Rising sugar prices in India| వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. పండుగలు వస్తున్నాయంటే మిఠాయిలు, చాక్లెట్లు, బిస్కెట్లు కొనడం సాధారణమే. అయితే, ఈసారి పండుగ సీజన్లో వినియోగదారులకు ధరల షాక్ తగిలే అవకాశం ఉంది. దేశంలో చక్కెర ధరలు పెరగడంతో ఆహార తయారీ కంపెనీలపై ఖర్చుల భారం పెరుగుతోంది. దీంతో కొన్ని కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచడం లేదా ప్యాక్ పరిమాణాలను తగ్గించడం గురించి ఆలోచిస్తున్నాయి.
అంటే, వినియోగదారులు అదే ధరకు తక్కువ పరిమాణంలో ఉత్పత్తిని పొందే పరిస్థితి రావచ్చు. మిఠాయిల నుంచి బిస్కెట్లు, చాక్లెట్ల వరకు అనేక ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుంది.
గత కొన్ని నెలలుగా దేశంలో చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్లో కిలో చక్కెర సగటు రిటైల్ ధర సుమారు రూ.62కు చేరింది.
జూన్లో ఈ ధర సుమారు రూ.47గా ఉంది. అంటే, కొద్ది నెలల్లోనే చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. జూలై 20న కిలో చక్కెర సగటు ధర రూ.48.18గా ఉంది. ఆగస్టు 20 నాటికి అది రూ.55.70కు చేరింది. ఇటీవల ధరలు కొంత తగ్గినప్పటికీ, కంపెనీల కొనుగోలు ఖర్చులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి.
దేశంలో చక్కెర సరఫరా తగ్గడం ప్రధాన కారణాల్లో ఒకటి. 2025-26 సీజన్లో చక్కెర ఉత్పత్తి అంచనాలు తగ్గాయి. మొదట 34.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనా సుమారు 30.6 మిలియన్ టన్నులకు తగ్గింది. అధిక వర్షాలు, పంటలకు వచ్చే వ్యాధులు, ఇతర సమస్యలు చెరకు ఉత్పత్తిని ప్రభావితం చేశాయి. పైగా ప్రభుత్వం భారీ స్థాయిలో ఇథనాల్ తయారీ కోసం చెరకు వినియోగిస్తోంది. మరోవైపు, పండుగల ముందు చక్కెర డిమాండ్ సహజంగానే పెరుగుతుంది. ఇళ్లతో పాటు స్వీట్ షాపులు, ఫుడ్ కంపెనీలు ఎక్కువగా చక్కెర కొనుగోలు చేస్తాయి. సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో ధరలపై ఒత్తిడి పెరిగింది.
చక్కెర ధరలు పెరిగినప్పుడు కంపెనీలకు అనేక మార్గాలు ఉంటాయి. అవి అదనపు ఖర్చులను భరించవచ్చు లేదా ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది. మరో మార్గం ప్యాకెట్లోని ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం. కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరల సర్దుబాట్లు ప్రారంభించాయి. బికాజీ ఫుడ్స్ తన స్వీట్స్ పోర్ట్ఫోలియోలో సుమారు 2 శాతం ధరల పెంపును ప్రారంభించినట్లు సమాచారం. బిస్కెట్లు, చాక్లెట్లు, ఇతర స్వీట్ ఉత్పత్తులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది.
ధరలు పెంచకుండా ప్యాక్ పరిమాణాన్ని తగ్గించడాన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారు. ఉదాహరణకు.. కంపెనీ అదే పాత ధరకు బిస్కెట్ పెద్ద ప్యాకెట్ బదులు దాని సైజ్ తగ్గించి చిన్న బిస్కెట్ ప్యాకెట్ విక్రయిస్తుంది. ఈ పద్ధతి ద్వారా కంపెనీలు ధరలను పెద్దగా పెంచకుండా ఖర్చులను నియంత్రిస్తాయి. అయితే, అన్ని కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయని చెప్పలేం.
Also Read: ఇంట్లో చేసిన టీ రుచికరంగా లేదా? ఎక్కువ మసాలాలు లేకుండా కడక్ చాయ్ చేయడానికి సింపుల్ టిప్స్
చక్కెర సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. పండుగల ముందు దేశీయ సరఫరాను పెంచేందుకు డ్యూటీ ఫ్రీ ముడి చక్కెర దిగుమతులను అనుమతించింది. అలాగే, నిల్వలు చేసి ధరలను పెంచకుండా స్టాక్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ చర్యల వల్ల ఇటీవల ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తోంది.
చక్కెర ధరలు ఎక్కువకాలం ఇలాగే పెరిగి ఉంటే పండుగల ఉత్పత్తుల ధరలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. వినియోగదారులు అదే ధరకు చిన్న ప్యాక్లు కూడా చూడవచ్చు. పండుగ సీజన్లో చక్కెర సరఫరా, ధరల పరిస్థితి కీలకంగా మారనుంది.
Also Read: వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్