Mancherial Congress: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది.. మంత్రి వర్గంలో తమకు బెర్తు దక్కుతుందో లేదో అన్న అనుమానాలతో ఆశావహులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కుతున్నారు. కాంగ్రెస్లో పదవులంటే హైకమాండ్దే ఫైనల్ డెసిషన్.. అయినా తోటి నేతలపై ఆరోపణలు గుప్పిస్తూ కొందరు రచ్చకెక్కుతున్నారు. జాప్యం జరుగుతున్న కొద్ది మంత్రి పదవుల విషయంలో నేతల వాయిస్ మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అసలీ పరిస్థితికి కారణమేంటి?
మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతూనే ఉన్న ప్రచారం
తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి విస్తరణ .. అదిగో, ఇదిగ అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావహులాంతా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సామాజిక వర్గాల వారీగా నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. అయితే విస్తరణ జాప్యం అవుతుండటంతో ఆశావహుల్లో అసంతృప్తి బయటపడుతోంది. తమకు పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం నాయకత్వానికి తలనొప్పిగా మారుతుందట. అలాంటి వారి లిస్టులో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు చేరారు.
జిల్లా కాంగ్రెస్ నేతలపై ప్రేమ్సాగర్రావు విమర్శలు
ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి అడ్డుపడుతున్నారని అక్కసు వెల్లగక్కారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావ్ కూడా తనకు మంత్రి పదవి వస్తుందో రాదో అని అనుమానపడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన నేత అన్యాయం చేస్తున్నారని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రేమ్సాగర్రావు మంచిర్యాల సభలో చేసిన ఆ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో కలకలం రేపాయి. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇస్తారా, కష్టకాలంలో పదేళ్ళు పార్టీని కాపాడిన వారికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
తమ పరిస్థితి ఏంటని ప్రేమ్సాగర్రావు ఆవేదన
తన గొంతు కోయడమంటే ఆదివాసీల గొంతు కోయడమేనని ప్రేమ్సాగర్రావు హాట్ కామెంట్స్ చేసారు.. తన అభిమానులు కార్యకర్తలు పార్టీ మారి వచ్చిన వారికి మంత్రి పదవి వస్తుంది అనే వార్తలతో డిప్రెషన్ లో ఉన్నారని, కాస్త కాలంలో పార్టీ తో ఉన్న తమ పరిస్థితి ఏంటని తనను ప్రశ్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు ఈ కామెంట్స్ రాష్ట్ర కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టినట్లు అయిందంట. పార్టీ కోసం పని చేసిన ప్రేమ్సాగర్ రావు ఎన్నికల ప్రచార సమయంలో ఇంద్రవెల్లి సభ మొదలు, మంచిర్యాలలో ఖర్గే సభలు విజయవంతం చేశారన్న గుడ్విల్ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రేమ్ సాగర్రావ్కి మంత్రి పదవి ఇవ్వకుంటే కార్యకర్తల్లో ఎలాంటి మెసేజ్ పోతుందోనని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడిందంట.
ఎస్సీ కోటాలో వివేక్కు కేబినేట్ బెర్త్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం
ప్రేమ్సాగర్ ఎవరినుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారన్న దానిపై జిల్లా నేతల మధ్య చర్చ జరుగుతుంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అయిందనే ఉహగానాల నేపథ్యంలో ప్రేమ్సాగర్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంశంగా మారింది. వివేక్ టార్గెట్గానే ప్రేమ్ సాగర్రావు వ్యాఖ్యలు చేశారనే టాక్ జిల్లాలో నడుస్తుందట. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నేతలు మంత్రి పదవులు కోరుతున్నారని పరోక్షంగా వివేక్ను ఉద్దేశించి విమర్శలు చేశారంటున్నారు. సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని కేబినెట్ బెర్త్ల విషయంలో అధిష్టానం చర్చలు జరుపుతోంది.
సామాజిక అంశాలను పరిగిణలోకి తీసుకుని తమ సామాజిక వర్గాలకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ జనాభాకు అనుగుణంగా పదవులు దక్కలేదని …ఈసారైనా మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు. ఈ ఈక్వేషన్లను దృష్టిలో ఉంచుకుని వివేక్కు ఈసారి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అనే ప్రచారం జరగుతోంది. ఈ సందర్భంలో వివేక్ టార్గెట్గా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కామెంట్స్ చేశారంటున్నారు.
Also Read: కూల్చే కుట్రలు..? “కొత్త” కలకలం..!!
ప్రేమ్సాగర్రావు వ్యాఖ్యలపై స్పందించిన గడ్డం వివేక్
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు చేసిన వ్యాఖ్యలపై గడ్డం వివేక్ స్పందించారు. ఏయే పార్టీలు మారామని కాదు ప్రజలకు ఏం చేశామనేది చూడాలని ప్రేమ్సాగర్కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కాకా వెంకటస్వామి కుటుంబం ఎంతో చేసిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మా కుటుంబం కీలక పాత్ర పోషించిందని గట్టిగా చెబుతున్నారు గడ్డం బ్రదర్స్. తాను మంత్రి పదవి కోసం ఎప్పుడూ అడగలేదని.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని ఎమ్మెల్యే వివేక్ వెల్లడిస్తున్నారు. ఎవరిపై విమర్శలు చేయకుండా, తమ కుటుంబం చేసిన సేవలను చెబుతూ…తాను రేసులోనే ఉన్నానన్న విషయాన్ని వివేక్ చెప్పకనే చెపుతున్నారు
విస్తరణలో జాప్యంతో నేతల మధ్య మాటల యుద్ధం
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ విస్తరణలో జరుగుతున్న జాప్యం.. నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే బాహాటంగా ప్రభుత్వ పెద్దల సమక్షంలోనే విమర్శించే స్థాయికి రావడంతో నేతల మధ్య గ్యాప్ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి