Nirmala Sitharaman: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారత్-అమెరికా మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం గురించి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు.
జోరందుకున్న చర్చలు
అమెరికాలో జరుగుతున్న ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సమావేశాల్లో పాల్గొనేందుకు సీతారామన్ ఏప్రిల్ 20-25 వరకు అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్తో సమావేశం కానున్నారు. చర్చలు స్థిరంగా సాగుతున్నాయని, రెండు దేశాల సమస్యలను పరిష్కరించి, విస్తృత వాణిజ్య భాగస్వామ్యానికి పునాది వేస్తున్నామని ఈ సందర్భంగా ఆమె శాన్ ఫ్రాన్సిస్కోలో తెలిపారు.
జేడీ వాన్స్ కూడా
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన, వాణిజ్య మంత్రి రాకతో పాటు, అమెరికా ఉప-వాణిజ్య ప్రతినిధి భారత్లో సందర్శన సందర్భంగా ఈ ఒప్పందంపై చర్చలు ముందుకు సాగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. త్వరలో మోదీని కలవనున్నారు.
Read Also: Poxiao: బియ్యపు గింజత హార్డ్ డ్రైవ్..రెప్పపాటులో డేటా ట్రాన్స్ ..
టారిఫ్ సవాళ్లు, అవకాశాలు
ఈ ఏడాది ఏప్రిల్లో అమెరికా, భారత ఎగుమతులపై 26% రిసిప్రొకల్ టారిఫ్ విధించింది. దీని కారణంగా భారత్- అమెరికా వస్తువులపై విధించే సగటు 52% దిగుమతి సుంకమని చెప్పారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ ప్లాన్లో భాగంగా ఈ సుంకాల అమలును 90 రోజులపాటు (జూలై 9 వరకు) నిలిపివేశారు, ఇది ఒప్పంద చర్చలకు సమయాన్ని ఇచ్చింది.
భారత ఆర్థిక వృద్ధి బలంగా
సీతారామన్ భారత ఆర్థిక వృద్ధిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోవిడ్ సంక్షోభం తర్వాత 2021లో రూపొందించిన ఆర్థిక లోటు తగ్గింపు ప్రణాళిక ప్రకారం, 2026 నాటికి లోటును 4.5% కంటే తగ్గించే లక్ష్యాన్ని భారత్ నిరంతరం కొనసాగిస్తుందన్నారు. అలాగే, మహమ్మారి సమయంలో 62%కి చేరిన రుణం-జీడీపీ నిష్పత్తిని నాలుగేళ్లలో 57.4%కి తగ్గించినట్లు ఆమె తెలిపారు. “2030 నాటికి ఈ నిష్పత్తిని 50% స్థాయికి చేర్చేందుకు స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఆర్థిక లోటు
భారతదేశం తన ప్రభుత్వ రుణాన్ని మెరుగ్గా నిర్వహిస్తోందని, కాబట్టి ద్రవ్య లోటు అదుపు తప్పుతుందనే ప్రశ్న తలెత్తదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక లోటు అదుపు తప్పే ప్రశ్నే లేదన్నారు. ఇచ్చిన లక్ష్యాన్ని నిజాయితీతో అనుసరిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం సవరించిన అంచనాలలో (FY25 కి) మేము GDPలో 4.8 శాతాన్ని తాకుతుందన్నారు.
ముందుకు సాగుతున్న భారత్
భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎలా ఎదగగలదని, సెమీకండక్టర్లు, న్యూక్లియర్ పవర్ సహా పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ వంటి కీలక రంగాలలో భారతదేశం పురోగతిని సాధిస్తుందని ఆర్థిక మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ఆర్థిక సంస్కరణలతో కూడిన భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత శక్తివంతంగా నిలబెడుతోందన్నారు. ఈ ఒప్పందం కుదిరితే, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు కొత్త స్థాయికి చేరడం ఖాయమని నిర్మలా సీతారామన్ అన్నారు.