Old Currency Notes: గత కొన్ని రోజులుగా పాత కరెన్సీ నోట్ల రద్దుకు సంబంధించి ఒక వార్త నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తోంది. జులై 1 నుంచి పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవని.. ప్రభుత్వం వాటిని రద్దు చేయబోతోందని ప్రచారం చేస్తున్నారు. దీంతో పలువురు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఈ వార్త చూసి గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? ప్రభుత్వం దీనిపై ఏం చెప్పింది? అసలు నిజానిజాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నోట్ల రద్దు ప్రచారానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక నోటీసు. ‘బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర’ లోగోతో ఉన్న ఆ పోస్టర్.. వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతోంది. ఆర్బీఐ (RBI) ఆదేశాల ప్రకారం.. 2005 కంటే ముందు ముద్రించిన పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను జులై 1 నుంచి బ్యాంకులు అంగీకరించవని జూన్ 30 లోపే వాటిని మార్చుకోవాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో దేశంలో మరోసారి నోట్ల రద్దు జరగబోతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ల రద్దు ప్రచారం తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ నోటీసు పూర్తిగా నకిలీదని (Fake) అని పీఐబీ స్పష్టం చేసింది. ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ప్రజలు.. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని పీఐబీ విజ్ఞప్తి చేసింది.
🚨 खोट्या बातम्यांना बळी पडू नका!
बँक ऑफ महाराष्ट्रच्या नावाने एक बनावट सूचना सोशल मीडियावर पसरवली जात आहे. त्यामध्ये असा खोटा दावा करण्यात आला आहे की, आरबीआय च्या निर्देशानुसार 2005 पूर्वी छापलेल्या ₹10, ₹20, ₹50 आणि ₹100 च्या नोटा 1 जुलै 2026 पासून स्वीकारल्या जाणार नाहीत.… pic.twitter.com/F95HMcR4lJ
— PIB in Maharashtra 🇮🇳 (@PIBMumbai) June 27, 2026
మరోవైపు తమ బ్యాంక్ పేరుతో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై ‘బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర’ కూడా అధికారికంగా స్పందించింది. తాము అలాంటి ఎటువంటి సర్క్యులర్ లేదా నోటీసును జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్లో తిరుగుతున్న లెటర్ హెడ్, నోటీసు పూర్తిగా ఏఐతో సృష్టించిన కల్పిత పోస్టర్ అని కొట్టిపారేసింది. కాబట్టి ఖాతాదారులు, ప్రజలు ఇలాంటి భ్రమ కలిగించే మెసేజ్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంక్ యాజమాన్యం తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.
నిజానికి 2005 కంటే ముందు ముద్రించిన నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడానికి ఆర్బీఐ గతంలోనే (2014-15) ఒక ప్రక్రియను ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత భద్రతా ఫీచర్లు ఉన్న కొత్త నోట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి పాత నోట్లను బ్యాంకుల ద్వారా వెనక్కి తీసుకుంటోంది. అయితే పాత నోట్ల చట్టబద్ధమైన చెల్లుబాటును మాత్రం అలాగే కొనసాగిస్తూ వస్తోంది. అంటే మార్కెట్లో ఈ నోట్లు ఇప్పటికీ పూర్తిగా చెలామణీలో ఉన్నాయి. ఒకవేళ మీ వద్ద 2005 కంటే ముందు నాటి నోట్లు ఉంటే వాటిని ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. లేదంటే బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: ఫ్లిప్కార్ట్ GOAT సేల్.. ఆండ్రాయిడ్ ధరకే ఐఫోన్లు.. ఏకంగా రూ.22,000 తగ్గింపు!