Corporate Stress: అధిక జీతం ఎంతటి నరకాన్ని చూపిస్తుందో వివరిస్తూ లింక్డ్ఇన్లో ఓ వ్యక్తి షేర్ చేసి పోస్ట్.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలకు రూ.12 లక్షల చొప్పున ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం సంతోషం లేకుండా ఓ ఉద్యోగి పడుతున్న బాధను కళ్లకు కట్టాడు.
సంపర్క్ సచ్దేవా అనే వ్యక్తి లింక్డ్ ఇన్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ప్రకారం.. సచ్ దేవా ఇటీవల ఒక కార్పొరేట్ దిగ్గజాన్ని కలిశారు. సదరు ఉద్యోగి వార్షిక ప్యాకేజీ రూ. 2 కోట్లు. అంటే నెలకు రూ. 11 నుండి 12 లక్షల వరకు చేతికి అందుతుంది. కానీ బయటకు ఎంతటి హోదా కనిపిస్తున్నా.. అతడు లోపల మాత్రం మానసికంగా నలిగిపోతున్నాడని సచ్దేవా తెలిపారు.
‘నేను ఆయన్ని కలిసిన ప్రతిసారీ చాలా విసిగిపోయినట్లు, కుంగిపోయినట్లు కనిపించేవారు. ఏడుపు ఆపుకోలేకపోతున్నాను. ఈ భారాన్ని ఇంకెంతకాలం మోయాలో నాకే తెలియడం లేదు’ అని అతడు బాధపడేవాడని సచ్ దేవా తెలిపారు. అది ఏదో ఊరికే అన్న మాట కాదని.. అతడి కళ్లలో ఆ అలసట, భయం స్పష్టంగా కనిపించేవని తన పోస్ట్లో పేర్కొన్నారు.
అంత భారీ జీతం తీసుకుంటున్న వ్యక్తి అంతలా ఎందుకు బాధపడుతున్నాడో ఆరంభంలో తనకు అర్థం కాలేదని సచ్దేవా అన్నారు. కానీ ఆ తర్వాతే అసలు నిజం బోధపడిందని పేర్కొన్నారు. అత్యున్నత పదవుల్లో ఉండే కొద్దీ మైండ్ గేమ్లు, క్లిష్టమైన నిర్ణయాలు, భారీ టార్గెట్స్, టీమ్ మేనేజ్మెంట్ వంటివి నరకాన్ని చూపిస్తాయని తెలియజేశారు. కాబట్టి ఏ కంపెనీ కూడా ఆ స్థాయి ప్యాకేజీని ఊరికే ఇవ్వదని.. దాని వెనుక నిద్రలేని రాత్రులు, ముళ్లబాట లాంటి బాధ్యతలు ఉంటాయని సచ్దేవా రాసుకొచ్చారు.
Also Read: నీట్ లీకేజీ కేసులో కదిలిన డొంక.. 360 మంది సాక్షులు, 20వేల పేజీలతో సీబీఐ ఛార్జ్షీట్!
ఈ పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మనశ్శాంతి లేని సంపాదన ఒక బంగారు పంజరం లాంటిది. పని మన జీవితంలో ఒక భాగం కావాలి తప్ప.. పనే మన జీవితం కాకూడదు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ ‘అసలు సమస్య డబ్బుతో కాదు. సమాజం, కుటుంబం, తోటివారితో పోల్చుకోవడంలోనే ఉంది. ఒకరికంటే ఒకరు ఎక్కువ సంపాదించాలనే రేసులో పడి ప్రశాంతతను కోల్పోతున్నారు. తృప్తి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం’ అని రాసుకొచ్చారు.
Also Read: రియల్మీ కొత్త ఫోన్ వచ్చిందోచ్.. ఫీచర్లు చూస్తే పూనకాలే.. ధర కూడా తక్కువే!