Rythu Bharosa: తెలంగాణలో వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈనెల 30వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించబోయే బహిరంగ సభ సాక్షిగా సీఎం ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
తెలంగాణలో అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీ ప్రకారం.. గతంలో ఉన్న సాయాన్ని పెంచి, ఏడాదికి ఎకరానికి 12 వేలు చొప్పున అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దాదాపు 67 లక్షల మందికి పైగా రైతులకు, సుమారు 1.35 కోట్ల సాగు భూమికి ఈ నిధులు అందనున్నాయి. కేవలం 10 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also read: బిగ్బాస్ హౌస్లోకి సామాన్యుల ఎంట్రీ.. ‘అగ్నిపరీక్ష 2’ లో అప్లై చేయడానికి రూల్స్ ఇవే!
రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో 2018, మే 10న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. తొలి ఏడాది ఎకరానికి సీజన్కు 4 వేల చొప్పున అందించగా.. ఆ తర్వాత 2019 వానాకాలం సీజన్ నుంచి ఆ మొత్తాన్ని సీజన్కు 5వేలకు పెంచారు. 2018 మే నెల నుంచి మొదలుకొని.. 2023 చివరి వరకు ప్రతి వానాకాలం, యాసంగి సీజన్లలో ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 11 విడతల్లో ఈ పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేశారు. అయితే సాగులో లేని భూములకు, కొండలు, గుట్టలకు కూడా ఈ నిధులు వెళ్తున్నాయనే విమర్శల నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన నిబంధనలతో ‘రైతు భరోసా’గా మార్చి నిధులను అందిస్తోంది.
కేవలం రైతు భరోసా మాత్రమే కాకుండా.. సచివాలయంలో జరిగిన తాజా కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, వీబీజీ రాంజీ పథకం అమలుతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రులతో సుదీర్ఘంగా సమీక్షించారు. పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఈనెల 30 నుంచే అకౌంట్లలో డబ్బులు పడతాయన్న ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Storey By: Appa Rao Big Tv
Also read: Trump Netanyahu: మిత్రుల మధ్య చిచ్చు పెట్టిన ఇరాన్ డీల్.. నెతన్యాహును ‘క్రేజీ’ అని తిట్టిన ట్రంప్..!