Man Killed After Argument Over Roti : చిన్న చిన్న కారణాలకే.. మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. చపాతీ విషయంలో జరిగిన వాగ్వాదం.. ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో గతవారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాద్గిర్ పోలీస్ సూపరింటెండెంట్ సంగీత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాకేష్ అనే వ్యక్తి రోటీని కొనుక్కునేందుకు.. ఫయాజ్ సోదరి నడుపుతున్న షాప్ కు వెళ్లాడు.
తనకు చపాతీలు కావాలని అడగ్గా.. అన్నీ అయిపోయాయని ఇక షాప్ క్లోజ్ చేస్తామని చెప్పింది. అయితే రాకేష్ తనకు చపాతీలు కావాల్సిందేనంటూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ఆమె ఒక్కతే ఉండటంతో.. వెంటనే తన సోదరుడు ఫయాజ్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. అక్కడికి వెళ్లిన ఫయాజ్.. రాకేష్ పై దాడికి దిగాడు.
Also Read : కర్నాటకలో యువతి దారుణ హత్య.. లవ్ జిహాద్ కారణమా?
వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో.. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో రాకేష్ కు తీవ్రగాయాలై మృతి చెందాడు. ఘటన తర్వాత.. ఫయాజ్, అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడింది. రాకేష్ కుటుంబంతో డబ్బుతో రాజీ చేసుకునేందుకు సిద్ధపడగా.. విషయం తెలుసుకున్న ఎస్పీ వారితో ఫిర్యాదు చేసేందుకు ఒప్పించారు. ఫయాజ్, ఆసిఫ్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 109,504, 302 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాకేష్ దళిత కులానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఈ కేసు మరింత స్ట్రాంగ్ అయింది. పోస్టుమార్టంలో రాకేష్ మృతికి కారణాలు తెలిసిన తర్వాత.. నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంగీత తెలిపారు.