Budget 2025 Smartphone Jewellery | కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రకటించింది. ఈ నిర్ణయంతో స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను సమర్పిస్తూ.. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, దిగుమతి పరికరాల ధరల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలను చేపడతామని వివరించారు.
ముఖ్యంగా, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీల (PCBA)పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 15 శాతానికి తగ్గించారు. ఈ చర్యలతో దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఫోన్ ఉపకరణాల ధరలను తగ్గే అవకాశం ఉంది. 2018లో స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఈ సుంకాన్ని 15% నుంచి 20 శాతానికి పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని తిరిగి తగ్గించింది. ఇది దిగుమతి స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగుగా పరిగణించబడుతోంది.
పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాలను స్వాగతించారు. మొబైల్ ఫోన్లు, పీసీబీఏ, ఛార్జర్లపై సుంకాల తగ్గింపు, స్మార్ట్ఫోన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలపై మినహాయింపులు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ బి పేర్కొన్నారు. ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్రా ఈ చర్యను సానుకూల దశగా ప్రశంసించారు.
ప్రభుత్వం సుంకాల తగ్గిస్తే అవి స్మార్ట్ ఫోన్, ఇతర ఎలెక్ట్రానిక్ కంపెనీలకు లాభం చేకూరుస్తుందనడంతో సందేహం లేదు. అయితే, సుంకాల తగ్గింపు వినియోగదారులకు ఎంత ప్రయోజనం చేకూరుస్తుందనేది సందేహాస్పదంగా ఉంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ స్మార్ట్ఫోన్ ధరలలో 1-2% మాత్రమే తగ్గుదల ఉంటుందని అంచనా వ్యక్తం చేశారు. తక్కువ ధర స్మార్ట్ఫోన్లపై ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉన్నందున, ధరలలో పెద్దగా గణనీయమైన తగ్గింపు కనిపించకపోవచ్చు.
Also Read: కొత్త బడ్జెట్లో మారిన ఇన్కం ట్యాక్స్ శ్లాబ్లు ఇవే.. రూ.12 లక్షల వరకు పన్ను లేదు!
బంగారు నగలపై సుంకాలు తగ్గింపు
బడ్జెట్ 2025లో ఆభరణాలపై కస్టమ్స్ సుంకాలను కూడా తగ్గించారు. విలువైన లోహాలు లేదా విలువైన లోహాలతో కప్పబడిన ఆభరణాలపై సుంకాన్ని 25% నుండి 20%కు తగ్గించారు. అదనంగా, ప్లాటినం ఆభరణాల తయారీలో ఉపయోగించే ప్రత్యేక వస్తువులపై సుంకాన్ని 25% నుండి 5%కు తగ్గించారు.
తగ్గిన ధరలతో ప్రజలకు లాభం చేకూరుతుందా
సుంకాల తగ్గింపు వల్ల ఆభరణాల ధర తగ్గుతుందని, వినియోగదారులకు అవి మరింత చౌకగా లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయ డిమాండ్కు ఊతం: ఆభరణాలు చౌకగా మారడంతో దేశీయంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
తయారీదారులకు లాభం: ప్లాటినం ఆభరణాల తయారీకి ఉపయోగించే వస్తువులపై సుంకాల తగ్గింపు వల్ల తయారీదారులకు ఖర్చులు తగ్గుతాయి.
ఈ ప్రకటన తర్వాత ఆభరణాల కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. సెంకో గోల్డ్, మోటిసన్స్ జ్యువెలర్స్, కళ్యాణ్ జువెలర్స్ వంటి కంపెనీలు తమ స్టాక్ ధరల్లో గణనీయమైన లాభాలను నమోదు చేశాయి. ప్రభుత్వం బడ్జెట్ లో సుంకాలు తగ్గించే ప్రకటన చేయడంతో రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు తప్పకుండా ప్రయోజనం చేకూరుతుంది.