అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడా? రాడా? అనే చర్చ జరుగుతున్న సమయంలో .. కేసీఆర్ తనయ.. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత దీనిపై ఆసక్తికర కామెంట్ చేశారు. కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితమవుతారా? అసెంబ్లీకి వస్తారా? అనే చర్చ అనవసరమైనదని ఆమె కొట్టి పారేశారు.
ఆయన వచ్చినా, రాకున్నా.. జనాలకు పెద్ద పట్టింపులేని సమస్యగా ఆమె భావించారు. అసలు ఉద్దేశ్యాలను పక్కన పెట్టేలా , డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే బీఆరెస్, కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలుగా ఆమె తేల్చి పారేశారు. అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన చాలా సమస్యలు చర్చించాల్సినవి ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉద్యమకారుల ఇష్యూపై క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు కవిత. ఫీజు రియంబర్స్మెంట్పై కూడా అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉందన్నారు. ప్రజలకు అనేక హామీలిచ్చి వచ్చిన ప్రభుత్వం.. అవేమీ నెరవేర్చకుండా పొలిటికల్ డైవర్షన్ వ్యూహాన్ని ఎంచుకున్నదని ఆమె విమర్శించారు.
వెయ్యి రోజుల పాలనపై బీఆరెస్.. కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని, ఈ రెండు పార్టీలకు ప్రజా సమస్యలపై చర్చించాలనే సోయి లేదనే విధంగా ఆమె విమర్శలు గుప్పించారు. వెయ్యి రోజుల పాలన పేరిట .. ఆ రెండు పార్టీలు రాజకీయాలకు ఇస్తున్న ప్రయార్టీ.. ప్రజా సమస్యలపై ఏమాత్రం ఇవ్వడం లేదని ఆమె ధ్వజమెత్తిన తీరు చర్చనీయాంశమవుతోంది.
ఎన్నో సమస్యలపై చర్చించి చట్టాలు చేయాల్సిన అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా? రారా? అనేదే కీలకంగా మార్చి.. ప్రధాన సమస్యల నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలనే ఎత్తుగడ కనిపిస్తోందని కవిత విమర్శించారు. బీఆరెస్ కూడా కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకుని కేవలం రాజకీయాలకు, ప్రకటనలకే పరిమితమవుతోందని, ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు.
కేసీఆర్ అసంబ్లీకి రావడం లేదనేది ఖాయం. కానీ ఆయన వస్తారా? రారా? అనే సమస్యను సజీవంగా ఉంచడం కాంగ్రెస్ ఎత్తుగడలో ఓ భాగం. బీఆరెస్ కూడా ఈ వ్యూహంలో చిక్కుకుని కేసీఆర్ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతారంటూ కామెంట్ చేయడం మరో పెద్ద పొరపాటు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ చర్చకు వస్తున్నాయి.
అసలు విషయాలను పక్కన బెట్టి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయమే పరమావధిగా కొనసాగుతున్నాయనే విషయాన్ని కవిత లేవనెత్తిన అంశం చర్చకు తెర లేపింది.