Telangana Leaders Target: ఏపీ సీఎం చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయా..? బనకచర్ల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవలి కాలంలో తెలంగాణ నేతలు.. ఏపీ సీఎం టార్గెట్గా విమర్శలు చేయడం దేనికి సంకేతం..? కేవలం ఆయా ఇష్యూలే ఇందుకు కారణమా లేదంటే మరేదైనా పక్కా వ్యూహం ఉందా..?
తెలంగాణ నేతలకు టార్గెట్గా మారిన ఏపీ సీఎం
తెలంగాణ రాజకీయాలు చంద్రబాబు కేంద్రంగా సాగుతున్నట్లే కన్పిస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నేతలు చేస్తున్న విమర్శలను నిశితంగా గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రధానంగా బనకచర్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీరుపై భగ్గుమంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఓవైపు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం చెబుతున్న ఏపీ సర్కారు.. వరద జలాలతో, సముద్రంలోకి వృథాగా పోయే నీటితో బనకచర్ల కట్టుకుంటామని చెప్పడం సరికాదని తేల్చిచెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో పలుకుబడి ఉందని.. బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని సీఎం చంద్రబాబు భావించవద్దు అంటూ సూచించారు ముఖ్యమంత్రి రేవంత్. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ వద్ద అవసరమైన ప్రణాళిక, వ్యూహం ఉందంటూ తేల్చి చెప్పారాయన.
తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు..
ఇక, ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు.. బనకచర్ల విషయంలో చేస్తున్న కామెంట్లు సరైనవి కావన్నారు మాజీ మంత్రి హరీశ్రావు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం డజన్ల కొద్దీ లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారాయన. బనకచర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతోందని విమర్శించారాయన. ప్రజాభవన్లోనే సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. బనకచర్ల విషయంలో బీజేపీ వాదన మరోలా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనంటూ చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతోపాటు కేంద్ర ప్రభుత్వ నిపుణుల కొన్ని కీలక సూచనలు చేశారని.. అన్ని అనుమతులు పొందాకే ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్నారు బండి సంజయ్.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలోనూ..
ఒక్క బనకచర్ల ఇష్యూనే కాదు.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపైనా సీఎం చంద్రబాబు టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారని ఆరోపిస్తున్నారు. ఈటల రాజేందర్, డీకే అరుణలాంటి వాళ్లు ఉండగా.. తనకు అనుకూలమైన రామచంద్రరావుకు ఆ పదవి ఎలా ఇస్తారంటూ ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్. అయితే.. తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఆచి తూచి స్పందిస్తున్నారు. అసలు తమ పార్టీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం, ప్రభావం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు కమలం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి. బీజేపీకి అధ్యక్షుడిని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం అధిష్టానానికి లేదని మరికొందరు కాషాయ పార్టీ నేతలు అంటున్నారు.
Also Read: గులాబీ నేతల పక్క చూపులు
సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మంచిగా చెబితే అలాంటి వాళ్లు మాటవినరని అన్నారాయన. అలాంటి వాళ్లకు నల్లా, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అనిరుద్ రెడ్డి. ఇలా దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలూ చంద్రబాబు టార్గెట్గా విమర్శలు చేయడం వెనుక కారణం ఏంటన్న దానిపై పెద్ద చర్చే పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోందట. అయితే..త్వరలోనే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో రాజకీయంగా లబ్ది పొందడంతోపాటు ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించడమే లక్ష్యంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్న టాక్ విన్పిస్తోంది. మరి ఇవి ఇక్కడితోనే ఆగుతాయా లేదంటే భవిష్యత్లోనూ మరింతగా ముదురుతాయా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.