Cyber Attack: ప్రస్తుతం టెక్నాలజీ అనేక మంది జీవితాలను సులభతరం చేస్తుంది. కానీ ఇదే టెక్నాలజీ సైబర్ దాడుల పేరుతో భయపెడుతోంది కూడా. ఎప్పటికప్పుడు పలు రకాల దాడుల పేరుతో అనేక మందిని మోసం చేస్తోంది. ఈ క్రమంలో బ్యాంకులు, ఆస్పత్రులు, ఈ-కామర్స్, టెక్ సంస్థలపై అనేక సైబర్ దాడులు జరుగుతున్నాయి.
ప్రముఖ బట్టల సంస్థ
ఈ నేపథ్యంలోనే ఇటీవల బ్రిటన్కు చెందిన ప్రముఖ దుస్తుల బ్రాండ్ మార్క్స్ & స్పెన్సర్ సంస్థ వెబ్సైట్ పై సైబర్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా కంపెనీ అంతర్జాతీయ కార్యకలాపాలు మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులకు ఆన్లైన్ ఆర్డర్లు ఇవ్వడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్ని దేశాల్లో అయితే సంస్థ పూర్తిగా ఆర్డర్లు తీసుకోవడం ఆపేసింది. ఇది కేవలం ఒక కంపెనీ సమస్య మాత్రమే కాదు. ఇది గ్లోబల్ వ్యాపార ప్రపంచానికి ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. డిజిటల్ ప్రపంచంలో డేటా రక్షణ ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.
కొత్త జాబ్స్ బంద్
ఈ సమయంలో కంపెనీ కొత్త ఉద్యోగాలను స్వీకరించడం ఆపేసింది. ఈ సైబర్ దాడి కారణంగా కంపెనీ ప్రతిరోజూ లక్షలాది డాలర్లను కోల్పోయిందని నివేదికలు తెలిపాయి. అదే సమయంలో మరో రిటైలర్ హారోడ్స్ కూడా సైబర్ దాడికి గురైనట్లు ప్రకటించారు. ఈ సైబర్ దాడి వల్ల మార్క్స్ & స్పెన్సర్ ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్లు రెండూ ప్రభావితమయ్యాయి.
Read Also: Pickle Business: మహిళలకు బెస్ట్ బిజినెస్..నెలకు రూ.60 వేల …
వారం రోజులు
కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాకింగ్ (Cyber Attack) కారణంగా, కంపెనీ దాదాపు వారం రోజులుగా కస్టమర్ల నుంచి కొత్త ఆర్డర్లు తీసుకోలేకపోయింది. దీని కారణంగా, చాలా మంది కస్టమర్లు షాపుల నుంచి వెనక్కి వెళ్లిపోయారు. అమ్మకాలు తగ్గడం వల్ల సంస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో సైబర్ దాడి కారణంగా కంపెనీకి 750 మిలియన్ యూరోలు (సుమారు రూ. 7500 కోట్లు) నష్టం వాటిల్లిందని నివేదికలు చెబుతున్నాయి.
ఆఫ్లైన్ స్టోర్లలో
దీనిపై కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ మాకిన్ మాట్లాడుతూ, ఈ వారం నుంచి ఆఫ్లైన్ స్టోర్లలో సేవలు పునరుద్ధరించబడతాయని, వినియోగదారులు షాపింగ్ కోసం రావచ్చని చెప్పారు. అయితే, ఆన్లైన్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించడానికి దాదాపు ఒక నెల సమయం పడుతుందన్నారు.
వెబ్సైట్లో నోటీస్
వెబ్సైట్, యాప్ నుంచి షాపింగ్ జరగడం లేదన్నారు. సైబర్ దాడి కారణంగా సేవలు అందుబాటులో లేకపోవడంపై కంపెనీ తన గ్లోబల్ వెబ్సైట్లో నోటీస్ ద్వారా తెలియజేసింది. తమ డాట్ కామ్ వెబ్సైట్, యాప్, మొబైల్ బ్రౌజర్ పనిచేయడం లేదని కంపెనీ తెలిపింది. స్కాటర్డ్ స్పైడర్ అనే హ్యాకింగ్ గ్రూప్ బ్రిటిష్ బ్రాండ్ మార్క్స్ & స్పెన్సర్పై దాడి చేసిందని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఏజెన్సీ దర్యాప్తు
రాన్సమ్ దాడిలో వెబ్సైట్ లేదా కంప్యూటర్ సిస్టమ్ను హ్యాక్ చేయడం ద్వారా కొంత ముఖ్యమైన సమాచారం లేదా డేటా చోరీ చేయబడుతుంది. ఆ తర్వాత దానిని లీక్ చేయకుండా ఆపడానికి మనీ డిమాండ్ చేస్తారు. లేదంటే ఇంకేదైనా డీల్ కోసం డిమాండ్ చేయవచ్చు. అయితే ఈ దాడిపై నేషనల్ క్రైమ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోందని, త్వరలోనే సేవలు పూర్తిగా పునరుద్ధరించబడతాయని కంపెనీ స్పష్టం చేసింది.