TV Narendran: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి ఎన్. చంద్రశేఖరన్ తప్పుకున్నట్లు ప్రకటనతో ఆ సంస్థలో నాయకత్వం కోసం మరోసారి పోటీ నెలకొంది. టాటా సన్స్ పగ్గాలు ఎవరు తీసుకుంటారు? కార్పొరేట్ వర్గాల్లో ఇది పెద్ద ప్రశ్న. ఈ పదవి రేసులో టీవీ నరేంద్రన్ పేరు బలంగా వినిపిస్తోంది. టీవీ నరేంద్రన్ ఎవరు? ఒకవేళ ఛైర్మన్గా బాధ్యతలు చేపడితే ముందున్న సవాళ్లు ఏంటి?
టాటా స్టీల్ విభాగానికి ఎండీ-సీఈఓగా వ్యవహరిస్తున్నారు టీవీ నరేంద్రన్. ఆయన వయస్సు 61 ఏళ్లు. తదుపరి టాటా సన్స్ ఛైర్మన్గా ఆయన పేరు ప్రకటించనప్పటికీ, నరేంద్రన్కి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. 1965 జూన్ 2న తమిళనాడులో జన్మించిన నరేంద్రన్, తన స్వస్థలం తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- నిట్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐఎం కలకత్తా నుంచి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1988లో ఆయన టాటా గ్రూప్లో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆ గ్రూప్లో వివిధ రంగాల్లో పని చేశారు. మైనింగ్, మెటల్స్ పరిశ్రమలో 36 సంవత్సరాల అనుభవం ఉంది. సేల్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ విభాగాల్లో పని చేశారు. ఆగ్నేయాసియాలో టాటా స్టీల్ను విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర.
2013లో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న నరేంద్రన్, ఆ తర్వాత సీఈఓగా నియమితులయ్యారు. టాటా స్టీల్ యూరప్ ఛైర్మన్గా ఉన్నారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వైస్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. టాటా స్టీల్ గ్లోబల్ సీఈఓగా నరేంద్రన్ కొన్ని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల నుండి కంపెనీని నడిపించారు. 2017లో బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ విభాగంలో అధిక అప్పులు, అస్థిరమైన ఉక్కు మార్కెట్లు, అంతర్జాతీయ కార్యకలాపాలకు సంబంధించిన సవాళ్లతో సతమతమయ్యేది. ఆయన బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఆ సవాళ్లను ఎదుర్కొన్నారు.
చీఫ్గా బాధ్యతలు చేపట్టిన రెండు వారాలకు ఉక్కు కర్మాగారంలో గ్యాస్ హోల్డర్ పేలిపోయిందన్న వార్త వచ్చింది. ఈ ఘటనలో ఒక్కరే మరణించినప్పటికీ, ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా మీడియాలో విస్తృతంగా ప్రసారమైంది. ఆయన నాయకత్వంలో టాటా స్టీల్ పుంజుకుంది. ఇవాళ దేశంలో రెండో అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా మారింది. బలమైన ఆదాయ వృద్ధి, మెరుగైన నిర్వహణ పని తీరు కారణంగా జూన్ త్రైమాసికంలో టాటా స్టీల్ నికర లాభం దాదాపు 12 శాతం పెరిగినట్లు నివేదించింది. అంతేకాదు టీవీ నరేంద్రన్, నోయెల్ టాటాకు సన్నిహితుడిగా చెబుతున్నారు.
ప్రస్తుతం చంద్రశేఖరన్ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అప్పటిలోగా కొత్త ఛైర్మన్ను టాటా సన్స్ ఎంపిక చేయనుంది. వారసత్వ పోటీని ఎంపిక చేయడానికి తొందర పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు చంద్రశేఖరన్ ఆ పదవిలో కొనసాగుతారు. టాటా సన్స్కు ఆయన వారసుడిని సజావుగా బాధ్యతలు అప్పగించడానికి చాలా నెలల సమయం లభిస్తుంది. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్కు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎయిరిండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ రంగాలు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతేడాది ఎయిరిండియా నష్టాలు రూ.22,238 కోట్లకు చేరాయి. అందులో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన, పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, ఎయిర్లైన్పై తీవ్రంగా పడ్డాయి. వీటి నుంచి గట్టెక్కితే వారెవరైనా ఛైర్మన్గా దశాబ్దంపాటు ఉండడం ఖాయమని అంటున్నారు.
ALSO READ: శ్రావణ మాసం వేళ పసిడి ప్రియులకు ఊహించని షాక్