Karimnagar Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య హిట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పేరుకు మునిసిపల్ ఎన్నికలు అయినా అసెంబ్లీ ఎన్నికల తరహాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . ఆ పార్టీల నుంచి కరీంనగర్లో ప్రధాన నేతలుగా ఉన్న పొన్నం, గంగుల, బండిలు ముగ్గురూ మునిసిపల్ ఎన్నికలని సీరియస్గా తీసుకుని పెద్దఎత్తున్న గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారంట.. ఇంతకీ ఆ ముగ్గురు కీలక నేతలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏం జరుగుతోంది? పురపోరులో ప్రెస్టేజ్ నిలబెట్టుకునే లీడర్ ఎవరు?
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్.. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తరువాత అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ జెండా ఎగరేయాలని పట్టుదల ప్రదర్శిస్తుంటాయి.. కాంగ్రెస్, బిజేపి, బీఅర్ఎస్ ల నుండి మంత్రి పొన్నం ప్రభాకర్,కేంద్ర మంత్రి బండిసంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎలాగైనా ఈసారి కరీంనగర్ కార్పోరేషన్ లో జెండా ఎగురవేసి మేయర్ పీఠం దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారు..
2 సార్లు మేయర్ పీఠం దక్కించుకోవడంలో గంగుల కీరోల్
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో అప్పటి అధికారపక్షం నుంచి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ మేయర్ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించారు. కావడంతో ముచ్చటగా మూడవసారి మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ వశం చేసి హ్యాట్రిక్ కొట్టాలని గంగుల భావిస్తున్నారు. గత ఎన్నికలలో సత్తా చాటిన బిజేపీ ఇప్పుడు ఐదేళ్లలో వాడవాడలా స్ట్రాంగ్ కావడంతో పాటు, కేంద్ర మంత్రిగా ఉన్న అక్కడి ఎంపీ బండి సంజయ్ ఇలాకా కావడంతో ఆయనకు కొర్పొరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి..
గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సింగిల్ డిజిట్
ఇక మంత్రి పొన్నం ప్రభాకర్.. తెలంగాణ రాకముందు 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఆయన హయాంలో అక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ గత పదేళ్లలో ఢీలా పడిపోయింది.. గత ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్లో సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కరీంనగర్ కార్పొరేషన్పై నజర్ పెట్టిన కాంగ్రెస్.. ఎన్నికల బాధ్యతల్లో పొన్నం ప్రభాకర్ను కీలకం చేసింది. దాంతో మంత్రి పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ముగ్గురు లీడర్లు దూకుడు పెంచారు.. ఒకరిపై ఒకరు విమర్శానాస్త్రాలు మొదలుపెట్టారు. సొంత పార్టీల్లోని అసంతృప్తి నాయకుల బుజ్జగింపులు, చేరికలు, టికెట్ల కేటాయింపు వ్యవహారాలు అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నారు..
గతంలో తన వారినే గెలిపించుకున్న గంగుల
మాజీ మంత్రి గంగుల కమలాకర్ కి ఈ కార్పొరేషన్ ఎన్నికలు నిజంగా సవాలే.. గత రెండుసార్లు గంగుల అధికారపక్షంలో ఉండటంతో ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లు నడిచింది. ఎవ్వరికి టికెట్ ఇచ్చిన విజయం సాధించారు.. కాని ఇప్పుడు సీన్ మారిపోయి రివర్స్లో నడుస్తోంది.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం.. ఎంపి ఎన్నికలలో పట్టు కొల్పోవడం.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలపై విచారణ నడుస్తుండటం ..కవిత విమర్శలు పెంచడంతో గతంలో కంటే బీఅర్ఎస్ ఢిలా పడిపోయింది..
ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన గంగుల
అయితే కరీంనగర్ కార్పొరేషన్లో గంగుల గ్రాఫ్ మీదనే ఈ ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తున్న ఆయన మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధినే నమ్ముకున్నారు… కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందడం వెనక గంగుల కృషి ఉంది…కరీంనగర్ కే తలమానికంగా తీగెల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ గంగుల చేసిన ప్రతిపాదనలే.. తాను చేసిన అభివృద్ధి చూసే ఈసారి కార్పొరేషన్ ఎన్నికలలో ఓటు వెయ్యాలని గంగులు ప్రచారం చేసుకుంటున్నారు.. నమ్మిన లీడర్లు వదిలేసిన వెళ్ళినా కొత్త నేతలను తయారు చేసుకుంటూ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.. అయితే పార్టీ ఓటమి తర్వాత పరిణామాలతో ఈ ఎన్నికలు గంగులకి సవాల్ గా మారాయి..
పొన్నంకు కీలకంగా మారిన హూస్నాబాద్, కరీంనగర్
మంత్రి పొన్నం ప్రభాకర్.. కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కార్యకలపాలన్నీ అయన కనుసైగల్లోనే నడిచేవి.. కాని తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంపిగా, రెండుసార్లు ఎమ్మెల్యే గా ఓడిపోవడంతో గత ఎన్నికల్లో తన మకాం హుస్నాబాద్ కి మార్చేసి ఘన విజయం సాధించారు.. మంత్రిగా ప్రమోట్ కావడం తో ఇప్పుడు ఆయనకు హుస్నాబాద్ మునిసిపాలిటీతో పాటుగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలవడం అత్యంత కీలకంగా మారింది.. అటూ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యకలాపాలు చూస్తూనే ఆయన కరీంనగర్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు..
పొన్నం ప్రతిపాదనకు పచ్చజెండా ఊపిన సీఎం రేవంత్ రెడ్డి
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లా లో కలపాలన్న పొన్నం ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చజెండా ఊపడంతో కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేయడం పొన్నం ప్రభాకర్కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది.. గత కార్పొరేషన్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం అయిన కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్రం లో అధికారం లో ఉండడంతో కరీంనగర్లో బలం పెంచుకోగలింది… మెజారిటీ డివిజన్లు గెలిచి,ఎట్టి పరిస్థితుల్లో మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్థినే కూర్చోవాలని అధిష్టానం పట్టుదలతో ఉండటంతో.. ఈ ఎన్నికలు పొన్నంకు ప్రెస్టేజ్ ఇష్యూగా తయారయ్యాయి.. అందుకే అన్ని వ్యవహారాలు చూసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్పై తిరిగి పట్టు సాధించేందుకు పొన్నం ప్రభాకర్ పాచికలు వేస్తున్నారు
కరీంనగర్ కార్పొరేటర్గా కెరీర్ ప్రారంభించిన బండి సంజయ్
ఇక కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండిసంజయ్.. కరీంనగర్ కార్పొరేటర్గా తన రాజకీయం మొదలుపెట్టి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎదిగారు.. వరుసగా రెండవసారి కరీంనగర్ ఎంపిగా గెలవడం..కేంద్ర హోం శాఖ సహయ మంత్రిగా ఉండడంతో తన పార్లమెంటు పరిధిలో మునిసిపల్, కార్పొరేషన్లు గెలవడం ఆయనకు ప్రతిష్టాత్మకంగా తయారైంది.. ఆ క్రమంలో ఆయన కరీంనగర్పై గట్టి ఫోకస్ పెడుతున్నారు.. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కరీంనగర్ కార్పొరేషనే అంటున్న ఆయన.. ఈ సారి ఎలాగైనా గెలవాలని ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు.
గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రచారం..
గత మునిసిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ కరీంనగర్లో కొంత స్ట్రాంగ్గా ఉండడంతో పాటు, సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండడంతో .. కార్పొరేషన్ను బీజేపీకి అప్పజెప్పితే అభివృద్ధి చెయ్యడం తన పని అని ఆయన ప్రచారం చేస్తున్నారు .. కరీంనగర్ స్మార్ట్ సిటిగా అభివృద్ధి చెందిందంటే కేంద్రంలో ఉన్న బీజేపీప్రభుత్వం ఇచ్చిన నిధులే కారణమని….ఈసారి మేయర్ పీఠం బీజేపీకి వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపించి, తెలంగాణలో కరీంనగర్ని అదర్శంగా నిలుపుతానని హామీలు గుప్పిస్తున్నారు.. చేరికల విషయంలో కుడా అవినీతి అరోపణలు లేని నాయకులే తమకి అవసరం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
Also Read: గుండ విశ్వనాథ్ పొలిటికల్ ఎంట్రీ.. సిక్కోలు ఈక్వేషన్స్ మారుతాయా?
మొత్తానికి కరీంనగర్ జిల్లా లో మునిసిపల్ ఎన్నికల వేడి పెరుగుతుంటే.. ఆ ముగ్గురు లీడర్లకి కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం పెద్ద సవాల్గా మారింది.. అక్కడ గెలిచి సత్తా చాటాలని బండి, గంగుల, పొన్నం ముగ్గురు లీడర్లు పోటీ పడుతున్నారు.. మరి కరీంనగర్ కార్పోరేషన్ లో ఎవ్వరి పట్టు నిలుపుకుంటారో.. ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారో చూడాలి.
Story By Apparao. Bigtv