Juvenile Crime: మందలించిందని స్కూల్ ప్రిన్సిపల్ హత్య..అదీ అత్యంత కిరాతకంగా 27సార్లు కత్తితో పొడిచి పొడిచి.. పట్టుమని రెండు వందల రూపాయల విలువ కూడా చేయని క్రికెట్ బ్యాట్ కోసం పదేళ్ల బాలిక దారుణ హత్య సోషల్ మీడియా ద్వారా పరిచయమైన యువకునితో ప్రేమలో పడి అడ్డుపడుతుందని అతనితో కలిసి కన్నతల్లినే కిరాతకంగా చంపిన దారుణం.. ఒళ్లు జలదరింప చేసిన ఈ నేరాలను ఏ కరడుగట్టిన నేరస్తులో చేశారని అనుకుంటున్నారా? కాదు కాదు మైనారిటీ కూడా తీరని జెన్ జీ జనరేషన్ పిల్లలు చేసిన ఘాతుకాలివి.
కర్ణుని చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా దుర్వ్యసనాలు.. తాము అనుకున్నదే జరగాలన్న మంకుపట్టు.. హింసకు పెద్ద పీట వేస్తున్న సినిమాలు క్రైం సీరియళ్లు వెబ్ సిరీస్లు అరచేతిలోకి వచ్చిన మొబైల్ ఫోన్లు పోర్న్ వీడియోలు చూసే వెసులుబాటు మత్తుకు అలవాటుపడటం ఇలా రకరకాల కారణాలతో మైనారిటీ కూడా తీరని పసివయసులోనే ఊహించని నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని ఉదంతాల్లో మనిషిని ఎలా చంపాలని గూగుల్ లో సెర్చ్ చేసి మరీ దారుణాలకు తెగబడుతుండటం గమనార్హం.
నల్గొండలో జరిగిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులు జరిపిన దర్యాప్తులో ఈ దారుణానికి ఒడిగట్టింది రూపారెడ్డి ప్రిన్సిపల్ గా ఉన్న స్కూల్లోనే చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులని నిర్ధారణ అయ్యింది. ముగ్గురిలో ఓ విద్యార్థి స్యూల్ హాస్టల్ లో ఉండేవాడు. వీరిని విచారించినపుడు పోలీసులకే షాక్ తగిలేలా దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. హాస్టల్ లో ఉంటున్న స్టూడెంట్ వద్ద మొబైల్ ఫోన్, డబ్బు దొరకటంతో టీచర్లు, ప్రిన్సిపల్ రూపారెడ్డి గట్టిగా మందలించారు. ఆ తరువాత డే స్కాలర్ గా మార్చారు. అప్పటికే సదరు విద్యార్థికి మద్యం సేవించే అలవాటు ఉంది. బైక్ పై మోజు కూడా ఉంది. ఇక, తల్లిదండ్రుల ముందే తనను మందలించిందని రూపారెడ్డిపై కక్ష పెంచుకున్న సదరు విద్యార్థి పక్కాగా ప్లాన్ చేసి ఆమెను కత్తితో 27సార్లు పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. దీనికి మరో ఇద్దరు సహకరించారు.
Also read: రూ.599లకే ట్రెండీ బ్లూటూత్ స్పీకర్ ! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ
కొంతకాలం క్రితం కూకట్ పల్లిలో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు కనీసం రెండు వందల రూపాయల విలువ కూడా లేని క్రికెట్ బ్యాట్ కోసం పదేళ్ల బాలికను కత్తితో పొడిచి చంపాడు. పక్క ఇంట్లో ఉంటున్న బాలిక ఇంట్లోకి భవనం టెర్రస్ పైనుంచి ప్రవేశించి బ్యాట్ ను అపహరించుకుని తీసుకెళుతుండగా చూసిన బాలిక అడ్డుకోవటంతో ఈ దారుణానికి తెగబడ్డాడు.
జీడిమెట్లలో పదో తరగతి చదువుతున్న బాలికకు సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రాం ద్వారా శివ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. విషయం తెలిసి తల్లి అంజలి ఈ వయసులో నీకు ప్రేమ అవసరమా? అని మందలించింది. దాంతో తల్లిపై కక్ష పెంచుకున్న బాలిక ప్రిఉడు శివ..అతని తమ్ముడు యశ్వంత్ తో కలిసి జన్మనిచ్చిన తల్లినే కిరాతకంగా చంపేసింది. ఇలా చెబుతూపోతే మైనర్లు చేసిన నేరాల జాబితా చాంతాడంత అవుతోంది.
పసిప్రాయంలోనే కొందరు పిల్లలు ఇంతటి దారుణ నేరాలకు పాల్పడుతున్నారంటే తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత అని మానసిక వైద్యుడు అజయ్ చెప్పారు. ఇప్పటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎలాగూ కనిపించకుండా పోయాయన్నారు. ఉన్న తల్లిదండ్రులైన పిల్లలను సరిగ్గా చూసుకుంటున్నారా? అంటే..అదీ లేదని తెలిపారు. ఎవరి ఉద్యోగాల్లో వాళ్లు బిజీగా లైఫ్ గడిపేస్తున్నారు తప్పితే పిల్లలను పెద్దగా పట్టించుకోవటం లేదని చెప్పారు. ఉద్యోగాలు చేయకుండా ఇళ్లలోనే ఉంటున్న మహిళలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారన్నారు. ఏది అడిగితే అది కొనివ్వటం..అంతటితో బాధ్యత తీరిపోయిందన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. తప్పితే కడుపున పుట్టిన పిల్లలు చెడు స్నేహాలు చేస్తున్నారా? ఏవైనా దురలవాట్లకు బానిసలయ్యారా? అసలు స్కూల్..కాలేజీలకు సరిగ్గా వెళుతున్నారా? లేదా? అన్నది కూడా పట్టించుకోవటం లేదని వివరించారు.
Also read: నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల రగడ.. అనుమతి లేదంటూ అడ్డుకున్న తెలంగాణ కానీ..?
ఇక, ప్రస్తుతం సినిమాల్లో చూపిస్తున్న విపరీతమైన హింస..ఓటీటీల్లో వస్తున్న క్రైం వెబ్ సిరీస్ లు..క్రైం సీరియళ్లు చిన్నపిల్లల మెదళ్లలో విషం నింపుతున్నాయన్నారు. తరచుగా వీటిని చూస్తుండటం వల్ల పిల్ల్లల్లో వాళ్లకు తెలియకుండానే హింసాత్మక ధోరణి పెరిగిపోతోందని వివరించారు. ఇక, అరచేతిలోకి వచ్చేసిన మొబైల్ ఫోన్ చిన్నారులపాలిట అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. డాటా ఉంటే చాలు ఎక్కడపడితే అక్కడ ఏది కావాలనుకుంటే అది చూసే వీలుండటంతో ఎంతోమంది పిల్లలు పోర్న్ సైట్లకు అలవాటు పడుతున్నారని చెప్పారు. తెలిసీ తెలియని వయసులో వీటిని చూస్తూ అలాంటి అనుభవాల కోసం అర్రులు చాస్తూ అత్యాచారాలు చేసిన మైనర్ బాలుర ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. గూగుల్ లో సెర్చ్ చేసి మరీ నేరాలకు పాల్పడుతున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. మద్యం, గంజాయి మత్తు కూడా మైనర్లు ఊహించని దారుణ నేరాలు చేయటానికి కారణమవుతున్నాయన్నారు.
ఎంత బిజీగా ఉన్నా ప్రతీ తల్లిదండ్రులు రోజులో కనీసం ఓ రెండుగంటలు తమ తమ పిల్లలకు సమయం ఇవ్వాలని డాక్టర్ అజయ్ చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా చెప్పుకోగలిగే భరోసాను పిల్లల్లో కల్పించాలన్నారు. పిల్లలు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? అన్నదానిపై కన్నేసి పెట్టాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి పిల్లలు ఎలా వ్యవహరిస్తున్నారన్నది తరచూ తెలుసుకోవాలన్నారు.
మొబైల్ కొనిచ్చేశాం కంప్యూటర్ సమకూర్చాం అన్నట్టుగా కాకుండా పిల్లల స్క్రీన్ టైంపై ఖచ్చితంగా ఆంక్షలు పెట్టాలన్నారు. ఇంటర్ నెట్ ద్వారా వాళ్లు ఏం బ్రౌజ్ చేస్తున్నారన్నది తెలుసుకుంటుండాలని చెప్పారు. పోర్న్..అభ్యంతరకర సైట్లు ఓపెన్ కాకుండా సెట్టింగ్స్ లోకి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాల వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను స్పష్టంగా తెలియ చేయాలని పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో కూడా అధ్యాపకులు పిల్లలపై కన్నేసి పెట్టాలన్నారు. ఎవరైనా దురలవాట్లకు అలవాటుపడ్డట్టు గుర్తిస్తే వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించాలన్నారు. అప్పుడే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుందని చెప్పారు.
Also read: నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల రగడ.. అనుమతి లేదంటూ అడ్డుకున్న తెలంగాణ కానీ..?