Nominated Posts: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులపై రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే జిల్లాల వారీగా అందిన జాబితాలను అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ నియామకాలను ఏప్రిల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణలో నామినేటెడ్ పదవులు, ఇతరాత్రా పదవుల భర్తీకి ఏప్రిల్ నెలలోపే పూర్తి చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పదవులు ప్రాసెస్ స్పీడప్ అయిందట. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులను కూడా ఈ సారి ప్రకటించాలని ముందుకు సాగుతుందట. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కొలిక్కి తీసుకుచ్చేలా….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్, మంత్రులు చర్చలు జరుపుతున్నారట.
తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ ఎమ్మెల్యేలు, డీసీసీల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించారంట. ఫ్రంటల్ వింగ్ ఆర్గనైజేషన్స్ లో ఎవరిని నియమించాలి? ప్రభుత్వ నామినేటెడ్ పదవులకు ఎవరిని సిఫారసు చేయాలి? వంటి అంశాలపై ఏఐసీసీ ఇన్చార్జ్ స్టడీ చేస్తున్నారంట. ఎమ్మెల్యేలు, డీసీసీల నుంచి సేకరించిన లిస్టులపై ఆమె అని కోణాల్లో అధ్యయనం చేస్తున్నారట.
ఈసారి పదవుల పంపిణీలో కష్టపడిన వారికే గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందంట. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించి, పదవులు ఆశించి భంగపడ్డ ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల ద్వారా న్యాయం చేయాలని నిర్ణయించారనే టాక్ నడుస్తోంది. ఆయా లీడర్లు పార్టీలో ఎప్పట్నుంచి పనిచేస్తున్నారు? పార్టీ, ప్రభుత్వంపై వారి నిబద్ధత ఎలా ఉంది? కమిట్మెంట్తో పనిచేస్తారా? లేదా? పార్టీ పవర్ లోకి రావడంతో ఆయా లీడర్లు ఏ విధంగా ఉపయోగపడ్డారు? పబ్లిక్లో ఆ లీడర్లకు ఎలాంటి స్పందన ఉంది? తదితర అంశాలను క్షేత్రస్థాయి నుంచి క్షుణ్ణంగా వివరాలు తీసుకుంటున్నారట.
హైకమాండ్ కు చేరిన లిస్టుల్లో నుంచి మూడు విధానాల్లో పేర్లను ఫిల్టర్ చేయనున్నారట. పార్టీలో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్న లీడర్లు, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చేరిన లీడర్లు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలోకి వచ్చిన లీడర్లు..ఇలా మూడు కేటగిరీలుగా విభజించి షార్ట్ లిస్టు తయారు చేయనున్నారట. ప్రభుత్వ పనితీరు అద్భుతంగా నిర్వహించినా..క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం సరిగ్గా లేకపోతే సర్కార్ కు చిక్కులు తప్పవు. దాంతో పదవుల వేగం భర్తీ వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.
ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడుస్తుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేసిన క్షేత్రస్థాయి లీడర్లు కూడా చాలా ఓపికగా పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రకటించకపోతే, పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఏఐసీసీ గుర్తించిందంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా సీఎం, పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్చార్జ్లతో అగ్రనాయకత్వం ప్రత్యేకంగా మాట్లాడి ఆదేశాలిచ్చిందంట. అందులో భాగంగానే ప్రభుత్వం, పార్టీ లోని పదవులను ఏప్రిల్ నెల చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారట.
స్టేట్ నుంచి జిల్లా స్థాయి వరకు ఖాళీగా ఉన్న పదవులన్నీ భర్తీ చేసేలా వర్క్ చేస్తున్నారట. ప్రధానంగా పార్టీ లోని చైర్మన్లు, ప్రభుత్వంలోని కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు తదితర పదవులన్నీ ఈ సారి భర్తీ చేయనున్నట్లు గాంధీభవర్ వర్గాలు చెప్తున్నాయి. ఇక పార్టీలోని డీసీసీ పరిధిలో మిగిలిన జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ట్రెజరర్ లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వంటి పదవులను కూడా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోందట.
పదవుల భర్తీలో ఏఐసీసీ ఇన్చార్జ్ నేతృత్వంలో ఇప్పటికే కసరత్తు ముమ్మరమైంది. కేవలం పైస్థాయి రికమండేషన్లకే పరిమితం కాకుండా, గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ కోసం ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రతిపాదనలు సేకరించారట. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న వారు…గత ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు ఈసారి పెద్దపీట వేయనున్నారు.
దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు పక్కాగా పదవులు దక్కేలా ఏఐసీసీ చర్యలు తీసుకోవాలని చెప్పడంతో ఆ దిశగా ఎక్సర్సైజ్ చేస్తున్నారంట. ఇప్పటికే దాదాపు 70 శాతం జాబితా రెడీ అయిందని, మరో 30 శాతం పేర్లు ఫైనల్ కాగానే ప్రకటిస్తామని ప్రభుత్వంలోని ఓ సీనియర్ నేత తెలిపారు. గ్రామ స్థాయి నుంచి గాంధీభవన్ వరకు,మండల స్థాయి నుంచి ముఖ్యమైన శాఖల వరకు నామినేటెడ్ పదవుల భర్తీని కూడా ఈ దఫా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read: శ్రీరామ నవమి రోజే ఆ బిగ్ అనౌన్స్మెంట్.. నిజామాబాద్లో కవిత మాస్టర్ ప్లాన్!
Story by: Apparao, Big Tv