Khammam: ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలో గురువారం ఒక ఘోర కారు ప్రమాదం జరిగింది. గ్రీన్ఫీల్డ్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ కారులోని ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ నుంచి ఎర్రవరం వైపు ఏడుగురు ప్రయాణికులతో ఒక కారు బయలుదేరింది. గ్రీన్ఫీల్డ్ హైవేపై ప్రయాణిస్తుండగా, వేంసూరు పరిధిలోని లింగపాలెం ఎగ్జిట్ వద్దకు రాగానే ఒక్కసారిగా కారు టైర్ పేలిపోయింది. దాంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ను బలంగా ఢీకొట్టింది.
Also Read: కాగజ్నగర్లో భారీ అగ్నిప్రమాదం: బూడిదైన ప్రముఖ బేకరీ, రూ.20 లక్షల నష్టం!
మంటల్లో కాలిబూడిదైన కారు
రైలింగ్ను ఢీకొట్టిన మరుక్షణమే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఏడుగురు ప్రయాణికులు అప్రమత్తమై చాకచక్యంగా బయటకు దూకేశారు. వారు బయటపడిన కొద్దిసేపటికే మంటలు కారు మొత్తం వ్యాపించి, వాహనం పూర్తిగా కాలిబూడిదైంది.
సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
కారు పూర్తిగా కాలిపోయినప్పటికీ, లోపల ఉన్న ఏడుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడటం గమనార్హం. స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైవేలపై ప్రయాణించేటప్పుడు వాహనాల టైర్ల కండిషన్ను చూసుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.