Pani Puri seller : వీధి చివరిన పానీపూరి బండి చూస్తే చాలు ఆడపిల్లలు పరుగు పెడుతారు. ఇష్టంగా పానీపూరి లాగించేస్తుంటారు. మనకి ఇష్టమున్నాా, లేకున్నా.. చాలా సార్లు వెళ్లాల్సి వస్తుంటుంది. మరి ఎప్పుడైనా పానీపూరి బండి వాళ్ల సంపాదన ఎంత ఉండొచ్చో ఊహించారా.? ‘హా.. ఏదో రోజు కూలీ వరకు వస్తాయిలే’ అని తెలికగా ఆలోచిస్తున్నారా.? అయితే.. ఈ వార్త మీరు కచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్న మీకు ప్రభుత్వం ఎప్పుడైనా నోటీసులు పంపిందో లేదో కానీ.. ఓ పానీపూరి బండి నడిపే వ్యక్తికి మాత్రం జీఎస్టీ నోటీసులు పంపించింది. ఏంటి నమ్మడం లేదా.? ఏదో పొరబాటు జరిగిందనుకుంటున్నారా.? అలాంటి సందేహాలు అవసరం లేదు. జీఎస్టీ అధికారులు.. సదరు పానీపూరి బండి వ్యాపారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బుల లెక్కలతో సహా.. వివరాలు పంపించి, జీఎస్టీ కట్టాల్సిందే అని తేల్చారు. మరి… ఇంతకీ ఇతని సంపాదన ఎంత అనుకుంటున్నారు…
పానీపూరి అమ్ముకునే వ్యక్తికి నోటీసులు చూసి అంతా ఫేక్ అనుకున్నారు. కానీ.. అందులోని వివరాల్ని చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే.. గత మూడేళ్లుగా ఆ వ్యాపారి జరిపిన అన్ని లావాదేవీలను అందులో పొందుపరిచారు. ఈ వివరాలన్నీ.. జీఎస్టీ అధికారులకు ఎక్కడివి అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం.. కొన్నాళ్లుగా దేశంలో ఆన్ లైన్ లావాదేవీలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందేగా.. ఎక్కడ పది రూపాయలు ఇవ్వాల్సి వచ్చినా, ఫోన్ తీయడం.. ఏదో ఓ యాప్ నుంచి పంపించేయడం. అదిగో.. అలా రోజర్ పే, ఫోన్ పే వంటి యాప్ ల ద్వారా ఈ వ్యక్తికి వచ్చిన డబ్బుల లెక్క అన్నమాట. సదరు యాప్ లు.. భారీగా ట్రాన్సాక్షన్లు చేస్తూ, ఆదాయాన్ని పొందుతున్న వారి వివరాల్ని జీఎస్టీ అధికారులకు సమర్పించగా.. అందులోని అమౌంట్ చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే.. అందులో 2023-24 ఏడాదిలో ఈ పానీపూరి అమ్మే వ్యక్తి ఖాతాలో ఏకంగా రూ.40 లక్షలు జమయ్యాయని తేలింది. హా.. ఇది చదువుతున్నప్పుడు మీకు పానీపూరి బండి పెట్టుకోవాలనిపిస్తుందా.. చాలా మందికి అదే ఆలోచన వస్తుంది మరి. చాలా మందికి ఏళ్లు తరబడి జీతాలు చేస్తున్నా రాని సంపాదన అది. అందుకే.. ఈ నోటీసులపై సోషల్ మీడియాలో తీరొక్క కామెంట్లు చేస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్లు చేస్తుంటే, మరికొందరు.. తమ ఉద్యోగాలు, జీతాలతో పోల్చుకుంటూ పానీపూరి వ్యక్తి ఆదాయమే బాగుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
తమిళనాడు వస్తు, సేవా పన్ను చట్టం.. సెంట్రల్ జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 70 నిబంధనల ప్రకారం గత నెల 17న ఈ సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యక్తిగత ఆదాయానికి సంబంధించిన ఆధారాల్ని విక్రేత వ్యక్తిగతంగా హాజరై సమర్పించాలని అందులో జీఎస్టీ అధికారులు కోరారు. ఇందులోనే.. పరిమితి దాటిన తర్వాత కూడా జీఎస్టీ కింద నమోదు చేసుకోకుండా ఈ స్థాయిలో విక్రయాలు, సేవలు అందించడం నేరమంటూ పేర్కొన్నారు.
ఈ నోటిసులు సోషళ్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. దీనిపై ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్ సైతం స్పందించారు. వచ్చే జీతాలపై పన్నులు చెల్లిస్తున్న ఎంతో మంది ఉద్యోగులు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల కంటే ఈ ఆదాయం చాలా ఎక్కువ అని కామెంట్ చేయగా.. కాగా ఇంకొక యూజర్ స్పందిస్తూ.. ఇకపై పానీపూరి బిల్లుపై జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి కట్టేయమని సలహా ఇచ్చేశారు. అలా చేస్తే.. ధరలు పెరిగి వ్యాపారం దెబ్బతింటుందని.. అందుకే ఇకపై ఆన్ లైన్ కాకుండా నేరుగా డబ్బులు తీసుకోవడం మంచిదంటూ మరొక యూజర్ ఉచిత సలహా ఇచ్చారు.
Also Read : బంగారం అమ్ముకుంటున్నారా? వద్దే వద్దు.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఈ నోటీసులపై చాలా మంది యూజర్లు సానుకూలంగానే స్పందిస్తున్నారు. అతను ఆదాయం ఆ స్థాయిలో ఉన్నప్పుడు జీఎస్టీ కట్టడంలో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు. అతను తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిదని అంటున్నారు. ఇలానే మిగతా వ్యాపారులకు ఆదాయాన్ని బట్టి జీఎస్టీ విధించాల్సిందే అని అంటున్నారు. ఉద్యోగస్తుల కంటే ఎక్కువ సంపాదిస్తూ సైతం జీఎస్టీ కట్టకుండా ఉండడం నేరమంటున్నారు.