Bus Accident: ప్రకాశం జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దలకట్ట-సానికవరం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కొరకు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఈ ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వైపు వెళుతోంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు మద్దలకట్ట-సానికవరం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో.. బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు వేగంగా వెళుతుండటంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయారని సమాచారం..
ప్రమాద సమయంలో ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ భయంకర దృశ్యం చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారు. వారు బోల్తా పడిన బస్సు నుంచి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు. స్థానికుల తక్షణ స్పందన వలన ప్రాణనష్టం తప్పిందని తెలుస్తోంది.
ఈ దుర్ఘటనలో 20 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా.. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే స్థానికులు వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నివేదిక ఇవ్వాల్సి ఉంది. బస్సులో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది శివస్వాములు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. శివస్వాములు శ్రీశైలం దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమ కళ్లెదుటే జరిగిన ఈ ఘటనతో తోటి స్వాములు, ఇతర భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన మిగతా వారిని కూడా స్థానిక ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు అదుపుతప్పడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ దుర్ఘటన కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అయితే, పోలీసులు వెంటనే పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Mahesh Kumar: సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు