Twitter X Premium | ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్స్క్రైబర్లకు ఎక్స్ తాజాగా షాకిచ్చింది. ఈ ప్లాన్ ధరను ఏకంగా 35 శాతం పెంచుతున్నట్టు పేర్కొంది. ఈ డిసెంబర్ 21 నుంచే సవరించిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. పెరిగిన చార్జీల కారణంగా పాత వినియోగదారులతో పాటు కొత్త కస్టమర్లపై కూడా భారం తప్పదు.
ఎక్స్ ప్రకటన ప్రకారం, భారతీయ యూజర్లకు ఎక్స్ ప్రీమియం ప్లస్ ప్లాన్ చార్జీ నెలకు రూ.1300 నుంచి రూ.1750కి పెరిగింది. అంటే.. ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్స్క్రైబర్లు ఇకపై ఏటా రూ.13,600కు బదులు రూ.18,300 చెల్లించాలన్నమాట. అయితే, బేసిక్, ప్రీమియం ప్లాన్ల సబ్స్క్రిప్షన్ రేట్లను మాత్రం ఎక్స్ యథాతథంగా కొనసాగించింది. దీంతో, బేసిక్ యూజర్లు ఎప్పటిలాగే నెలకు రూ.243, ప్రీమియం ప్లాన్ యూజర్లు నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సవరించిన ధరలు అంతర్జాతీయంగా కూడా అమల్లోకి రానున్నాయి. దీంతో, అమెరికాలో వినియోగదారులు ప్రీమియం ప్లస్ ప్లాన్ కోసం నెలకు 22 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ చార్జీ 16 డాలర్లుగా ఉండేది.
Also Read: 2024లో మారిన ప్రపంచ రాజకీయాలు.. ఏ దేశంలో ఏం జరిగిందంటే..
చార్జీ పెంపునకు కారణం ఏంటంటే..
ప్రీమియం ప్లస్ యూజర్లకు ప్రస్తుతం అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. యాడ్ రహిత బ్రౌజింగ్, కస్టమర్ సపోర్టుకు సంబంధించి తొలి ప్రాధాన్యతతో పాటు రాడార్ వంటి అధునాతన ఫీచర్లు ప్రీమియం ప్లస్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో గ్రోక్ ఏఐ మోడల్ అందుబాటులోకి రానుంది. దీంతో, ఎక్స్ వినియోగదారులకు అనేక సేవలు మరింత సులభంగా పొందొచ్చు.
ప్రీమియం ప్లస్ వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చార్జీల పెంపు తప్పనిసరైందని ఎక్స్ తన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి జనవరి 20 నుంచి మొదలయ్యే కొత్త బిల్లింగ్ సైకిల్తో ఈ ధరలు అమల్లోకి వస్తాయని ఎక్స్ పేర్కొంది. ఈ తేదీకి ముందే బిల్లింగ్ సైకిల్ ముగిసేవారికి పాత ధరలే వర్తిస్తాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. కంటెంట్ క్రియేటర్లకు మరింత మేలు చేకూర్చేలా ఎక్స్ తన రెవెన్యూ షేరింగ్ మోడల్ను సవరించింది. యూజర్లను కంటెంట్ ఎంతగా ఆకట్టుకుంటోందనే ధాని ఆధారంగా చెల్లింపులు ఉండనున్నాయి. క్రియేటర్ల విషయంలో మరింత సమతూకం పాటించేందుకు ఎక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా లెక్కల ప్రకారం, ఎక్స్ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య సుమారు ఆరున్నర లక్షలు.
ప్రీమియం ఫీచర్లు అనేకం అందుబాటులోకి తేవడంతో పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గతంలో చెప్పుకొచ్చారు. ప్రీమియం ఫీచర్లైన బ్లూ చెక్ మార్క్, ట్వీట్లు సవరించే ఆప్షన్, కస్టమ్ యాప్ ఐకాన్లు, ట్వీట్ ఎనాలిసిస్ వంటివి కస్టమర్లను ఆకట్టుకుంటున్నట్టు చెప్పారు. ఎక్స్ను యూజర్లకు మరింత దగ్గర చేసేందుకు రెండేళ్ల క్రితమే 2.0 ప్లాన్ను విడుదల చేసిన మస్క్ నాటి నుంచి వడివడిగా పలు మార్పులుచేర్పులు చేపడుతున్నారు.