Delhi Judge Aman Kumar Sharma: దేశ రాజధాని ఢిల్లీలో ఒక సిట్టింగ్ న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలోని నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో జ్యుడీషియల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న అమన్ కుమార్ శర్మ శనివారం మధ్యాహ్నం తన నివాసంలో ప్రాణాలు తీసుకున్నారు. సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ ప్రాంతంలోని ఆయన నివాసంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు 1:45 నిమిషాల సమయంలో అమన్ కుమార్ శర్మ తన ఇంటి బాత్రూంలో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలను సేకరించాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అమన్ కుమార్ శర్మ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వృత్తిపరమైన ఒత్తిడి ఏమైనా ఉందా? లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక జ్యుడీషియల్ ఆఫీసర్ స్థాయి వ్యక్తి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంపై న్యాయవర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి ఆయన కాల్ డేటా, గత కొద్దిరోజులుగా ఆయన ప్రవర్తనపై కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వంటి కీలక నగరంలో ఒక జడ్జి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: డొమెస్టిక్ కంటే కమర్షియల్ ధరల పెంపు ప్రమాదకరం: ఎంపీ మల్లు రవి