ఈ ప్రపంచం ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తోంది. ముఖ్యంగా మన భారతీయులంతా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు బాగా అలవాటు పడిపోయారు. రీల్స్, షార్ట్స్ అంటూ.. చాలా బిజీగా గడిపేస్తున్నారు. కొందరు క్రియేటర్లుగా సంపాదనపై ఫోకస్ పెడితే.. మరికొందరు వారు చేసే చెత్తంతా చూస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కొందరు హత్యలు, అత్యచారాలకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అరాచాకాలకు చిరునామాగా మారుతోంది. తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలిస్తే.. పరిస్థితులు ఎంత దారుణంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు కుర్రాళ్లు.. 17 ఏళ్ల టీనేజర్ను దారుణంగా కొట్టి ప్రాణాలు తీశారు. అయితే, ఈ హత్య జరిగింది కేవలం ఒక రీల్ కింద చేసిన కామెంట్ గురించి. ఇంటర్ చదువుతున్న బాధితుడు.. త్రిలోక్పురిలోని ఇందిరా కాలనీలో నివసిస్తున్నాడు. ఇటీవల ఓ టీనేజర్ పోస్ట్ చేసిన రీల్ కింద ‘‘నువ్వు నా చిన్న తమ్ముడివి’’ అని కామెంట్ చేశాడు. అయితే, ఆ రీల్లో వీడియో ఏమిటీ? అతడు ఎందుకు అలా కామెంట్ చేశాడనేది తెలియరాలేదు. అయితే, రీల్ చేసిన వ్యక్తికి మాత్రం అతడి కామెంట్ డబుల్ మీనింగ్లా అనిపించి.. బాధితుడిపై దాడి చేశాడు.
Also Read: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరి పిల్లల్ని చంపి సూసైడ్కు పాల్పడ్డ తండ్రి
మొత్తం ఆరుగురు యువకులు బాధితుడిని చుట్టుముట్టి పిడిగుద్దులు కురిపిస్తూ.. కాళ్లతో తన్నారు. అతడి తలను బలంగా నేలకేసి కొట్టారు. బాధితుడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో.. స్థానికులు వెంటనే లాల్ బహదూర్ శాస్త్రీ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గురు తేగ్ బహదూర్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. అతడిపై దాడికి పాల్పడిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీల్స్ కింద చేసిన కామెంట్ తమకు నచ్చలేదని, అందుకే దాడి చేశామని నిందితులు తెలిపినట్లు సమాచారం.