US–Iran War: యుద్ధం ఆగట్లేదు.. ఇరాన్ లొంగట్లేదు.. అసలు, అమెరికా ఎక్కడ ఫెయిలవుతోంది? రెండు వారాలైనా వార్ ట్రంప్ సైడ్ ఎందుకు కావట్లేదు? యుద్ధంలో ఇరాన్ దూకుడు చూశాక అందరిలోనూ ఇదే డౌట్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చే బిల్డప్కి.. పశ్చిమాసియా గ్రౌండ్లో వినిపిస్తున్న సౌండ్కి అస్సలు సంబంధం లేదనే చర్చ మొదలైంది. రోజులు గడిచిపోతున్నా అగ్రరాజ్యం మాత్రం ఇరాన్ని లొంగదీసుకోలేకపోతోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం.. అమెరికా అగ్రరాజ్య హోదాకు ఓ సవాల్గా మారింది.
ప్రెసిడెంట్ ట్రంప్ విదేశాంగ విధానమేంటో తెలుసా? పీస్ థ్రూ స్ట్రెంత్! అంటే.. బలం ద్వారానే శాంతి అని బలంగా నమ్ముతారు. అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలు, మిసైళ్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, యుద్ధ నౌకలను చూపిస్తే.. ఇరాన్ భయపడి వెనక్కి తగ్గుతుందని వైట్ హౌజ్ భావించింది. పైగా.. సుప్రీం లీడర్ ఖమేనీని ఒక్కరోజులోనే అంతమొందిస్తే.. ఇరాన్ కాళ్ల బేరానికొస్తుందనుకుంది. కానీ, ఇరాన్ దశాబ్దకాలంగా ఇలాంటి ఒత్తిళ్లని తట్టుకుంటూ, తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంది. వేలాది సూసైడ్ డ్రోన్లు, మిసైళ్లను సిద్ధం చేసి పెట్టుకుంది. సమయానికి తగ్గట్లుగా ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది. అవసరానికి తగ్గట్లుగా.. ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. అగ్రరాజ్యం లెక్కలన్నింటిని తలకిందులు చేస్తూ.. యుద్ధంలో పోరాడుతోంది. నెగ్గుతామో, లేదో తెలియదు గానీ, వెనక్కి మాత్రం తగ్గేదేలే అంటోంది ఇరాన్. యుద్ధం మీరు మొదలుపెట్టారు గానీ, ఎప్పుడు ముగించాలో, ఎలా ముగించాలో డిసైడ్ చేసేది తామేనని పదే పదే చెబుతోంది ఇరాన్. తాజా పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయ్.
ఇరాన్.. ఇజ్రాయెల్పై నేరుగా దాడులు చేయడమే కాదు, గల్ఫ్ దేశాలన్ని అమెరికా స్థావరాలతో పాటు అనేక ప్రదేశాలపై బాంబులు వేస్తోంది. ఇరాన్ దాడులతో యూఎస్పై ప్రెజర్ పెరుగుతోంది. దాంతో.. అమెరికాకు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతోందనే చర్చ మొదలైంది. అందువల్లే.. 2 వారాలైనా ఇరాన్ని లొంగదీసుకోలేకపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయ్. పైగా ఇరాన్ కూడా చాలా తెలివిగా కొడుతోంది. యుద్ధంలో టైమ్ ఒక్కటే కాదు టైమింగ్ కూడా చాలా ముఖ్యం. అందుకు తగ్గట్లుగానే.. అన్ని అస్త్రాలను ఒకేసారి తీయట్లేదు. ఒక్కో ఆయుధాన్ని, వ్యూహాన్ని సమయానికి తగ్గట్లుగా వాడుతోంది ఇరాన్. ముఖ్యంగా.. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుందని, ఇంతలా టైట్ చేస్తుందని.. ట్రంప్ అస్సలు ఊహించలేదు. ఇరాన్పై వారం లోపే పైచేయి సాధిస్తాం, హర్మూజ్కు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నారు. హర్మూజ్ గుండా వెళ్లే నౌకలను కూడా ట్రంప్ ఎస్కార్ట్ చేస్తామని చెప్పారు. కానీ.. ఇరాన్ దెబ్బకు అమెరికానే చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా.. ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలపైనే దాడులు చేస్తున్నామని ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది.
యుద్ధం మొదలయ్యాక.. ఇరాన్ ముందుగా సూసైడ్ డ్రోన్లతో ఎటాక్ చేసింది. ఆ తర్వాత.. మిసైళ్లని ప్రయోగించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలన్నీ టార్గెట్లని పక్కాగా ఛేదించింది. ముఖ్యంగా, ప్రపంచ చమురు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిపై పట్టు సడలకుండా చూసుకుంది. చమురు నౌకలను తమ పరిధి దాటకుండా చేసింది. ముందుకు కదిలితే.. బాంబులతో దాడులు చేసింది. నావల్ మైన్స్ పెట్టి భయపెట్టింది. సూసైడ్ బోట్లతోనూ ఎటాక్స్ చేస్తోంది. అమెరికా మూడు భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను గల్ఫ్ ప్రాంతానికి పంపినా.. అవి హర్మూజ్ వైపు వచ్చేందుకు తటపటాయిస్తున్నాయ్. ఐఆర్జీసీ మాత్రం అమెరికా నౌకలు వస్తే చూసుకుంటాం అన్నట్లుగానే ఉంది. అమెరికా డిఫెన్స్ సిస్టమ్ అలసిపోయేలా చేసే ఆయుధాలతో ఇరాన్ దళాలు హర్మూజ్ దగ్గర సిద్ధంగా ఉన్నాయ్. సముద్ర దిగ్బంధం వ్యూహంలో మస్కిటో ఫ్లీట్గా పిలిచే చిన్న సూసైడ్ బోట్లు వందల సంఖ్యలో ఉన్నాయ్. టెహ్రాన్కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని తొడగొడుతున్న అమెరికాకు.. ఇవి షాక్ ఇస్తున్నాయ్. నాసర్, కౌసర్ లాంటి షార్ట్ రేంజ్ సూపర్ సోనిక్ గైడెడ్ మిసైళ్లని వీటికి అమర్చి వాడుతున్నారు. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా ఇంకొన్ని అధునాతన మిసైళ్లున్నాయి. ఇప్పుడు ఏకంగా.. అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్పైనే దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ మిసైల్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఢీకొట్టిందని తెలిపింది. దాంతో.. అది పనిచేయడం లేదని, గల్ఫ్ వాటర్స్ నుంచి వెనక్కి తగ్గిందని క్లెయిమ్ చేసింది. అయితే, అమెరికా దీనిని తోసిపుచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో తమ యుద్ధ నౌక సపోర్ట్ ఉందని చెబుతోంది.
యుద్ధాన్ని మొదలుపెట్టడం ఈజీనే. కానీ.. దాన్ని ముగించడమే కష్టం. ఇరాన్ లాంటి దేశాన్ని అమెరికా లాంటి అగ్రరాజ్యం తక్కువ అంచనా వేయడంలో అర్థం ఉంది. కానీ, యూఎస్ చేసిన పెద్ద తప్పు అదే. ఇరాన్కు ఉన్న భౌగోళిక పరిస్థితులు, భూగర్భ సైనిక స్థావరాలే.. ఆ దేశానికి కొండంత అండ. కేవలం.. బాంబు దాడులు, డ్రోన్లు, మిసైల్ ఎటాక్స్తో ఓ దేశాన్ని లొంగదీసుకోవచ్చనే అమెరికా పాత చింతకాయ పచ్చడి వ్యూహాలు ఇప్పుడు అస్సలు పనిచేయడం లేదు. ఇరాన్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఎలా ఛేదించాలో తెలియక.. ట్రంప్ సతమతమవుతున్నారు. అందుకే.. ఇంకా యుద్ధం ఓ కొలిక్కి రావట్లేదు.
అమెరికాకు ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ఉంది. కానీ, ఇరాన్ చాలా తెలివిగా అసిమెట్రిక్ వార్ఫేర్ని అనుసరిస్తోంది. భారీ యుద్ధ నౌకల కంటే, చౌకగా దొరికే డ్రోన్లతో.. అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఇరాన్ దెబ్బతీస్తోంది. వందల కోట్ల విలువైన క్షిపణులను ఎదుర్కోవడానికి ఇరాన్ కేవలం లక్షలు విలువ చేసే డ్రోన్లను వాడుతోంది. ఇదే.. అమెరికాకు లక్ష కోట్లు ఖర్చయ్యేలా చేసింది. గతంలో.. అమెరికా యుద్ధానికి వెళితే.. యూరప్ దేశాలు వెంటనే మద్దతిచ్చేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాటో దేశాలు కూడా తమకు సంబంధం లేదని, యుద్ధం కోసం తమ బేస్లని వాడుకోవద్దని.. యూఎస్ మొహం మీదే చెప్పేశాయ్. దాంతో.. ట్రంప్ అనుకున్నంత ఈజీగా ఇరాన్ని ఏకాకిని చేయలేకపోతున్నారు. పైగా, హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఉక్కు పిడికిలి బిగించడంతో.. చమురు సప్లై చైన్ తెగి, అది ప్రపంచ మార్కెట్ని ప్రభావితం చేస్తుందనే భయాలు కూడా అమెరికాపై ప్రెజర్ పెంచుతున్నాయ్.
ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరుగా మిగల్లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న పెను సంక్షోభంగా మారింది. వారంలో ఇరాన్ను దారికి తెస్తామని ప్రగల్భాలు పలికిన అమెరికాకు, ఇప్పుడు ఇరాన్ గట్టి సవాల్నే విసురుతోంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై.. అమెరికా-ఇజ్రాయెల్ మెరుపు దాడులు ప్రారంభించినప్పుడు, ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందని భావించారంతా. కానీ, యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అమెరికా అంచనాలకు భిన్నంగా మారుతున్నాయ్. ఇరాన్ తన మిసైళ్లు, డ్రోన్ సిస్టమ్తో ప్రతిఘటిస్తూ.. అమెరికా ఆయుధాలను, రక్షణ వ్యవస్థను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. అమెరికా ఎన్ని రకాలుగా ఈ రూట్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇరాన్ సముద్రంలో పాతిన మైన్లు, డ్రోన్ డాడులు అడ్డంకిగా మారాయ్. దీనివల్ల ముడిచమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్ల మార్కు దాటింది. యుద్ధం ముదిరితే.. 200 డాలర్లకు చేరుతుందని ఇరాన్ హెచ్చరిస్తోంది.
ఇప్పటికే.. ఇండియాలో యుద్ధం వల్ల గ్యాస్ కొరత మొదలైంది. కేంద్రం కూడా సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. హర్మూజ్ జలసంధి మూతపడటంతో.. ఖతార్ లాంటి దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సప్లై నిలిచిపోయింది. దీనివల్ల.. హోటళ్లు, పరిశ్రమలకు గ్యాస్ కొరత ఏర్పడి, రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయ్. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే.. దేశ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికిప్పుడు యుద్ధం నిలిచిపోతే బాగుంటుందని చాలా దేశాలు అనుకుంటున్నాయ్. కానీ.. అమెరికా బేషరతు లొంగుబాటు కోరుతుంటే.. ఇరాన్ మాత్రం ఆత్మగౌరవం కోసం పోరాడుతోంది. తమపై.. ఇంకెప్పుడూ దాడులు చేయబోమని అమెరికా గ్యారెంటీ ఇస్తే తప్ప.. వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ చెబుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న దూకుడు నిర్ణయం.. ఇప్పుడు ప్రపంచ దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. దౌత్యపరమైన చర్చలు విఫలమై, ఇరాన్ పోరాటాన్ని కొనసాగిస్తే.. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలే లేవని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ లాంటి దేశాలు ఆల్టర్నేట్గా రష్యా నుంచి చమురు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, రవాణా మార్గాలు మూసుకుపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. దాంతో.. ఈ సమస్య ఇప్పటికిప్పుడు తీరిపోయేలా కనిపించట్లేదు.
Also Read: గిరిజన పల్లెల్లో జనసేనాని.. చిన్నారులతో పవన్ ముచ్చట్లు.. చూస్తే ఫిదా కావాల్సిందే!
Story by: Anup, Big Tv