BJP Turmoil: కమలం పార్టీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెర మీదకొచ్చిన క్యాంప్ రాజకీయాల ఒప్పందాలు కలకలం రేపుతున్నాయా..? బీజేపీ కీలక నేతలు తమ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లను అధికార, ప్రతిపక్ష పార్టీలతో ఒప్పందాలు చేసుకొని తాకట్టు పెట్టరా..? క్యాంప్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్న కాషాయ పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లతో అధికార పదవులను ఎట్లా పంచుకుంటుంది..? కమలనాథులది వ్యూహాత్మక రాజకీయమా? అంతర్గత విభేదాలు, ఆధిపత్యపోరుతో క్యాంప్ పాలిటిక్స్ నడిచాయా? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది?
ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి కొందరు బీజేపీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ సందర్భంగా మరో కీలక అంశం ప్రధానంగా చర్చ జరుగుతోంది. గెలిచిన అభ్యర్థులు తమ కంట్రోల్ తప్పకుండా కొందరు నాయకులు క్యాంపులకు తరలించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి అంతేకాదు. అధికార, ప్రతిపక్ష పార్టీలతో కీలక నేతలు ఒప్పందం చేసుకున్న తర్వాతే క్యాంపు ప్ల నుంచి తమను తీసుకువచ్చారని కొందరు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో రాజకీయ ఒత్తిడుల వల్ల జరిగిందా.? లేక పార్టీ క్రమశిక్షణ లోపమా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదటుంచితే… ప్రధానంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్కు ఓటు వేయడం, అలాగే పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్కు మద్దతు తెలపడం, పాయల్ శంకర్ గెలిచిన కౌన్సిలర్లను క్యాంప్లకు తరలించడం, ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిథ్యం వహిస్తున్న నిజమాబాద్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఇంచార్జిలు, అధ్యక్షుల పైనా అసహనంతో కొందరు రాజీనామా చేయడం, మెట్పల్లి లాంటి మున్సిపాలిటీలను చేజేతులా కోల్పోవడం వంటి అంశాలపై ఇప్పటికే సీరియస్గా బీజేపీ అధిష్టానం నివేదికలు తెప్పించుకుందంట.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ధర్మపురి అరవింద్ వ్యవహారాలు, ఇంచార్జ్గా ఇచ్చిన మున్సిపాలిటీలలో రిజల్ట్స్ రీచ్ అవడంలో వెనకబడ్డ ఈటల రాజేందర్, యేలేటి మహేశ్వర రెడ్డి, కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పైడి రాకేష్రెడ్డిల మీద రిపోర్ట్లు డిల్లీ పెద్దల చేతికి వెళ్లినట్టుగా సమాచారం. అంతేకాదు మొత్తం ఆరు చోట్ల బీజేపీ నేతలు ప్రత్యర్థి పార్టీలతో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్న తీరుపైన కూడా, అసలు ఏం జరిగిందన్న లెక్కలు పెద్దల చేతుల్లో పడ్డాయన్న టాక్ నడుస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల సస్పెన్షన్ చర్యలు తీసుకున్న రాష్ట్ర నాయకత్వం, ఈ ఉదంతాలపై కేంద్రానికి పూర్తి స్థాయిలో నివేదిక పంపినట్టు తెలుస్తోంది.
రాష్ట్ర పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వొద్దనీ స్పష్టంగా చెప్పినప్పటికీ ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగింది..? కీలక చోట్ల గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు ఎందుకు తరలించారు..? తరలించడం వెనక అధికార, ప్రతిపక్ష పార్టీలతో ఒప్పందాలు ఉన్నాయా..? మెట్ పల్లిలో గెలిచిన అభ్యర్థులను మహారాష్ట్ర క్యాంప్ కు తరలించి, తిరిగి మెట్ పల్లిలో వదిలి వెళ్లడం వెనక ఎలాంటి ఒప్పందాలు ఉన్నాయి.. ? ఒప్పందాలు ఎవరు చేసుకున్నారు.. ? ఒప్పందాల కోసమే బీజేపీలో కీలక నేతలు గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారా..? అన్న ప్రశ్నలు రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నాయి.
అంతేకాదు పుస్తే, మెట్టెలు, గాజులు అమ్ముకొని గెలిచాం.. తరాల నుంచి కమలం జెండాలు మోస్తూ పార్టీని నిలబెడుతున్నాం, అట్లాంటి తమను రోడ్డున పడేస్తారా..? జిల్లా, నియోజకవర్గ, మున్సిపాలిటీల ఇంచార్జీలు అధికార, ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కయి, క్యాంప్ రాజకీయాలతో తమ గెలుపును అవహేళన చేస్తారా..? తాకట్టు పెడతారా..? పార్టికి విలువ లేకుండా చేస్తారా..? అని గెలచిన కౌన్సిలర్లు నిలదీస్తుండటంతో.. కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వాలు సమాధానం చెప్పలేని స్థితిలో కనిపిస్తున్నాయి .
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో పార్టీ పని తీరుతో పాటు, తాజా మున్సిపాలిటీ ఎన్నికలు, పార్టీ నేతల వ్యవహార శైలిపై ఢిల్లీ పెద్దలకు పూర్తిస్థాయిలో రిపోర్టు రాష్ట్ర పార్టీ అందించినట్టు విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే, రఘునందన్ రావు బీఆర్ఎస్కు ఓటు వేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పెద్దల రియాక్షన్ ఎలా ఉండబోతుంది..? రఘునందన్ రావు విషయంలో ఎలాంటి ఒప్పందాలు, ప్రయోజనాలున్నాయి..? పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారన్న వార్తలపై పార్టీ స్టాండ్ ఏంటి..? అన్నది తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఇప్పటికే మెట్పల్లి లో సస్పెన్షన్లు జరిగాయి. గెలిచిన 10 మంది కౌన్సిలర్లు పార్టీపై తిరగబడుతున్నారు. ఈ నేపద్యంలో మరిన్ని సస్పెన్షన్లు ఉంటాయా..? ఆరు మున్సిపాల్టీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లతో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవడమేంటి? గెలిచిన కౌన్సిలర్లను క్యాంపులకు తరలించి, అధికార ప్రతిపక్ష పార్టీలతో ఒప్పందాలు చేసుకున్న నేతలు ఎవరు? అన్న సందేహాలు పార్టీలో అగ్గిరాజేస్తున్నట్లు కనిపిస్తోంది.
మున్సిపల్ ఎన్నికత సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేశాయని బీజేపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆక్రమంలో వచ్చే పరిషత్ ఎన్నికల్లోనూ స్థానిక స్థాయిలో అనైతిక పొత్తులు, మద్దతులు, క్యాంపు ఒప్పందాలు కొనసాగుతాయా..? అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలది ఫెఫికాల్ బంధం అన్న ప్రచారం ఉంది. ఆ ప్రచారాన్ని నిజం చేసేలా బీజేపీ, బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. కానీ కొన్ని చోట్ల అధికార పార్టీ కాంగ్రెస్ కు జై కొట్టడం ఏంటి..? ఏ ఈక్వేషన్స్ తో కాంగ్రెస్ పార్టీతో అధికారం పంచుకుంటుంది..? అన్నదే ఆ పార్టీ వారికి అంతుపట్టకుండా తయారైందంట.
స్థానిక రాజకీయ సమీకరణాలు, మున్సిపల్ స్థాయిలో అభివృద్ధి నిధులు…వంటి కారణాలతో ప్రత్యర్థి పార్టీలతో ఒప్పందం కుదుర్చుకుని ఉంటారన్న వాదనతో ఆ పార్టీ కీలక నేతలు కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఆది పార్టీ లైన్కు పూర్తిగా విరుద్ధమన్న సంకేతాలు రాష్ట్ర నాయకత్వం ఇస్తోంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు లొంగిపోయి పదవులు పంచుకోవడంపై బీజేపీ కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ లైన్ దాటిన నేతలపై హైకమాండ్ చర్యలు తీసుకుంటే, పార్టీలో అసంతృప్తి మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసంతృప్తే కాదు, నేతలు పార్టీని వీడే పరిస్థితులు కూడా ఎక్కువే ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రాష్ట్ర బీజేపీని సెట్ రైట్ చేయడానికి ఢిల్లీ పెద్దలు ఏ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి.
Also Read: మేము బురద చల్లుతాం.. మీరు కడుక్కోండి! వైసీపీ మైండ్ గేమ్ వర్కవుట్ అవుతుందా?
Story by: Apparao, Big Tv