NPS to Gig Workers: దేశంలో ఈ-కామర్స్ వ్యాపారం జోరందుకుంది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్, క్విక్ కామర్స్, బ్లింకిట్ వంటి వేదికల్లో పని చేస్తున్న గిగ్ కార్మికుల భవిష్యత్తుకు భరోసా వచ్చేసింది. అందులోని పని చేసే కార్మికులకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది పీఎఫ్ఆర్డీఏ. సాంప్రదాయ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ ప్రయోజనాలు లేని ఈ అసంఘటిత రంగాన్ని జాతీయ పింఛను విధానం- ఎన్పీఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ- పీఎఫ్ఆర్డీఏ బుధవారం వెల్లడించింది.
అందుకోసం ఈ-శ్రామిక్ నమూనాను ప్రచారం చేస్తోంది. గిగ్ కార్మికుల నెలవారీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకున్న కార్మికుల పింఛన్ మోడల్ను సులభతరంగా తీర్చిదిద్దింది. కేవలం రూ.99 వంటి నామమాత్రపు రుసుం పొదుపు ప్రారంభించవచ్చు. గిగ్ వర్కర్ల కోసం రూపొందించిన ఎన్పీఎస్ విధానంలో కనీస లేదా గరిష్ఠ పరిమితుల నిబంధనలు లేవు. తమ వెసులుబాటును బట్టి పొదుపు చేసుకోవచ్చు. పొదుపు మొత్తాన్ని కార్మికుడు ఒక్కడే చెల్లించాలి. లేకుంటే అగ్రిగేటర్ సంస్థ భరించవచ్చు. అంతేకాదు ఇద్దరూ కలిసి సంయుక్తంగా జమ చేసే సౌకర్యం కల్పించింది.
అగ్రిగేటర్లతో అనుబంధం ఉన్న పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్-పీఓపీల ద్వారా నమోదు ప్రక్రియ మొదలవుతుంది. ఆధార్ ఆధారిత కేవైసీ, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పిస్తే చాలు. కార్మికుడికి శాశ్వత రిటైర్మెంట్ ఖాతా సంఖ్యను కేటాయిస్తారు. ఈ వ్యవస్థలో పోర్టబిలిటీ కూడా ఉంటుంది. కార్మికుడు ఒక సర్వీస్ మరొక దానికి మారినప్పుడు అతడి పెన్షన్ ఖాతా యథాతథంగా కంటిన్యూ అవుతుంది. దేశీయ శ్రామిక శక్తిలో వేగంగా పెరుగుతున్న తరుణంలో గిగ్ కార్మికులను అధికారిక సామాజిక భద్రతా వలయంలోకి చేర్చడానికి ఇదొక విప్లవాత్మక అడుగు. ఎన్పీఎస్ రాబడులు మార్కెట్ పని తీరుపై ఆధారపడి ఉంటాయని సమాచారం. కార్మికులకు స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల విరాళాలు సేకరించడం ప్రధాన సవాలు.
ALSO READ: శ్రావణం-పెళ్లిళ్ల సీజన్.. పసిడి ప్రియులకు షాక్