Phone tapping case: కీలక నిందితులను విచారించారు.. వందల మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చేయాల్సిన దర్యాప్తు అంతా చేశారు. అయినా సరే.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దాదాపుగా అంతా మర్చిపోతున్న సమయంలో.. ఇదే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ టీమ్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సజ్జనార్ ఎంట్రీతో.. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతుందా?
రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టించిన.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నమోదైన 21 నెలల తర్వాత.. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం.. టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. దీంతో.. ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుందనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఐదుగురు ఐపీఎస్లు సహా తొమ్మిది మంది పోలీసు అధికారులతో.. డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. మొన్నటిదాకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరినే.. మరోసారి సిట్ దర్యాప్తు అధికారిగా నియమించడం ఇంట్రస్టింగ్గా మారింది. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించారు. వారితో పాటు వందల మంది సాక్షుల వాంగ్మూలాలు సేకరించారు. ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో జరగబోయే దర్యాప్తులో.. ఇంకా ఎవరు బయటికొస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు అధికారులు దర్యాప్తు చేసినా.. ఇన్వెస్టిగేషన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం జరిగిందే ప్రచారం జరుగుతున్న క్రమంలో.. సిట్ ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశముంది. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటం ద్వారా.. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహకరించారనే ఆరోపణలతో.. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది.
అప్పట్లోనే టాస్క్ఫోర్స్ రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్రావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిని విచారణలోనే.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి.. 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రభాకర్రావు, మరో నిందితుడు శ్రవణ్రావు అమెరికాలో తలదాచుకోవడంతో.. రెడ్కార్నర్ నోటీసులు జారీ చేయించి భారతదేశానికి రప్పించారు. వారిని రప్పించినా.. ఎస్ఐబీలో కీలక ఆధారాలను ధ్వంసం చేయడంతో దర్యాప్తులో పురోగతి కనిపించలేదు.
సిట్ విచారణలో.. కీలక నిందితుడు ప్రభాకర్ రావు నోరు విప్పలేదు. కీలక సమాచారం ఏదీ ఇవ్వలేదని సిట్ తెలిపింది. అధికారుల ఆదేశాలతో.. అంతా రూల్స్ ప్రకారమే చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు, వ్యాపారస్తులు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్పై ప్రభాకర్ రావు స్పష్టత ఇవ్వలేదు. రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందని సమాధానమిచ్చారు. హార్డ్ డిస్కుల ధ్వంసం కూడా నిబంధనల ప్రకారమే చేశానన్నారు. ఈ-మెయిల్, క్లౌడ్ డేటాలో వ్యక్తిగత సమాచారం మాత్రమే డిలీట్ అయిందని తెలిపారు. ట్యాపింగ్ డివైజ్లు అమెరికాలోనే మరిచిపోయానని తెలిపారు.
కానీ.. అసలు సూత్రధారులపై సమాచారం ఇవ్వలేదు. దాంతో.. దర్యాప్తు ముందుకు కదల్లేదు. పైగా.. ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో చెప్పిన ఉన్నతాధికారులను విచారించేందుకు అవాంతరాలు ఎదురవడంతో.. ఈ కేసు విచారిస్తున్న సిట్ టీమ్ ముందుకెళ్లలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. వారిని విచారిస్తే గానీ.. కేసు దర్యాప్తు కొలిక్కి రాదనే అభిప్రాయాలు వ్యక్తమైనా.. ఇన్నాళ్లూ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ వ్యవహారం వెనుక.. అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలున్నా.. ఆధారాల్ని ధ్వంసం చేశామనే ధీమాతోనే ప్రభాకర్ రావు వాస్తవాలను చెప్పడం లేదని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మరింత లోతుగా విచారించేందుకు.. ఉన్నతాధికారులు, నాయకుల గుట్టు విప్పేందుకే.. సిట్ ఏర్పాటు చేశారనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుకు మరో షాక్ తగిలింది. సిట్ దర్యాప్తునకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన కస్టడీని డిసెంబర్ 25 దాకా పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని.. ఇంకొన్ని రోజులు విచారణ జరిపేందుకు.. కస్టడీ పొడిగించాలని.. ప్రభుత్వం తరఫు లాయర్లు కోరారు. ఇందుకు ఏకీభవించిన ధర్మాసనం ప్రభాకర్ రావు కస్టడీని వారం పొడిగించింది. ఆ మరుసటి రోజే.. ఆయన్ని విడుదల చేయాలని సిట్ను ఆదేశించింది. ఈ సమయంలో.. తదుపరి విచారణ దాకా.. ప్రభాకర్ రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను.. జనవరి 16కు వాయిదా వేసింది. అయితే.. ఇన్నాళ్లూ తేల్చనిది.. ఈ నెల రోజుల్లో కొత్తగా ఏర్పడిన సిట్ ఏం తేల్చబోతోందనేది ఆసక్తి రేపుతోంది.
ఎప్పుడో క్లైమాక్స్కి చేరిందనుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. అప్పుడు ఎక్కడుందో.. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అందుకే.. వీలైనంత త్వరగా ఈ కేసుని తేల్చేయాలని.. ప్రభుత్వం, పోలీసులు డిసైడ్ అయ్యారు. అందుకోసమే.. సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటు చేశారు. అసలు.. 21 నెలల దర్యాప్తులో ఇప్పటిదాకా తేలిందేంటి? ఈ ఒక్క నెలలో తేల్చాల్సిందేమిటి? అసలు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ఇకపై ఏం జరగబోతోంది?
తెలంగాణ రాజకీయాలను, పోలీసు వర్గాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. సీనియర్ ఐపీస్ అధికారి వీసీ సజ్జనార్.. ఈ కేసు దర్యాప్తు కోసం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్లో ఉండటంతో.. దర్యాప్తు కీలకంగా మారింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూశాక.. సజ్జనార్ ఎంట్రీ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎంత వేగంగా మారుతుందనేది ఆసక్తిగా మారింది. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ, మిగతా నిందితుల స్టేట్మెంట్ల తర్వాత.. ఈ కేసు దర్యాప్తులోకి సజ్జనార్ ఎంట్రీ ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న సజ్జనార్ని.. సిట్ టీమ్ని ముందుండి నడిపించే బాధ్యత అప్పజెప్పడం చర్చనీయాంశంగా మారింది.
దాదాపు 21 నెలలుగా సుదీర్ఘంగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో.. ఇప్పటికే సిట్ కీలక ఆధారాలను సేకరించింది. ఇంటలిజెన్స్ బ్యూరోలో.. ప్రభుత్వ ఆదేశాలకు అతీతంగా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని నడిపినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న లాంటి సీనియర్ అధికారులను అరెస్ట్ చేయడంతో.. డేటాని ఎలా ధ్వంసం చేశారు? ఎవరెవరి ఫోన్ కాల్స్ని గుట్టుగా విన్నారనేది బయటకొచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత.. సాక్ష్యాలను చెరిపేసేందుకు హార్డ్ డిస్క్లను మూసీ నదిలో పడేసిన పరిణామం.. ఈ కేసులో అతిపెద్ద మలుపు. కేవలం.. ప్రతిపక్ష నేతలే కాకుండా.. సొంత పార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లని కూడా ట్యాప్ చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. దాంతో.. సిట్ ఇప్పుడు ఏం తేల్చబోతోందనేది ఆసక్తిగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుని ఓ కొలిక్కి తీసుకురావడానికి.. పోలీసులకు సమయం తక్కువగా ఉంది. వీలైనంత త్వరగా.. ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డీజీపీ కూడా ఆదేశించారు. అందువల్ల.. ట్యాపింగ్ వ్యవహారంలో.. మాస్టర్ మైండ్ ఎవరు? కేవలం అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందా? లేక దీని వెనుక ఉన్న రాజకీయ పెద్దలు ఎవరనే క్లారిటీ ఇప్పుడు రావాల్సి ఉంది. ముఖ్యంగా.. ప్రభాకర్ రావు నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టడమే.. కొత్త సిట్ ముందున్న పెద్ద టాస్క్. ధ్వంసమైన హార్డ్ డిస్క్ల నుంచి ఎంతవరకు డేటాని రికవరీ చేయగలిగారన్నది కూడా కీలకమే. ఈ కొద్ది రోజుల్లో సేకరించబోయే పక్కా ఆధారాలతో.. పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ని కోర్టుకు సమర్పించడమే ఇప్పుడు ముఖ్యమైన విషయం. ఇప్పటికే.. పోలీస్ కస్టడీలో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. డివైజ్లలో ఎలాంటి సమాచారం లేదు. ముందుగానే వాటిని ధ్వంసం చేశారు. నక్సలైట్ల పేరుతో అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయ్. ఇది కేవలం.. రాజకీయ సమస్య కాదు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం. అందువల్ల.. విచారణలో ప్రభాకర్ రావు నుంచి ఇప్పుడు ఎలాంటి కీలక విషయాలు రాబడతారనేది కూడా సస్పెన్స్గా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు రాబోయే కొన్ని రోజులు పాటు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు కావడమే.. ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపుగా కనిపిస్తోంది. 21 నెలలుగా ఈ కేసు ఓ కొలిక్కి రాకపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. వీలైనంత త్వరగా పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడమే ఇప్పుడు సిట్ ముందున్న ప్రధాన లక్ష్యం. 9 మంది నిపుణులైన అధికారులతో కూడిన ఈ టీమ్.. కేవలం స్టేట్మెంట్ల మీద కాకుండా ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలపై దృష్టి పెడుతుంది.
ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీని కూడా సుప్రీంకోర్టు డిసెంబర్ 25 దాకా పొడిగించింది. ఆయన తన ఐ క్లౌడ్, ఈమెయిల్ పాస్వర్డ్లను కూడా సిట్ అధికారులకు ఇచ్చారు. ఇప్పుడు.. సజ్జనార్ టీమ్ ఈ డేటా ద్వారా ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది విశ్లేషించనుంది. ధ్వంసమైన 26 హార్డ్ డిస్క్లకు బదులుగా కొత్తవి ఎందుకు పెట్టారు? అసలు డేటా ఏమైంది? అనే కోణంలోనూ సజ్జనార్ టీమ్ లోతైన విచారణ జరపనుంది. ఇప్పటివరకు ఈ కేసులో కేవలం కింది స్థాయి అధికారులు మాత్రమే అరెస్టయ్యారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా.. ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న రాజకీయ నేతలు, ఇంకొందరు ఉన్నత స్థాయి అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 26న ప్రభాకర్ రావు కస్టడీ ముగిసిన తర్వాత.. సిట్ ఇచ్చే రిపోర్ట్ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది.
Story By Anup, Big Tv