Kota: ఇండియా కోచింగ్ కేపిటల్ కోటాకు ఏమైంది? సంక్షోభంలో కొట్టుమిట్టాడు తోందా? ఖాళీగా హాస్టల్స్ దర్శనమిస్తున్నాయా? మార్కెట్ కూడళ్లు వెలవెల బోతున్నాయా? ఈ పరిస్థితికి కారణమెవరు? కోచింగ్ సెంటర్ల నిర్వాహకులా? అవుననే అంటున్నారు అక్కడి చిన్న చిన్న వ్యాపారులు. అసలు కోటా ఏం జరిగింది? జరుగుతోంది?
దేశంలో ఐఐటీ, నీట్, యూపీఎస్సీ పరీక్షల కోచింగ్ సెంటర్కు కేరాఫ్ రాజస్థాన్లోని కోటా సిటీ. అక్కడ కోచింగ్ తీసుకుంటే పిల్లాడి జీవితం చూసుకోవాల్సి అవసరం లేదన్నది పేరెంట్స్ ఆలోచన. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోటాకు విద్యార్థులను పంపేవారు. దీన్ని ఆధారంగా అక్కడ చిన్నచిన్న వ్యాపారాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లేవి.
ఇదంతా గతం.. ప్రస్తుతానికి వద్దాం. కోటా ప్రాంతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు స్టూడెంట్స్ కళకళలాడే ఆ ప్రాంతం, విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ఈ పరిస్థితికి కారణమెవరు? అక్కడున్న కోచింగ్ నిర్వాహకులు వేరొక రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్లో కోచింగ్లకు అమీర్ పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాలు అడ్డాగా ఉండేవి. కోచింగులకు రాజస్థాన్లోని కోటా అంత ఫేమస్. ప్రతీ ఏటా 2 లక్షల మంది విద్యార్థులు అక్కడికి కోచింగులకు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 85 వేలకు పడిపోయినట్టు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
ALSO READ: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
ప్రస్తుతం కోటాలో కోచింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. ఖాళీగా క్లాస్ రూములు, హాస్టల్స్ దర్శనమిస్తున్నాయి. దీనంతటికీ నెగిటివ్ పబ్లి సిటీ కారణమని అంటున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. కోచింగ్ లకు వచ్చిన స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడడం ప్రధాన కారణం. దీనివల్ల విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది.
కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల ఆంక్షలు, పేరెంట్స్ సమస్యలు ఇవన్నీ కలిసి విద్యార్థులపై ప్రభావం చూపాయి. 2017లో 7 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018 లో 20 మంది, 2019లో 18 మంది మరణించారు. 2020, 2021 కరోనా లాక్ డౌన్ ప్రభావం చూపింది. 2022లో 15 మంది, 2023లో 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారంటే అక్కడ పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు.
ఇది ఒక కోణం మాత్రమే. మరోవైపు వద్దాం. టెక్నాలజీ పుణ్యమాని ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు కుప్పలుగా వెలుస్తున్నాయి. పోటీ నేపథ్యంలో తక్కువే కోచింగ్ లభిస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అటువైపు మొగ్గు చూపడంతో కోటాపై దాని ప్రభావం పడిందని చెబుతున్నారు.
కోచింగ్ సెంటర్లు వల్ల ఏడాదికి 7 నుంచి 10 వేల కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం 3500 కోట్లకు పడిపోయింది. హాస్టల్ ఓనర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఆక్యువెన్సీ రేటు 40 శాతానికి పడిపోయింది. ఒకప్పుడు రూమ్ అద్దె నెలకు 15 వేలు ఉండేది. ప్రస్తుతానికి 9 వేలకు పడిపోయింది.
కోచింగ్ సెంటర్ల ప్రభావం అక్కడి చిన్నిచిన్న వ్యాపారాలపై తీవ్రంగా పడింది. ఒకప్పుడు హోటళ్లు, ఫుడ్ డెలివరీ, స్టేషనరీ షాపులు, ఆటోలు బిజీగా ఉండేవి. ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కోటా కోచింగ్ సెంటర్ల ప్రభావం ఆయా వ్యాపారాలపై పడ్డాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి తేరుకోవాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుంటే పరిస్థితులు చక్కబడవని అంటున్నారు స్థానిక వ్యాపారులు.