అధికార పార్టీ మీద ఆగ్రహం కామనే. రెండున్నరేండ్లు అవుతుంది. ఇంకా చేయాల్సింది చాలనే ఉంది. ప్రతిపక్షం వైపు డైవర్ట్ అవడమూ కామనే. తాము అనుకున్నవి నెరవేరనప్పుడు ప్రతిపక్షం పంచన చేరి.. నిలదీసి ప్రశ్నించడం కూడా జనం చేసే పనే. ఇప్పుడు అదే జరుగుతోంది.
అధికార పక్షాన్ని ఎంతగా నిలదీస్తే.. ఈ మిగిలిన పాలనా సమయంలో హామీలు నెరవేరి, తమకు మేలు జరుగుతుందనే భావన అందరిలో ఉంటుంది. అదే జరుగుతున్నది కూడా. అలాగని, ప్రతిపక్షం తప్పులన్నీ క్షమించేసినట్టు కాదు. పశ్చాత్తాప పడ్డ ప్రతిపక్ష నేతను ఆశీర్వదించినట్టూ కాదు. ఇప్పటి అవసరం ఇంతే. అప్పటి పరిస్థితులు అప్పుడు.
ఇప్పుడు నేను చెప్పేది .. వరుసగా ఇటీవల బీఆరెస్ పార్టీ చేపట్టిన రెండు ప్రాధన్యతకలిగిన ప్రోగ్రాంల గురించి. ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించిన యువ సంగ్రామ సదస్సు.. రెండోది ఇవాళ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన జెన్-జీ నీట్ ఉద్యమానికి సంఘీభావ ధర్నా! ఈ రెండూ సక్సెసయ్యాయనే చెప్పాలి. ఒకటి నిరుద్యోగుల అంశం.. రెండోది యువత గురించి.
ఈ రెండు వేదికల మీద కేటీఆర్ మాట్లాడిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఆయా వర్గాలను ఆకర్షించాయి కూడా. సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో ప్రధానంగా సర్కారీ ఉద్యోగాల ప్రస్తావన వచ్చింది. ఈ వేదికగా కేటీఆర్.. గతంలో కాంగ్రెస్ హామీలిచ్చిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల వీడియోలను ప్రదర్శించడం ద్వారా నిరుద్యోగ యువత మోసపోయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో పాటు .. ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ చెబుతూ వస్తున్న 70 వేల ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఛాలెంజ్ విసరడం ద్వారా… నిరుద్యోగ యువతలో ఓ అనుమాన బీజం నాటగలిగాడు.
కేవలం ఓ పదివేల ఉద్యోగాలిచ్చి.. బీఆరెస్ హయాంలో ఇచ్చిన వాటికే నియామక పత్రాలు ఇవ్వడం ద్వారా ఆ లెక్కలను 70వేలకు పెంచుకున్నారని… డెబ్బైవేల ఉద్యోగాలు నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ విసిరాడు. దీనికి కాంగ్రెస్ బదులిచ్చినా.. నెగిటివ్ ప్రచారం జరిగినంతగా.. అక్కడ పాజిటివ్ను జనం పట్టించుకోలేదు. చివరగా రేవంతే.. నిరుద్యోగులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. కేటీఆర్ మాయమాటలను నమ్మి మోసపోవద్దని, ఖాళీలన్నీ భర్తీ చేస్తానని ప్రకటించాల్సి వచ్చింది.
ఈ సమావేశంలో పొరపాట్లు జరిగాయని కూడా కేటీఆర్ ఒప్పుకోవడంతో కొంత సానుభూతిని పొందగలిగాడనేది వాస్తవం. ఇక ఇవాళ ఇందిరాపార్క్ వద్ద జరిగిన బీఆరెస్వీ ఆందోళన కార్యక్రమంలో కూడా కేటీఆర్ పాల్గొని యూత్ను ఆకట్టుకునే విధంగా ప్రసంగించాడు. మధ్య మధ్యలో సినిమా డైలాగులు కొట్టి జెన్-జీని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. తనను కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా అక్కడే ప్రస్తావించి.. కాంగ్రెస్ వ్యూహానికి గండికొట్టేలా మాట్లాడాడు.
నేను బీజేపీని తిడితే మీరెందుకు వస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్.. పేపర్ లీకేజీల విషయంలో తన తప్పు నిరూపిస్తే… ఇందిరాపార్క్ వద్దే ఉరి తీయండి.. అని సవాల్ విసరడం కూడా తనపై ఎలాంటి మరకలు లేవనే విధంగా నమ్మించే ప్రయత్నం చేశాడు కేటీఆర్. కానీ ధర్నా చౌక్ వద్ద ఎలా ధర్నా చేస్తావ్..? ఇది మీ నాన్న ఎత్తేసిన సెంటర్ కదా..? ఇదే దిక్కయ్యిందా..? మళ్లీ .. అని కాంగ్రెస్ వేసిన ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర సమాధానాలు లేవు. దీంతో పాటు బీఆరెస్ హయాంలో ప్రశ్నాపత్రాల లీకేజీలు ఎప్పుడెప్పుడు జరిగాయో సోదాహరణగా వివరిస్తూ సిటీలో పోస్టర్లు వేయడం ద్వారా కాంగ్రెస్ .. కేటీఆర్ను కొంత కంట్రోల్ చేయగలిగింది. అంతిమంగా.. ఈ రెండు ప్రోగ్రాముల ద్వారా బీఆరెస్ పార్టీ నిరుద్యోగ,యువత.. లో మైలేజీనైతే పొందగలిగిందనే చెప్పాలి.