Telangana Voter List: ఓటు బ్యాంకులే ఊపిరిగా సాగే రాజకీయాల్లో.. ఇప్పుడు ఓటర్ల జాబితానే పార్టీలకు అతిపెద్ద రాజకీయ సవాల్గా మారింది. సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ తర్వాత వెలువడిన గణాంకాలు నేతలను నిద్రపోనివ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షల 95 వేల మందికి పైగా ఓటర్ల పేర్లు అన్కలెక్టబుల్గా తేలాయి. గెలుపోటములను శాసించే స్థాయిలో ఓట్లు మాయమవ్వడంతో గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు, బీజేపీ ఆఫీస్ నుంచి ఎంఐఎం పార్టీ ఆఫీస్ వరకు అత్యవసర సమీక్షల పరంపర మొదలైంది. ప్రధాన పార్టీలు తమ బూత్ స్థాయి లెక్కల్లో మునిగిపోయాయి. ఏ ప్రాంతంలో ఏ వర్గం ఓటర్లు తగ్గారు.? ఏ నియోజకవర్గంలో తమ ఓటు బ్యాంకు బలంపై దెబ్బ పడిందంటూ అంతర్గత సమీక్షలు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా 50 వేలకు పైగా ఓట్లు గల్లంతు కావడంతో అభ్యర్థులకు కొత్త భయం పట్టుకుంది.
19 లక్షల ఓటర్ల పేర్లు మాయం..
ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 19లక్షల ఓటర్ల పేర్లు హుష్కాకి అయ్యాయి. ఈ పరిణామం రాబోయే GHMC కార్పొరేషన్ ఎన్నికల స్వరూపాన్నే మార్చబోతోంది. ఒక్కో బూత్లో వందల ఓట్లు.. ఒక్కో డివిజన్లో వేల ఓట్లు మిస్ అయ్యాయి. నిన్నటివరకు సేఫ్ అనుకున్న స్థానాలు ఇప్పుడు డేంజర్ జోన్ లోకి జారుకున్నాయి. బలహీనంగా ఉన్న చోట కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు గల్లంతైన నిజమైన ఓటర్లను గుర్తించి, క్లెయిమ్ ఫారాల ద్వారా వారిని మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్పించేందుకు పార్టీలు తమ బూత్ స్థాయి యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. రాజకీయ పార్టీల భవిష్యత్తును తిరగరాసే ఈ 73 లక్షల ఓట్ల సర్జరీ… రాబోయే పోరులో ఎవరికి వరంగా మారనుంది. ఎవరి పదవులకు గండం కానుంది ?