Hostels : పేయింగ్ గెస్ట్ హాస్టల్స్. నగరాల్లో పీజీల బిజినెస్ది ఫుల్ హవా. ఓ బిల్డింగ్ మొత్తాన్ని లీజ్కు తీసేసుకుంటారు. అందులో ఇరుకిరుకు రూమ్లు కట్టేస్తారు. అందులో నడిచేందుకు కూడా వీలు లేకుండా బెడ్స్తో నింపేస్తారు. అందులోనే వాష్ రూమ్ కూడా అడ్జస్ట్ చేసేస్తారు. షేరింగ్ను బట్టి మనిషికి రూ.6వేల నుంచి రూ.12 వేల వరకు వసూల్ చేస్తారు. ఏసీ గట్రా వసతులు పెరిగితే రుసుము మరింత పెరిగిపోతుంది. సింగిల్, డబుల్ షేరింగ్స్ మరింత కాస్ట్లీ ఉంటుంది. సమ్మర్లో దాదాపు అన్ని హాస్టల్స్లోనూ వాటర్ ప్రాబ్లమ్ మస్ట్. ఇక ఫుడ్ అయితే ఇంటి భోజనంలా అస్సలు ఉండదు. తింటే తినాలి. లేదంటే హోటల్స్, కర్రీ పాయింట్స్ ఉండనే ఉన్నాయి. అందుకే, జిల్లాల స్థాయి నుంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ వరకు.. పీజీ హాస్టల్స్ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఓనర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే.. మారిన పరిస్థితులతో బెంగళూరులో పీజీస్ పరిస్థితి అసలేమాత్రం బాగా లేదంటున్నారు. లేటెస్ట్గా దాదాపు 300 వరకు హాస్టల్స్ మూతపడ్డాయి. నష్టాలే అందుకు కారణం. ఇంతకీ, ఇంత మంచి బిజినెస్లో ఎందుకు లాసెస్ వస్తున్నట్టు? బెంగళూరులో అసలేం జరుగుతోంది?
బెంగళూరు హాస్టళ్ల బెంగ..
హైదరాబాద్ కంటే బెంగళూరు నగరం సాఫ్ట్వేర్ కంపెనీల్లో చాలా ముందుంటుంది. మనకంటే అక్కడే టెక్కీల సంఖ్య ఎక్కువే. మినీ ఇండియాలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. అందుకు తగ్గట్టే హాస్టళ్లు కూడా వేలల్లోనే ఉన్నాయి. సుమారు 2,500 పీజీలు అధికారికంగా సర్టిఫై చేయబడితే.. అనుమతులు లేకుండా నడిచేవి 12వేల వరకూ ఉంటాయని అంచనా. అంతా దండిగా డబ్బులు సంపాదించే వాళ్లు. అయితే, ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. ఇటీవల బెంగళూరు కార్పొరేషన్ రూల్స్ స్ట్రిక్ట్ చేసింది. గతేడాది, BBMP చట్టం, 2020లోని సెక్షన్ 305 ప్రకారం పేయింగ్ గెస్ట్ వసతి కోసం BBMP కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
ఖతర్నాక్ రూల్స్..
కొత్త రూల్స్ ప్రకారం.. హాస్టల్స్లో సీసీ కెమెరాలు మస్ట్. ప్రతీ వ్యక్తికి కనీసం 70 చదరపు అడుగుల స్థలం ఉండాలి. కనీసం 135 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలి. కిచెన్ ఉంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. బహుళ అంతస్తుల భవనాలు అయితే ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండాల్సిందే. ఈ రూల్స్ అన్నీ పాటిస్తే.. తమకు నష్టాలే మిగులుతాయని హాస్టల్స్ యజమానులు లైట్ తీసుకున్నారు. అయితే అధికారులు మాత్రం వదిలిపెట్టలేదు. నిబంధనలను ఉల్లంఘించారంటూ.. గత ఏప్రిల్లో బెంగళూరు కార్పొరేషన్ అధికారులు సుమారు 100 పేయింగ్ గెస్ట్ వసతి గృహాల వంటశాలలను మూసివేసారు. దెబ్బకు అంతా ఉలిక్కిపడ్డారు.
ఖర్చులు పెరిగి.. లాభాలు తగ్గి..
ఇప్పటికే నీటి సరఫరాకు కమర్షియల్ వాటర్ బిల్లులు వేస్తున్నారని, కరెంట్కు కూడా వాణిజ్య రేట్లు వసూలు చేస్తున్నారని.. ఇంటి అద్దెలు సైతం భారీగా పెరిగాయని.. ఇప్పుడీ రూల్స్ కూడా పాటిస్తే తాము చాలా నష్ట పోతామని అంటున్నారు హాస్టల్ ఓనర్స్. అందుకే, పీజీలను నడపడం కంటే మూసేయడం బెటరంటున్నారు. ఖర్చులు పెరిగాయి కదాని.. రెంట్ పెంచితే చేరే వాళ్లు లేక బెడ్స్ ఖాళీగా ఉంటున్నాయని అంటున్నారు. ఫలితంగా.. బెంగళూరులో ఇప్పటికే 300 వరకు హాస్టల్స్ క్లోజ్ చేశారు.