AP Politics: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం పార్వతీపురం నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన బోనెల విజయచంద్ర తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సాధారణంగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలతో సఖ్యతగా ఉంటూ తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చూసుకుంటుంటారు. అయితే విజయచంద్ర స్టైల్ మాత్రం డిఫరెంట్గా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఆ జిల్లాకు చెందిన మంత్రి సంధ్యారాణి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య తంపులు పెట్టే ప్రయత్నం చేస్తూ విజయచంద్ర అభినవ ‘నారదుడు’ అనిపించుకుంటున్నారంట. అసలు ఆ ఎమ్మెల్యే లెక్కలేంటి? ఎందుకు పనిగట్టుకుని జిల్లా మంత్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు?
కలహభోజనుడు .. పురాణాల పై అవగాహన ఉన్నవారికి దీని అర్థం బాగా తెలుసు. ఇతరుల మధ్య గొడవలు పెట్టడం ద్వారా ఆనందం లేదా లాభం పొందే వ్యక్తి అని అర్థం. పురాణాల్లో నారదుడిని ‘కలహభోజనుడు’ అని అంటారు, కానీ ఆయన లోక కళ్యాణం కోసం అలా చేస్తారని చెబుతారు. అయితే ఇపుడెందుకు మాకీ పురాణ గాథలు అనుకుంటున్నారా.. వెయిట్ వెయిట్ అక్కడికే వస్తున్నాం.. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇపుడు ఇలాంటి రాజకీయమే నడుస్తోందట. ఇద్దరు అమాత్యుల మధ్య అగాధం సృష్టించి తాను దూసుకుపోవాలని చూస్తున్నారంట పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎమ్మెల్యే తానే అవ్వడంతో అధికారం మొత్తం తన గుప్పిట్లోనే ఉండాలన్న ఉద్దేశంతో సదరు ఎమ్మెల్యే వారిద్దరికీ మధ్య చిచ్చు పెడుతున్నారన్న టాక్ మన్యంలో కోడై కూస్తోందట.
పార్వతీపురం మన్యం జిల్లా నుంచి గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమ శాక మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మన్యం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్చార్జ్ మంత్రిగా అచ్చెన్న సమావేశాలకు, సమీక్షలకు హాజరవుతూ ఉంటారు. సంధ్యారాణి జిల్లాను అంటి పెట్టుకుని ఉండే మంత్రి. జిల్లా మంత్రిగా సంధ్యారాణికి సహజంగానే ఎక్కువ అధికారాలుంటాయి.
Also Read: TIMS Sanathnagar: సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిలో.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు..!
అయితే ఈ పాయింటే జిల్లా కేంద్రం ఎమ్మెల్యే విజయచంద్రను నిద్రపోనివ్వడం లేదట. ఓ మహిళా మంత్రి తమ మీద అధికారం చలాయించడమేంటి అనుకుంటున్నారో, ఏమో మంత్రిని చూస్తే సదరు ఎమ్మెల్యే మండిపోతున్నారట. అందుకే ఇంచార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కి దగ్గరవుతూ జిల్లా మంత్రిని పక్కన పెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారని కూటమి నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. జిల్లాలో ఏ కార్యక్రమమైనా, సభలు సమావేశాలు జరిగినా.. ఇంచార్జ్ మంత్రి జిల్లాకు విచ్చేసినా జిల్లా మంత్రికి ఆహ్వానాలు అందడం లేదంట. అటు అచ్చెన్న కూడా జిల్లాపై పట్టు సాధించేందుకు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారట.
మరోవైపు సంధ్యారాణి వరుస వివాదాలు కూడా బోనెలకు , అచ్చెన్న కు కలిసి వస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది. సంధ్యారాణి పీఏ సతీష్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆమె కుమారుడు పృథ్వీపై విమర్శలు, నియోజకవర్గంలో సిబ్బంది తొలగింపులు, మంత్రి కాన్వాయ్ ప్రమాదం వంటి అంశాలు అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించాయి. అందుకే సందిట్లో సడేమియా అన్నట్లు జిల్లా మంత్రికి బదులు ఇంచార్జ్ మంత్రిని విజయచంద్ర భుజానానికి ఎత్తుకుంటున్నారని సొంత కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. సంధ్యారాణి వివాదాలు, అచ్చెన్నతో స్నేహం తనకు కూటమి 2.0 లో మంత్రి పదవి దక్కేలా చేస్తుందన్న ఆశతో సదరు ఎమ్మెల్యే ఉన్నట్లు టాక్ నడుస్తుందట. మన్యం జిల్లా కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని విజయచంద్ర తనకు తానే ప్రచారం చేసుకుంటున్నారంట.
అందుకే సంధ్యారాణిని దూరం పెడుతూ అచ్చెన్నాయుడితో సాన్నిహిత్యాన్ని బలపరుచుకుంటున్నారనే టాక్ నడుస్తోందట. అదలా ఉంటే మరోవైపు పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కూడ తన సతీమణి కోసం సొంతం చేసుకోవాలని విజయచంద్ర పావులు కదుపుతున్నారంట.అన్ని తాను అనుకున్నట్లుగా జరగాలంటే గిరిజన మంత్రి సంధ్యారాణి కంటే ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న అచ్చెన్నాయుడు తోనే సాధ్యమన్నది విజయచంద్ర ఎత్తుగడగా పార్వతీపురం వాసులు చర్చించుకుంటున్నారు.
Also Read: Rajya Sabha polls-2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్.. 37 సీట్లకు ఎన్నికలు, తెలంగాణలో రెండు సీట్లకు
అందుకు తగ్గట్లే ఇప్పటికే పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సతీమణి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి కూడా తమ కుటుంబానికే దక్కాలని ఇప్పటి నుండే మేడమ్ నాయకులకు, కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంట. మేడమ్, సర్ ఇద్దరు కలిసి పార్టీని తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే ప్రణాళికలు రచిస్తున్నారట. దానికి తగ్గట్లే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారని… అందుకే కలహభోజనుడి పాత్ర పోషిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
తన సతీమణిని పొలిటికల్గా ఫోకస్ చేసే ఎత్తుగడలో భాగంగానే ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. అందుకే విజయచంద్ర పూర్తిగా విశాఖకే పరిమితమై.. నామ్ కే వాస్తేగా నెలకోసారి నియోజకవర్గానికి చుట్టం చూపుగావచ్చి పోతున్నారంట. విశాఖలో ఉంటూ వచ్చి పోయే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారనే ప్రచారం గట్టిగానే నడుస్తోంది. జిల్లా మంత్రి సంధ్యారాణి వివాదాలను అడగని వారికి కూడా చెబుతూ.. గుర్తు లేనివారికి గుర్తు చేస్తున్నారట. చూడాలి మరి విజయచంద్ర వేస్తున్న ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో.
Story by: Apparao, Big Tv
Also Read: ACB Raids: బల్దియా ఆఫీస్ పై ఏసీబీ రెయిడ్స్.. వరుస దాడులతో జంకుతున్న అధికారులు