒరిజినల్ బుల్లెట్స్ తోనే కాల్పులు జరిపారు. దీంతో రావల్కోట్ పరిసరాల్లోనే భారీగా ప్రాణనష్టం జరిగింది. జాక్ పెట్టిన 38 38 డిమాండ్లలో 35 డిమాండ్లను ప్రాథమికంగా అంగీకరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, విఐపి సంస్కృతి రద్దు, అలాగే పాక్ శరణార్థుల కోసం రిజర్వ్ చేసిన 12 అసెంబ్లీ సీట్లు రద్దు వంటి కీలక రాజకీయ అంశాలపై వెనక్కి తగ్గింది. దీనికి తోడు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న జాక్ కమిటీని రాత్రికి రాత్రే ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ పౌర హక్కుల ఉల్లంఘనపై భారత విదేశాంగ శాఖ రియాక్ట్ అయింది. పీఓకేలో అమాయక ప్రజలపై పాక్ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత, ఆర్మీ తీరుపై అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ను నిలదీయాలని భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు. ఫైనల్ గా చూస్తే పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైనిక యంత్రాంగం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. పౌర హక్కుల సంస్థను ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి ఎటాక్ చేయడం వల్లే ఈ అల్లర్లు ఇంత తీవ్ర రూపం దాల్చాయని అంటున్నారు.
Also read: రణ్వీర్ సింగ్ బాక్సాఫీస్ సునామీ.. ‘పుష్ప-2’ రికార్డులను తిరగరాసిన ‘దురంధర్-2’