హైదరాబాద్లోని సీఎల్పీ మీడియా సెంటర్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో గత పదేళ్ల పాలన అత్యంత నియంతృత్వంగా సాగిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఒక కర్కోటకుడు అలాగే హిట్లర్ తరహాలో వ్యవహరించారని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో తమ పదేళ్ల అవినీతిపై కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సొంత కుటుంబ సభ్యులే ఎండగడుతున్నారని పేర్కొన్నారు. సారు రారు కారు రాదు అని కవిత అన్న మాటలకు కేసీఆర్ దగ్గర సమాధానం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు బీఆర్ఎస్ వరంగల్ సభ పెట్టుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వరంగల్ వేదికగా రైతు సభ పెట్టడానికి బీఆర్ఎస్కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో గత రెండున్నర ఏళ్లుగా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన 28 నెలల్లోనే రైతుల కోసం రూ. 1,52,656 కోట్లు ఖర్చు చేశామని గణాంకాలతో వివరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేవలం రూ. 2,88,670 కోట్లు మాత్రమే వెచ్చించిందని గుర్తు చేశారు. నెలకు సగటున కేసీఆర్ హయాంలో రైతులకు రూ. 2532 కోట్లు ఖర్చయితే ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో రూ. 5452 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ హయాంలో అప్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైనా తాము రైతు భరోసా నిధులను సకాలంలో జమ చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని ఆది శ్రీనివాస్ వివరించారు. మొత్తం 8525 కేంద్రాల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటికే 6005 కేంద్రాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. 7.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 277 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. గతంలో తాలు పేరుతో కిలోల కొద్దీ ధాన్యం కోత విధించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం రెండు రోజుల్లోనే నగదు చెల్లింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలుగా చేసి రైతులను వడ్డీల ఊబిలో నెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం 25 లక్షల మందికి పైగా రైతులకు ఏకకాలంలో రూ. 20,616 కోట్ల రుణమాఫీ చేసి ఆదుకుందని తెలిపారు.
తెలంగాణ వరి సాగులో పంజాబ్ను మించి రికార్డు సృష్టించిందని ఆది శ్రీనివాస్ ప్రకటించారు. వానాకాలం సీజన్లో 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. దీనివల్ల రైతులకు ఎకరానికి రూ. 12 వేల అదనపు ఆదాయం అందుతోందని చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ. 10,444 కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీలకు అవకాశం లేదని అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూరియా కొరతకు కేంద్రమే కారణమని తెలిసినా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: సంగారెడ్డి జైల్లో క్రిశాంక్ను పరామర్శించిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు