Rajinikanth’s Recommendation for Minister Post: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేకపోవడం అశ్చర్యం కలిగిస్తుంది. సీమలో అనంతపురం ,కర్నూలుకు మూడు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు కడపకు ఓ పదవి ఇచ్చారు. అయితే తన సొంత జిల్లాకు మాత్రం న్యాయం చేయలేకపోయారు. మంత్రివర్గం కూర్పులో లెక్కలు కుదరలేదా? లేకపోతే తాను ఉన్నాను కదా అని జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోలేదా? అసలేం జరిగిందన్న దానిపై జిల్లాలో పెద్ద చర్చే నడుస్తోందిప్పడు రాయలసీమలో ఈసారి టీడీపీ తన ప్రభంజనాన్ని చాటింది.
2009 తర్వాత మొదటి సారిగా జీడి నెల్లూరు , పూతలపట్టు, నందికొట్కూరు, కొడమూరులలో విజయం సాధించింది. దీంతో పాటు కూటమితో కలుపుకుని సీమలోని 52 సీట్లకు గాను 45 చోట్ల విజయం సాధించింది. 1994 తర్వాత తిరిగి ఇప్పుడు టీడీపీకి ఆ స్థాయి విజయం దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఓటమి పాలయింది. మొత్తం జిల్లాలో జనసేన తో కలిపి 12 చోట్ల గెలుపొందింది. ఎన్నికల పలితాల తర్వాత జిల్లాకు ఖచ్చితంగా రెండు మంత్రి పదవులు వస్తాయని అందరు భావించారు.
అయితే జిల్లాలో అగ్రనేతలు, అశావహుల అశలు అడియాసలయ్యాయి. జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తప్ప మిగతా ఎవ్వరికి కేబినెట్లో చోటు దక్కలేదు. విభజిత చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు ఎంఎల్ ఎ అమర్నాథ్రెడ్డికి, అన్నమయ్య జిల్లా నుంచి నల్లారి కిషోర్ కూమార్రెడ్డికి అవకాశం వస్తుందని అందరు భావించారు. ఇద్దరు దిగ్గజ రాజకీయాల కుటుంబాల వారు కావడంతో ఖచ్చితంగా ఒకరికి వస్తుందని భావించారు. దాంతో పాటు కడప జిల్లాకు సంబంధించి పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి భార్య మాధవిరెడ్డికి అవకాశం వస్తుందని భావించారు. అయితే ఆ ముగ్గురికి ఛాన్స్ దక్కలేదు.
మరో వైపు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలలో కూడా మంత్రిపదవులకు గట్టి పోటీ కనిపించింది. జర్నలిస్టు అయిన మురళీమోహన్ పూతలపట్టు నుంచి గెలిచారు. ఆయన తనకు తటస్థుల కోటాలో అవకాశం వస్తుందని భావించారు. మరో వైపు డాక్టర్ థామస్ జీడి నెల్లూరులో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టానని అందు వల్ల తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని ధీమాగా కనిపించారు. మరో వైపు సత్యవేడు ఎంఎల్ ఎ ఆదిమూలం కూడా తన దైన రీతిలో ప్రయత్నించినట్లు సమాచారం. తనకు సన్నిహితుడైన తమిళ తలైవార్ రజనీకాంత్ ద్వారా సిపార్సు చేయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అంత మంది ప్రయత్నించడంతో ఎవరినీ నొప్పించడం ఇష్టంలేక చంద్రబాబు అసలు ఎవరికీ ఇవ్వలేదంటున్నారు. కడప జిల్లా రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి గెలవడం అది కూడా శ్రీకాంత్ రెడ్డిని ఓడించడంతో.. మాధవిరెడ్డికి కాకుండా అయనకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దానికితోడు 2019 వరకు రాంప్రసాద్ రెడ్డి వైసీపీలో ఉండటంతో ఆ పార్టీకి పూర్తిగా చెక్ పెట్టడం ఎలాగో ఆయనకు తెలుసని అది పార్టీకి ఉపయోగ పడుతుందని భావించి అవకాశం కల్పించారని ప్రచారం జరుగుతుంది.
వైసీపీ కేబినెట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు మంత్రి పదవులు ఉండేవి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎంగా నారాయణస్వామి, రోజా ముగ్గురు మంత్రులుగా కొనసాగారు. ఈ సారి సీఎం మినహా జిల్లాకు ఒక మంత్రి పదవి లేక పోవడంపెద్ద లోటుగా బావిస్తున్నారు. నిత్యం వివిఐపిలు వచ్చే చోట కనీసం ప్రోటో కాల్ చేయడానికి అయిన ఓ మంత్రి ఉండాల్సింది అంటున్నారు. మరి చంద్రబాబు లెక్కలు ఎలా ఉన్నా ప్రోటోకాల్ బాధ తప్పిందని జిల్లా యంత్రాంగం మాత్రం హ్యాపీ అయిపోతుంది.