రాజకీయాలు చేయలేనని చెప్పి వైసీపీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఒకటి రెండు రోజులు చేశారు కూడా. అందుకు సంబంధించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. తరువాత ఆయన ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారో తెలియదు కానీ.. పెద్దగా బయటకు కనిపించడం లేదు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మళ్లీ పాలిటిక్స్ పై మాట్లాడి హీట్ పెంచేశారు. తన అవసరం ఉందనుకుంటే రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు.
తన పొలిటికల్ కేరీర్ కు ఎండ్ కార్డు పడలేదు అంటున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాను ఎప్పుడైనా కమ్ బ్యాక్ అవుతానేమో అని చెబుతున్నారు. తాను ఏ పార్టీలో లేనని, ప్రస్తుతం పూర్తిగా రైతుగానే ఉన్నానని చెప్పినప్పటికీ, ఆయన భవిష్యత్తుపై చేసిన ప్రకటన రాజకీయాల్లో హీట్ పెంచింది. తాను తలచుకుంటే పార్టీ పెడతానని.. వెనకాడే ప్రసక్తే లేదు అని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే అది ఎవరి కోసం? తనకోసం తాను వస్తారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం వస్తారా? అన్నది మాత్రం చెప్పలేదు. రాజకీయాల్లో తన ప్రాధాన్యతను తగ్గించినందుకు, ఆయన తన సొంత బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఈ కామెంట్స్ తో విజయసాయిరెడ్డి చెప్పదల్చుకున్నట్టుగా తెలుస్తోంది.
తాను ఎప్పుడూ ఆప్షన్ గా ఉంచుకునే జగన్ కోటరి పైనా విజయసాయిరెడ్డి మాట్లాడారు. తన రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాన్ని పరోక్షంగా బయటపెట్టారు. వైఎస్ జగన్తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, అయితే ఆయన చుట్టూ చేరిన నిబద్ధత లేని వ్యక్తుల కోటరీ సమస్య అని మరోసారి హైలెట్ చేశారు. ముఖ్యంగా తన విషయంలో జగన్ను ఆ కోటరీ పూర్తిగా తప్పుదోవ పట్టించిందని ఆయన ఆరోపించారు. ఒకనాటి అత్యంత సన్నిహిత సహచరుడిగా, జగన్ మంచి మాటలను మాత్రమే వినాలని, అన్నీ ఆలోచించాలని హితవు చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉన్న టైంలో పవన్ కల్యాణ్ ను విమర్శించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు స్వరం మార్చారు. పవన్ కల్యాణ్ ను పొగిడేందుకు ప్రయత్నించారు. తనకు ఆయనతో 20 ఏళ్ల స్నేహం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయనను తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని.. భవిష్యత్తులో అననని చెప్పారు. వైసీపీలో ఉన్నప్పుడు పవన్పై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి, ఇప్పుడు ఇలా మాట్లాడటం స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది.
మొన్న ఆ మధ్యన విజయసాయిరెడ్డి వైసీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అయితే మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డిని టచ్ చేయకపోవడం జగన్లో అనుమానం పెంచుతోంది. అయితే వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి.. తరచూ రాజకీయాల గురించి.. పొలిటికల్ రీఎంట్రీ గురించి మాట్లాడుతుండడం మాత్రం ఆయనలో ఉన్న ఆశలను తెలియజేస్తోంది. ఓవరాల్ గా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోలేదని క్లియర్ గా అర్థమవుతోంది. తన రాజకీయ భవిష్యత్తును తానై నిర్ణయించుకుంటానని, అవసరమైతే సొంత పార్టీతో తిరిగి వస్తానని గట్టి సంకేతాలు పంపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. మరి, ఆయనకు అంత జనాధారణ ఉందా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: టార్గెట్ ఫిక్స్.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ
Story By: Venkatesh