H1B Visa New Rules: సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారా? ఇష్టం వచ్చినట్టు పోస్టులు, కామెంట్లు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా డాలర్ డ్రీమ్స్ను చూసేవారికి ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం ఇక మీరు అమెరికా కలలు కనడం మానేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ సోషల్ మీడియా జాతకం చూశాకే మీ వీసాపై స్టాంప్ పడుతుంది. రీసెంట్గానే సోషల్ మీడియా అంటూ వీసాల ఇంటర్వ్యూలన్నింటినీ నిలిపేసింది అగ్రరాజ్యం. ఇంతకీ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏంటి? దీని ఇంపాక్ట్ ఇండియన్స్పై ఎలా ఉండనుంది?
నెలల పాటు ఇంటర్వ్యూలు వాయిదా..
పొమ్మనలేక పొగబెట్టడం అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాతే ఎవరైనా. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే.. అగ్రరాజ్యం తీసుకున్న ఓ ఆకస్మిక నిర్ణయం. హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను ఉన్నట్టుండి వాయిదా వేసింది. అది కూడా ఒక రోజో.. రెండు రోజులో కాదు. ఏకంగా నెలల పాటు. ఇప్పటికే అప్లై చేసుకున్నవారందరికి మెయిల్స్ పంపి చావు కబురు చల్లగా చెప్పేసింది. వచ్చే ఏడాది మార్చి నుంచి మే మధ్య ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసింది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేరుగా కాన్సులెట్ల వద్దకు నేరుగా రావొద్దని.. వచ్చిన లోపలికి అనుమతించమని.. మళ్లీ సమాచారం ఇస్తామని చెప్పింది ఇండియాలో ఉన్న యూఎస్ ఎంబసీ.
డిసెంబర్ 15న ఇంటర్వ్యూలు ఉన్నవారికి మార్చ్లో
H1B వీసాలు మాత్రమే కాదు.. H-4 వీసా కోసం అప్లై చేసుకున్నవారిది కూడా సేమ్ సిట్యూవేషన్. డిసెంబర్ 15న ఇంటర్వ్యూలు ఉన్నవారికి మార్చ్లో.. డిసెంబర్ 19న ఇంటర్వ్యూ ఉన్నవారికి ఏకంగా మే వరకు వాయిదా వేసినట్టు చెబుతోంది అమెరికా. వాయిదా వేశారు సరే. మరి ఎందుకీ వాయిదా అంటే ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ చెబుతున్నారు అధికారులు. అప్లై చేసుకున్నవారి వల్ల అమెరికాకు ఎలాంటి భద్రతా ముప్పు ఉండదని నిర్ధారించుకునేందుకే ఈ వాయిదా అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్పవచ్చు.
ఆన్లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా అకౌంట్స్ తనిఖీ
మరి ఏంటీ ఈ సోషల్ మీడియా వెట్టింగ్..? వీసా కోసం అప్లై చేసుకున్నవారికి అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడానికి వారి ఆన్లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేస్తారు. అది కూడా చాలా క్షుణ్ణంగా. గడచిన ఐదేళ్లలో ఏమేం పోస్టులు చేశారు? ఏమేం కామెంట్స్ చేశారు? అనేది చెక్ చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం సోషల్ మీడియా స్క్రీనింగ్ను విస్తృతం చేయడంతో పాటు హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజీలు, రెజ్యూమ్లను రివ్యూ చేయాలని ఇప్పటికే కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేసింది.
నచ్చని కంటెంట్ కంట పడితే ఎండ్ కార్ట్ పడినట్టే..
పైకి అలా చెబుతున్నారు కానీ.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్, మరేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను చెక్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అలా వారికి చెక్ చేసే అధికారం ఇస్తేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది. లేదంటే మొదట్లోనే రిజెక్ట్ అవుతుంది. ఇక అలా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మీ ఫీడ్లో వారికి నచ్చని కంటెంట్ కంట పడితే ఇక మీ డాలర్ డ్రీమ్స్కు చెక్ పడినట్టే. వివాదాస్పద పోస్టులు, కామెంట్లు, పొలిటికల్ కామెంట్స్ ఇలా అన్నింటిని జల్లెడ పట్టేస్తుంది ఇప్పుడు అమెరికా కాన్సులేట్ అధికారులు. ఇప్పటికే తమ సోషల్ మీడియా అకౌంట్ ప్రొఫైల్స్ని రివ్యూ చేసుకోవాలని, పొలిటికల్ మీమ్స్ని షేర్ చేయవద్దు.. వీసా అప్లికేషన్స్లో తమ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ని ఉపయోగించాలంటూ కంపెనీలు ఇండియన్ ఎంప్లాయీస్కు చెబుతున్నాయి. సో.. ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఉద్యోగులు.
పార్టీల కోసం ఎంతకైనా తెగించి పోస్టులు
మాములుగానే మన ఇండియన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను చాలా బాగా వాడతారు. ఎదుటివారి మనోభావాలను అస్సలు పట్టించుకోకుండా కామెంట్లతో రెచ్చిపోతుంటారు. ఇక పొలిటికల్ పార్టీల విషయానికి వస్తే అయితే.. అది తప్పా.. ఒప్పా అనేది పక్కన పెట్టి మరీ నచ్చిన పార్టీ కోసం ఎంతకైనా తెగించి పోస్టులు పెట్టడం.. అసభ్యకరంగా కామెంట్ల వర్షం కురిపించడం అనేది చాలా కామన్. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఒక ఆకు ఎక్కువే చదివారు. అందులో ఏపీకి చెందిన వారైతే ఇక చెప్పనక్కరలేదు. అంబాజీపేట నుంచి అమెరికా వరకు తమ పొలిటికల్ ఒపినియన్స్ను రుద్దేస్తూ ఉంటారు. మరిప్పుడు వీరందరి పరిస్థితి ఏంటనేది అస్సలు అర్థం కాని విషయం. అయితే ఈ కండిషన్ అమల్లోకి రాగానే చాలా మంది పోస్టులను డిలీట్ చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. మరి డిలీట్ అయిన వాటి జోలికి అధికారులు వెళ్తారా? లేదా? అనేది అధికారికంగా తెలియదు కానీ.. అది పెద్ద కష్టమైన పనైతే అస్సలు కాదు.
మొత్తానికైతే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పుణ్యమాని.. ఇప్పుడు డాలర్ కలలు కనేవారికి నిద్ర కరువైందనే చెప్పాలి. హెచ్1బీ కొత్త వీసాల ఇంటర్వ్యూలతో పాటు.. రెన్యూవల్ చేసుకునేవారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తుండటంతో అమెరికాలో ఉండటమా? తట్టా బుట్టా సర్దేసుకొని రావడమా? అనేది అర్థం కాని విషయం.
ఒకసారి హెచ్1బీ వీసా ఫీజులు పెంచారు.. మరోసారి నిబంధనలు కఠినతరం చేశారు. ఓసారి పొమ్మంటారు.. మరోసారి మీరు లేకపోతే ఇక్కడ చాలా కష్టమంటారు.. ఇంతకీ ట్రంప్ ఎంట్రీ తర్వాత అగ్రరాజ్యం ఇలా వలసలపై ఎందుకీ చర్యలు తీసుకుంటుంది. అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి? ఈ సోషల్ మీడియా వెట్టింగ్ జస్ట్ ఒక చర్య మాత్రమే.. ముందు ముందు మరింత సినిమా చూపించబోతున్నారా?
ఒక్కోసారి ఒక్కో విధానంతో ఉక్కుపాదం..
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై ఉక్కుపాదం మోపడం కామన్గా మారింది. ఒక్కోసారి ఒక్కో విధానంతో వలసదారులకు చెక్ పెట్టేందుకు ట్రంప్ యంత్రాంగం ఫోకస్ చేస్తోంది. అక్రమంగా ఉండేవారిని వేటాడుతూ ఇప్పటికే డిటెన్షన్ సెంటర్స్కు సాగనంపుతున్న అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు అధికారికంగా వీసాలు తీసుకున్నవారిని కూడా తరిమేసేందుకు చేయాల్సిన పనులన్ని చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 85 వేల వీసాలను రద్దు చేసింది ట్రంప్ యంత్రాంగం. ఇది అఫిషియల్గా స్టేట్ డిపార్ట్మెంట్ చేసిన అనౌన్స్మెంట్. ఇందులో 8 వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, చోరి లాంటి సాకులను చూపిస్తూ వారి వీసాలను రద్దు చేసి డిపోర్ట్ చేశారు. చిన్న చిన్న తప్పులు చేసి పట్టుబడితే చాలు ఏకంగా వీసాలను రద్దు చేస్తూ సాగనంపేస్తున్నారు.
లక్ష డాలర్లకు పెరిగిన హెచ్–1బీ వీసా ఫీజు
ఓ వైపు ఈ పనులు చేస్తూనే.. హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసిన విషయం తెలిసిందే. దీంతో వీసాదారులంతా లబోదిబోమనే పరిస్థితి. ఇప్పటికే హెచ్1బీ వీసా రెన్యూవల్స్ భారీగా తగ్గిపోయాయి. నిజానికి హెచ్-1బీ వీసాలు పొందేవారిలో 70 శాతం మంది భారతీయులే ఉంటారు. ఇక హెచ్-4 వీసా తీసుకునేవారిలో 90 శాతం మంది కూడా మన భారతీయులే. అంటే ఈ నిబంధనల ఇంపాక్ట్ భారతీయులపై ఏ రకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే తలనొప్పి వ్యవహారం అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియా వెట్టింగ్ను తీసుకొచ్చింది ట్రంప్ ప్రభుత్వం.
అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ పాలసీ. ఈ విషయాన్ని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. అమెరికన్ల తర్వాతే ఎవరైనా.. అమెరికా తర్వాతే ఏ దేశమైనా అనేది ట్రంప్ పాలసీ. నిజానికి దీనికి కాస్త కారణం కూడా మనమే. ఎందుకంటే మాములుగా అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే భారతీయులు తిరిగి వచ్చేందుకు అంత ఆసక్తి చూపించరు. అక్కడే ఉద్యోగం సంపాదించి.. అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తారు. అందుకే అమెరికా టెక్ కంపెనీల్లో భారతీయులదే హవా. ఇదే ఇప్పుడు చాలా మంది లోకల్ అమెరికన్లకు అస్సలు నచ్చడం లేదు.
Also Read: సెక్రటరీ వివాదం.. సంధ్యారాణి సీన్ రివర్స్?
వీసా ఫీజు పెంపు కారణంగా టెక్ కంపెనీలు ప్రవాస భారతీయులను పంపించి వేయడంతో ట్రంప్ ప్లాన్ కాస్త సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూలను ఆలస్యం చేస్తూ.. అనేక నిబంధనలు విధిస్తూ మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పకనే చెబుతున్నారంటూ కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ట్రంప్ విధానాలను కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే అక్కడి అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనేది అతని ఉద్దేశం. ఇది మంచి ఆలోచనే. కానీ ఎక్కడి వారు అక్కడే ఉండాలి.. అన్నీ టెక్నాలజీలు అమెరికా కంపెనీల దగ్గరే ఉండాలి.. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేదే ఇప్పుడు విమర్శలకు కారణమవుతుంది.
Story By Vamshi Krishna, Bigtv