Indian aviation fuel crisis: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత్ లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. ఎల్పీజీ కొరతతో జనాలు బెంబెలెత్తిపోయారు. ఆ తరువాత పెట్రోల్, డిజిల్ కొరతతో బంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఆ ప్రభావం విమానయాన రంగంపై పడింది. ఆకాశాన్ని తాకుతున్న విమాన ఇంధన (ATF) ధరల ధాటికి విమానయాన సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలంటూ ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్ వంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (FIA) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విమాన కార్యకలాపాలు సాధారణంగా కొనసాగాలంటే ప్రభుత్వ మద్దతు తప్పనిసరని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో విమాన ఇంధన ధరలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కొన్ని విభాగాలలో కిలోలీటరు ఏటీఎఫ్ ధర ఏకంగా రూ. 2 లక్షల మార్కును దాటడం గమనార్హం. దేశీయ విమానయాన సంస్థలకు ఇంధన ధరలు 8.5 శాతం పెరగ్గా నాన్-షెడ్యూల్డ్, చార్టర్డ్, అడ్-హాక్ ఆపరేటర్లకు ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నమోదైన రికార్డులను కూడా ఈ ధరలు అధిగమించడం విమానయాన రంగాన్ని ఆందోళనలో నెట్టేసింది.
అస్థిరంగా మారుతున్న ఇంధన ధరల వల్ల దేశీయ అంతర్జాతీయ సర్వీసుల నిర్వహణ కష్టతరమవుతోందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంధన వ్యయాలు పెరగడం వల్ల సంస్థలపై పెను ఆర్థిక భారం పడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రయాణికులపై అదనపు చార్జీల భారం పడే అవకాశం ఉంది. యుద్ధ మేఘాల వల్ల ఏర్పడిన ఈ అనిశ్చితిని ఎదుర్కోవడానికి పన్ను రాయితీలు లేదా ఇతర ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలని విమానయాన సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే ఇంధనం కొరతతో వాహాన రంగం కుదేలవుతోంది. ఇప్పుడు విమానయాన రంగం కుప్పకూలకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Also: Amaravati: ఏపీ ఇంధన సంక్షోభం.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల