Biryani History:పెళ్లి, పండగ, పార్టీ… ఈవెంట్ ఏదైనా బిర్యాని మాత్రం ఖాయం.
చుట్టూ ఎన్ని వంటకాలున్నా అందరి చూపు ఘుమఘుమలాడే బిర్యానీ వైపే.
వందల సంఖ్యలో ఐటమ్స్ ఉన్నా బిర్యానీ లేదంటే యుద్ధాలు జరగాల్సిందే.
మరి తిండి ప్రియులని అంతగా ఊరించే ఆ బిర్యానికి అసలు ఆ పేరు ఎందుకొచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా?
లొట్టలేసుకుంటూ తింటున్న బిర్యానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఆరా తీశారా?
ఇప్పుడు తీద్దాం రండి!
పర్షియన్ భాషలో “బిరింజ్” అంటే బియ్యం
నిజానికి మనం ఇంతగా ఆవురావురుమని తింటున్న ఈ బిర్యాని పదం ఇక్కడిది కాదు. ఆ మాటకొస్తే అసలు ఇండియాదే కాదు.మన దేశానికి కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఉన్న పర్షియా (ఇప్పటి ఇరాన్) దేశానికి చెందినది.అవును.. పర్షియన్ భాషలో “బిరింజ్” అంటే బియ్యం అని అర్థం వస్తుంది.
ఇక బియ్యంతో చేసే ప్రత్యేకమైన వంటకం కాబట్టి, రాను రాను ఆ “బిరింజ్”అనే పదం “బిర్యాన్”గా, ఆ తర్వాత మన నోళ్లలో నాని నాని చివరికి “బిర్యానీ”గా మారింది అన్నది చరిత్రకారులు చెబుతున్న మాట.ఇక మరికొందరు చరిత్రకారులు చెబుతున్న మాటలని బట్టి పర్షియన్లో “బిర్యాన్” అంటే వేయించడం లేదా కాల్చడం అని అర్థం వస్తుందట.ఎందుకంటే, బిర్యానీ వండేటప్పుడు బియ్యాన్ని లేదా మాంసాన్ని మొదటగా కొంచెం సేపు వేయించి, ఆ తర్వాత ప్రత్యేకమైన “దమ్”పద్ధతిలో మూతపెట్టి నెమ్మదిగా ఆవిరిపై ఉడికిస్తారు.
అలా ఒక ప్రత్యేక వంట విధానం వల్లే “బిర్యాన్”నుంచి “బిర్యానీ”అనే పేరు వచ్చిందని చెబుతుంది హిస్టరీ.అంటే ఎటు చూసినా ఈ బిర్యాని అనే పదాన్ని పర్షియా నుంచే దిగుమతి చేసుకున్నామన్న మాట.పర్షియా (ఇప్పటి ఇరాన్) దేశంలోని రాజుల కుటుంబాల్లో ఉండే వంటగాళ్లు మంచి వాసన వచ్చే బియ్యాన్ని, మాంసంతో కలిపి చేసే కాంబినేషన్లు అక్కడ బాగా ఫేమస్.ఇక అక్కడ రాజులు కూడా వాటిని లొట్టలేసుకుంటూ తినేవారు.
ఘుమఘుమలాడేలా తయారుచేసింది మాత్రం నిజాములే
అయితే రాను రాను ఆసియా నుంచి వచ్చిన వ్యాపారులు, దండయాత్రలకు వచ్చిన సైన్యాలు, ముఖ్యంగా మొఘల్ రాజవంశస్తులు ఈ నోరూరించే వంటకాన్ని భారతదేశానికి తీసుకొచ్చినట్టు చరిత్ర చెబుతుంది.అయితే చాలామంది అనుకున్నట్టుగా బిర్యానీని భారతదేశానికి పరిచయం చేసింది మొఘలులే అయినప్పటికీ, ఇప్పుడు మనకి నోరూరించే బిర్యానిలా మార్చింది మాత్రం ఇక్కడి రాజ వంశాలకే దక్కుతుంది.
వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన హైదరాబాద్ నిజాంల గురించి!ఇండియాకి వచ్చిన బిర్యానిని మరింత రుచిగా, ఘుమఘుమలాడేలా తయారుచేసింది మాత్రం రాజభవనాల్లో ఉండే వందలాది మంది వంటగాళ్లే.ఒక రకంగా ఆ నిజాముల వంటశాలల నుండే ఇపుడు మనం లొట్టలు వేసుకుని తింటున్న హైదరాబాద్ దమ్ బిర్యానీ పుట్టుకొచ్చిందని చెప్పాలి.-
ఇక బాగా ఇష్టంగా తినే హైదరాబాద్ బిర్యానీలో ఉన్న అసలు స్పెషాలిటీ ఏంటంటే…పచ్చి మసాలాల్లో బాగా నానబెట్టిన మాంసంపై సగం ఉడికించిన బాస్మతి బియ్యాన్ని వేసి, హండీకి పిండితో సీల్ చేసి, తక్కువ మంట మీద గంటల తరబడి దమ్లో ఉడికించడమే.ఆ మూత తీయగానే వచ్చే సువాసనే ఈ బిర్యానీకి అసలైన అందం.
బిర్యానీలో ఇంకా చాలా రకాలున్నాయ్
అయితే కేవలం ఒక్క మనకి తెలిసినట్టుగా ఒక్క హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏ కాదండోయ్.. ఇంకా చాలా రకాలున్నాయ్.హైదరాబాద్ బిర్యానీ మంచి ఘాటు మసాలాలకు పెట్టింది పేరైతే, లక్నోలో తక్కువ మసాలాలతో మైల్డ్గా చేసే అవధీ బిర్యానీ ఫేమస్.ఇక కోల్కతా బిర్యానీని ఆలుగడ్డ లేకుండా అస్సలు ఊహించుకోలేం.ఇక తమిళనాడులో అంబూర్ బిర్యానీ, కేరళలో మలబార్ బిర్యానీ, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు స్టైల్ బిర్యానీ… ఇలా ప్రతి ప్రాంతంలో ఒక్కో రకమైన బిర్యానీ ఫేమస్ అయిపోయింది.ఇక బిర్యానీ అనగానే మనకు గుర్తొచ్చేది చికెన్, లేదా మటన్ బిర్యాని.
కాదు కూడదు అంటే ఫిష్, ప్రాన్స్ బిర్యానీలు కూడా దర్శనమిస్తుంటాయి.కానీ ఇపుడు రెండు, మూడు వెరైటీలతో ఆగిపోతే మజా ఏముంటుంది అనుకున్నారేమో…వెజ్, పనీర్, పనసకాయ బిర్యానీ, మష్రూమ్… ఇలా రకరకాల వెరైటీలతో ఇపుడు మార్కెట్ని షేక్ చేస్తున్నారు మన వంటలన్నలు.బిర్యానీ గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…
ఆర్డర్ చేసే వంటకాల లో బిర్యానీదే ఫస్ట్ ప్లేస్
మన దేశంలో ఫుడ్ డెలివరీ యాప్లు ప్రతి ఏటా ఇచ్చే రిపోర్ట్స్లో అత్యధికంగా ఆర్డర్ చేసే వంటకాల జాబితాలో బిర్యానీదే ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్!అంటే, ప్రతి కొన్ని సెకన్లకోసారి దేశంలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు బిర్యానీని ఆర్డర్ చేస్తూనే ఉన్నారన్నమాట.
ఇక చాలామందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే...
అసలు పులావ్కి, బిర్యానీకి తేడా ఏమిటి? అని.రెండూ ఒకటే అనుకుంటే మీరు బిర్యానీలో హ్యాండేసినట్టే.అవును..పులావ్లో బియ్యం, మాంసం లేదా కూరగాయలను అన్నింటినీ కలిపి ఒకేసారి ఉడికిస్తారు.కానీ బిర్యానీలో బియ్యాన్ని, మాంసాన్ని విడివిడిగా సగం సిద్ధం చేసి, చివర్లో దమ్ పద్ధతిలో లేయర్లుగా వేసి ఉడికిస్తారు.అందుకే బిర్యానీ టెస్ట్ అండ్ స్మెల్ అంత స్పెషల్.
మొత్తానికి ఎక్కడో పర్షియాలో మొదలై, మొఘల్ రాజభవనాలు దాటి, మన నిజాంల వంటశాలల్లో రూపు దిద్దుకొని ఈనాడు మన పళ్లాలలో ఇలా కొలువు తీరిందన్న మాట.