AAP Leader Shot Dead: పంజాబ్లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు, సర్పంచ్ జర్మల్ సింగ్ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనపై దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులు జరిపారు.
సర్పంచ్ జర్మల్ సింగ్ ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లారు. వేడుక కోలాహలంగా సాగుతుండగా, అక్కడికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా జర్మల్ సింగ్పై కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి కాల్చడంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలరు. సింగ్ నుదిటిపై తూటా తగలడంతో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆకస్మిక దాడితో పెళ్లి వేడుకలో తీవ్ర భయభ్రాంతులు నెలకొన్నాయి. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
జర్మల్ సింగ్ను అంతమొందించడానికి గతంలోనూ ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. ఆయనపై ఇదివరకే పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయని, వాటి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారని స్థానికులు వెల్లడించారు. అయితే, ఈసారి దుండగులు పక్కాగా ప్లాన్ చేసి, రెక్కీ నిర్వహించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్య వెనుక రాజకీయ వైరం ఉందా? లేక పంజాబ్లో తరచుగా వినిపించే గ్యాంగ్స్టర్ల హస్తం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Read Also: కీసర జ్యువెలరీ షాపు దోపిడీ కేసు.. గొడ్డలితో దాడి చేసిన ఆ ఇద్దరు అరెస్ట్