Trump Netanyahu: నిన్నటి వరకు ఒకరినొకరు ప్రాణ మిత్రులు అని పిలుచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా తయారయ్యారు. అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన శాంతి ఒప్పందం కాస్తా.. వాషింగ్టన్ – టెల్ అవీవ్ల మధ్య దశాబ్దాలుగా ఉన్న వ్యూహాత్మక సంబంధాన్ని దెబ్బతీసింది. నెతన్యాహును ట్రంప్ బహిరంగంగానే క్రేజీ అని అని మాట్లాడడం, తాను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు అని చెప్పడం, ఆ రెండు దేశాల మధ్య మ్యాటర్ గరంగరంగా ఉందన్న విషయాన్ని సూచిస్తోంది.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ చూపుతున్న అసంతృప్తి ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. ఈ డీల్ పై ఇజ్రాయెల్ తీరును కౌంటర్ చేశారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. నిజాల్ని గుర్తించి నిద్ర లేవండి అంటూ వైట్ హౌస్ ప్రెస్ మీట్ లో ఇజ్రాయెల్ క్యాబినెట్ మంత్రులను ఉద్దేశించి జేడీ వాన్స్ గట్టిగానే మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచంలో ఇజ్రాయెల్ పట్ల సానుభూతితో ఉన్న ఏకైక నేత డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అన్నారు. ప్రపంచంలో ఇజ్రాయెల్ కు మిగిలిన ఏకైక బలమైన మిత్రదేశమైన అమెరికాను విమర్శించి దూరం చేసుకోవద్దు అని వ్యాన్స్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ను కాపాడుతున్న క్షిపణులలో మూడు వంతుల్లో రెండొంతులు అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో తయారైనవేనని ఇజ్రాయెల్కు ఘాటుగా గుర్తుచేశారు. ఇజ్రాయెల్ కేవలం 90 లక్షల జనాభా ఉన్న దేశమని, కేవలం అవతలి వారిని చంపడం ద్వారానే జాతీయ భద్రతను పరిష్కరించుకుంటూ వెళ్లలేరని, మీ ప్రణాళిక ఏంటో చెప్పండంటూ వాన్స్ ఇజ్రాయెల్ మంత్రులను నిలదీశారు.
అమెరికా-ఇరాన్ ఒప్పందంపై నెతన్యాహు నేరుగా ట్రంప్ను విమర్శించకపోయినా క్షేత్రస్థాయిలో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ శాంతి ఒప్పందం ప్రకారం ఇరాన్ తన క్షిపణి దాడులను ఆపాలి. బదులుగా సౌత్ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి రప్పించాలి. కానీ నెతన్యాహు మాత్రం ఇజ్రాయెల్ భద్రతకు అవసరమైనంత కాలం తమ సైన్యం సౌత్ లెబనాన్లోనే ఉంటుందన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని, క్షిపణి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడంలో ఈ ఒప్పందం విఫలమైందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ భావిస్తోంది. ట్రంప్ దూతలు కేవలం తమ సొంత ప్రయోజనాల కోసమే ఇరాన్కు లొంగిపోయి ఇజ్రాయెల్ను మోసం చేశారని నెతన్యాహు అనుకూల మీడియా ఆరోపిస్తోంది.
Also read: Jana Sena: తెలంగాణ లీడర్లకు జనసేన గాలం.. అలాంటి నేతలే టార్గెట్గా పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం!
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టి, ఇజ్రాయెల్ సైన్యం సౌత్ లెబనాన్పై జరిపిన వైమానిక దాడుల్లో 16 మంది చనిపోయారు. తాము దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలు, ఆయుధ డిపోలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకునే దాడులు చేశామని ఐడీఎఫ్ అన్నది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూపు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ సరిహద్దులపై దాడులకు తెగబడుతోందని, దానికి ప్రతిచర్యగానే తాము ఈ ఆపరేషన్ నిర్వహించామన్నది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం లెబనాన్ ఫ్రంట్లో కూడా సైనిక చర్యలు నిలిపివేయాల్సి ఉంది. అయితేఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ ఒప్పందాన్ని అంగీకరించకుండా దాడులు కొనసాగిస్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతి ఒప్పందానికి ప్రమాదకరంగా ఇజ్రాయెల్ తీరు కనిపిస్తోంది. తాజా దాడుల ఎఫెక్ట్ తో స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన కీలక శాంతి చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. భయపడుతోంది.
యుద్ధ ప్రారంభంలో ఇజ్రాయెల్కు సపోర్ట్ గా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని, మరోవైపు రాజకీయంగా కూడా సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో యుద్ధం ముగించాలని ఇజ్రాయెల్ను పక్కనపెట్టి ఇరాన్తో చర్చలు జరిపారు. అటు యూరప్ దేశాలు, ఇటు గ్లోబల్ సౌత్ దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకిస్తుండగా.. ఇప్పుడు మిత్రుడైన ట్రంప్ ప్రభుత్వం కూడా కఠినంగా మారడంతో నెతన్యాహు అంతర్జాతీయంగా ఒంటరైన పరిస్థితుల్లో ఉన్నారు.
Story By: Anup Big Tv
Also read: బిగ్బాస్ హౌస్లోకి సామాన్యుల ఎంట్రీ.. ‘అగ్నిపరీక్ష 2’ లో అప్లై చేయడానికి రూల్స్ ఇవే!