Target MLA Sravani: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి ఎప్పుడు ఇన్చార్జ్ మంత్రి వచ్చినా ఎమ్మెల్యే గురించే పంచాయతీ నడుస్తోందంట. ఆ సెంటిమెంట్ సెగ్మెంట్ నుంచి యువ మహిళ బండారు శ్రావణి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ కుర్ర ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి సెగ్మెంట్ టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ యువ ఎమ్మెల్యేని పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా విభేదిస్తున్నారు .. అసలు వారికి ఎమ్మెల్యేతో వచ్చిన ఇబ్బందేంటి? ఎప్పుడు ఇన్చార్జి మంత్రి వచ్చినా ఎందుకు పంచాయతీలు పెడుతున్నారు. తన విజయానికి సమష్టిగా కృషి చేసిన పార్టీ శ్రేణులకు శ్రావణి పట్టించుకోవడం లేదా? … ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?
శైలజానాథ్ టైమ్ నుంచి సింగనములలో కొనసాగుతున్న సెంటిమెంట్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది… అక్కడ ఏ పార్టీ అభ్యర్ధి గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా మాజీ మంత్రి శైలజానాథ్ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా , ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా దక్కించుకోలేకపోయారు.
గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బండారు శ్రావణి
టిడిపి నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల ముందు ఆమెకు అన్ని పరిస్థితులు కలిసి వచ్చాయి. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో నారా లోకేష్ నియోజకవర్గం నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఆయన సమక్షంలో కీలక నాయకులు అంతా కలిసి పని చేస్తామని హామీ ఇవ్వడం … ఆమె గెలవడం చకచక జరిగిపోయాయి. ఇక ఇంకేముంది అభివృద్ధి పథంలో సింగనమలను ముందు వరసలో నిలబెడతారు అని అంతా అనుకున్నారు. కానీ అభివృద్ధి మాటేమో గానీ వివాదాల్లో మాత్రం సింగనమల నియోజకవర్గం దూసుకుపోతుంది. అసలు నియోజకవర్గం టీడీపీలో ఇన్ని వివాదాలకు ఎమ్మెల్యే తీరే కారణమనే ఫిర్యాదులు అధిష్టానానికి అందుతున్నాయంట
హైదరాబాద్కే ఎక్కువ టైమ్ కేటాయిస్తున్న సింగనమల ఎమ్మెల్యే
యువ నాయకురాలైన బండారు శ్రావణికి రాజకీయ అవగాహన లేకపోవడంతో పార్టీ శ్రేణులను కలుపుకుని పోవడంలో విఫలమవుతున్నారంట. నియోజకవర్గం కంటే హైదరాబాద్లో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంట. సింగనమలలో టీడీపీ సీనియర్లను అసలు పట్టించుకోవడం లేదంట. పైపెచ్చు వ్యక్తిగతంగా కూడా శ్రావణిపై ఆరోపణలు వస్తున్నాయని సీనియర్ నేతలు ఆమెపై వరుసగా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారంట. నియోజకవర్గంలో అంతలా విభేదాలు పెరిగిపోవడంతో టీడీపీ హై కమాండ్ ఒక టూ మెన్ కమిటీని ఏర్పాటు చేసింది.
అలం నర్సానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలతో టూ మెన్ కమిటీ
నియోజకవర్గంలో పార్టీ బాధ్యతల సమన్వయానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నర్సానాయుడు, గార్లదిన్నెకు చెందిన మరో సీనియర్ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డిలతో టూ మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. పార్టీ కార్యక్రమం ఏదైనా ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుందని ఆదేశించింది. టూమెన్ కమిటీ ఏర్పాటుతోనే అక్కడ టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న ఎమ్మెల్యే శ్రావణి పరిస్థితి ఏంటో పార్టీ పెద్దలు చెప్పకనే చెప్పారు. అయినా బండారు శ్రావణి నియోజకవర్గంలో ఉన్నప్పుడు పార్టీ ఇన్చార్జ్లా పెత్తనం చేయాలని చూస్తున్నారంట.
ఒంటరిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే శ్రావణి
సెగ్మెంట్లో ఇద్దరు సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి. అయితే శ్రావణి వారితో పాటు పార్టీ సీనియర్లందరీ కాదని తాను ఒంటరిగా కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ క్యాడర్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోందంట. దాంతో నియోజకవర్గంలో చాలా మంది లీడర్లు ఎమ్మెల్యేకు దూరం జరుగుతున్నారంట. దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులను పట్టించుకోకుండా, శ్రావణి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని పార్టీలో అన్ని మండలాల నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారంట. పార్టీలో అసలు ఇన్చార్జ్ ఎవరో, తాము ఎవరి దారిలో నడవాలన్న కన్ఫ్యూజన్ కార్యకర్తల్లో కనిపిస్తోందంటున్నారు
ఇన్చార్జ్ మంత్రి సమక్షంలో రాళ్ల దాడి చేసుకున్న క్యాడర్
అయితే ఇందులో శ్రావణి చుట్టూ తిరుగుతున్న ఆమె వర్గీయుల వెర్షన్ వేరేలా ఉంది. సీనియర్ నాయకులే ఎమ్మెల్యేని దూరం పెట్టారని నియోజకవర్గంలో అందర్నీ రెచ్చగొడుతున్నారని పార్టీలు వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని ఆమె వర్గీయులు వాదిస్తున్నారు. ఆ క్రమంలో ఏకంగా ఇన్చార్జ్ మంత్రి ఎదుటే పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయి రాళ్ల దాడికి పాల్పడ్డారంటే నియోజకవర్గం టీడీపీలో పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం అవుతుంది. ఆ క్రమంలో ఇంచార్జ్ మంత్రి ఎన్నిసార్లు జిల్లాకు వచ్చి రివ్యూ మీటింగులు పెట్టినా ఈ ఒక్క నియోజకవర్గం పంచాయతీకే టైమ్ సరిపోతుందట.
Also Read: చిక్కుల్లో బ్లూస్మార్ట్.. ధోని నుండి దీపికా వరకు.. కోట్ల రూపాయలు లూటీ
ఫిర్యాదు చేసిన సింగనమల వెస్ట్, గార్లదిన్నె, ఎల్లనూరు నేతలు
ఇరు వర్గాల కంప్లైంట్స్ విన్న ఇంచార్జ్ మంత్రి టీజీ భరత్ విషయ తీవ్రతను హైకమాండ్తో పాటు పార్టీ జిల్లా పరిశీలకుడు కోవెలమూడి రవీంద్ర దృష్టిలో పెట్టారట. దాంతో ఆయన హుటాహుటిన ఎమ్మెల్యేపై అసమ్మతితో ఉన్న నేతలకు ఫోన్ చేసి కొంచెం ఓపిక పట్టాలని అంతా మంత్రి నారా లోకేష్ చూసుకుంటున్నాని చెప్పారట. దీంతో కొన్ని రోజులు ఓపిక పట్టాలని సదరు నేతలు నిశ్చయించుకున్నారట. బండారు శ్రావణి పై ఫిర్యాదు చేసిన వారిలో సింగనమల వెస్ట్, గార్లదిన్నె, ఎల్లనూరు మండలాలకు చెందిన నేతలు ఉన్నారట. అంత స్థాయిలో ఒక ఎమ్మెల్యేపై ఫిర్యాదులు వస్తుండటంతో అధిష్ఠానం కూడా సింగనమలపై ప్రత్యేక దృష్టి పెడుతుందంటున్నారు. చూడాలి మరి యువ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ల పంచాయతీ ఎలా సెట్ అవుతుందో.