Sunita Williams: వ్యోమగాముల ల్యాండింగ్ విజయవంతంగా ముగిసింది. ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాన.. ఆస్ట్రోనాట్లు సేఫ్గా భూమికి చేరుకున్నారు. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీ విజయవంతంగా ముగిసింది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమ్మీదకు వచ్చారు. ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షం నుండి బయలుదేరిన ఆస్ట్రోనాట్స్ సుమారు 18 గంటల ప్రయాణించిన తర్వాత ఫ్లోరిడా తీర ప్రాంతంలో ల్యాండ్ అయ్యారు.
స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఇద్దరినీ సక్సెస్ ఫుల్ గా తీసుకొచ్చింది. తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యింది. జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత, విల్మోర్.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది.
గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి.. ఒడ్డుకు చేర్చారు.
ల్యాండింగ్ అనంతరం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వ్యోమగాములను తరలించారు.అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల బలం, ఎముకల సాంద్రత రెండూ తగిపోతాయి. దీని వల్ల ఎముకలు పెళుసుగా మారి, విరిగిపోయే ప్రమాదం ఉందని.. అందుకనే వారిని అబ్జర్వేషన్లో ఉంచారు.
అలాగే గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. వాటి బలం తగ్గిపోతుంది. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. వ్యోమగాములు 6 నెలల కంటే ఎక్కువకాలం అంతరిక్షంలో ఉంటే, వాళ్లు భూమికి తిరిగి వచ్చినప్పుడు బోన్ ఫ్రాక్చర్ రిస్క్ను ఎదుర్కొంటారు. అలాగే వాళ్ల ఎముకల సాంద్రత తగ్గడం వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు ఎదురు కావొచ్చని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఎముకల సాంద్రతను పెంచడం కోసం వాళ్లకు 3 నెలల పాటు సప్లిమెంట్స్ ఇవ్వనున్నారు.
కాగా, సునీత, విల్మోర్ స్పేస్ఎక్స్ క్రూ 9 మిషన్ లో భాగంగా గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఐఎస్ఎస్కు వెళ్లారు. వారం తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా, స్టార్ లైనర్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వారి రిటర్న్ జర్నీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా గత శనివారం స్పేస్ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను పంపగా, అందులోనే సునీత, ఇతర ఆస్ట్రోనాట్లు తిరిగి వచ్చారు.
Also Read: సునీత విలియమ్స్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే విధంగా భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లాతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు కొలంబియా స్పేస్ షటిల్లో తిరిగొస్తుండగా భూ వాతావరణంలో ప్రవేశించిన తరువాత కొలంబియా స్పేస్ షటిల్ బ్రేక్ అయింది. మరో 16 నిమిషాల్లో భూమ్మీదకు ల్యాండ్ అవుతారనగా స్పేస్ షటిల్ కాలి బూడిదై మొత్తం ఏడుగురు చనిపోయారు.
అంతకు ముందు 1986 జనవరి 28వ తేదీన మరో స్పేస్ షటిల్ ఛాలెంజర్ లాంచ్ అయిన కాస్పేపటికి పేలిపోవడంతో అందులో ఉన్న ఏడుగురు సిబ్బంది మరణించారు. ఈ రెండు ఘటనల నేపధ్యంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రిటర్న్ టు ఎర్త్ జర్నీపై అందరు ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఫైనల్నీ
సేఫ్గా ల్యాండ్ అయ్యారు.
9 నెలల నిరీక్షణ తర్వాత ఐఎస్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ తిరిగి రావడంపై భారత్లోని ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సునీత త్వరలోనే భారత్కు వస్తారని చెప్పారు ఆమె బంధువు ఫాల్గుణి పాండ్య. 9 నెలల ఎదురుచూపుల తర్వాత ఆమె భూమి పైకి తిరిగి రావడం ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఆమె భూమి పైకి దిగిన క్షణాలు అపురూపమని తెలిపారు.