Hyderabad : వాడో పోరంబోకు. ఇంటర్ ఫెయిల్. పనీ పాటా లేకుండా తిరుగుతుంటాడు. పార్క్ చేసిన బైక్ల నుంచి పెట్రోల్, బ్యాటరీలు గట్రా కొట్టేస్తుంటాడు. చిల్లర దోస్తానాతో అల్లరి పనులు చేస్తుంటాడు. వాడు అదే కాలనీకి చెందిన ఓ బాలికపై కన్నేశాడు. తొమ్మిదో తరగతి చదివే ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించాడు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్లతో టార్చర్ చేశాడు. ఇంటికొచ్చి మరీ బెదిరించాడు. వాడి వేధింపులు భరించలేక ఆ బాలిక సూసైడ్ చేసుకుంది. రెండు రోజుల క్రితమే కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తన కూతురు చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఆ తండ్రి.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్, హయత్ నగర్ పీఎస్ పరిధిలో రంగనాయకుల గుట్టలో విజయ్, తిరుపతమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 9 వ తరగతి చదివిన విజయ్ చిన్న కుమార్తె మీనాక్షిని వేధిస్తున్నాడు అదే ప్రాంతానికి చెందిన రోహిత్. ప్రేమ పేరుతో ఆ బాలిక వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. రోహిత్ తన తమ్ముడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి బాలికకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి టార్చర్ చేస్తున్నాడు. ఈ విషయం రోహిత్ పేరెంట్స్కు చెప్పాడు మీనాక్షి తండ్రి విజయ్. అయినా, తన కొడుకును కంట్రోల్ చేయలేదు ఆ తండ్రి. ఇటీవల వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఈసారి డైరెక్ట్గా పోలీసులకు కంప్లైంట్ చేశాడు.
ఇంటికి వెళ్లి వార్నింగ్
తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అని మరింత రెచ్చిపోయాడు రోహిత్. మంగళవారం ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ చిన్నారిని బెదిరించాడు. తల్లిదండ్రులను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తీవ్రంగా భయపడిపోయిన ఆ అమ్మాయి.. రోహిత్ వెళ్లిపోగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. నిందితుడు రోహిత్ను ఉరితీయాలని పట్టుబడుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు.
పోలీసులదే తప్పంతా?
రోహిత్పై రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినపుడు పోలీసులు సరైన విధంగా స్పందించలేదంటున్నారు బాలిక తండ్రి. తాము ఫిర్యాదు చేసినప్పుడే అతడిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే మీనాక్షి ఆత్మహత్య చేసుకోకపోయి ఉండేదంటున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని కన్నీరు పెడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చే సమయంలో కూడా పోలీసులు తమతో అసభ్యకరంగా మాట్లాడారని.. ఫిర్యాదు కాపీ కూడా ఇవ్వలేదని.. పోలీసుల వల్లే ఈ దారుణం జరిగిందని మండిపడుతున్నారు.