Investment Scam: స్వేచ్ఛ బ్యూరో: పెట్టుబడులు పెట్టండి.. ఊహించని లాభాలు సంపాదించుకోండి అని ఆశ పెట్టి వ్యక్తిని 1.22కోట్లకు ముంచిన నేరంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు ఏటీఎం కార్డులు, రెండు చెక్ బుక్కులు, రెండు బ్యాంక్ పాస్ బుక్కులు, మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతితో కలిసి వివరాలు వెల్లడించారు.
వాట్సప్ ద్వారా సైబర్ క్రిమినల్స్ కాంటాక్ట్
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని జనవరి నెలలో సైబర్ క్రిమినల్స్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేశారు. తాము చెప్పినట్టుగా 282 బార్ క్లేస్ ఇండియా హై క్వాలిటీ స్టాక్ ట్రేడింగ్ రీసెర్చ్ గ్రూప్ లో చేరి పెట్టుబడులు పెట్టాలని సూచించారు. తక్కువ సమయంలో భారీ లాభాలు ఖాయమని నమ్మించారు. దాంతో బాధితుడు కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టగా లక్షా అయిదువేల రూపాయలు లాభం వచ్చినట్టుగా చూపించారు. ఆ మొత్తాన్ని విత్ డ్రా కూడా చేసుకోనిచ్చారు.
Also Read: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. ఈ ఒక్కటి చేయకుంటే మీ ఓటు గల్లంతే!
కోటీ 22 లక్షల రూపాయలు పెట్టుబడి
దాంతో సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో చిక్కిన బాధితుడు 19విడతల్లో కోటీ 22లక్షల రూపాయలను పెట్టుబడులుగా పెట్టాడు. దానిపై కేటుగాళ్లు 15.69 కోట్ల లాభం వచ్చినట్టుగా ప్లాట్ ఫామ్ లో చూపించారు. డబ్బు డ్రా చేసుకోవటానికి బాధితుడు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దానిపై మాట్లాడగా అదనంగా మరో 35లక్షల రూపాయలు చెల్లించాలని సైబర్ మోసగాళ్లు చెప్పారు. అప్పుడు మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ గౌరీనాయుడు, ఎస్ఐ హిమారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సునీల్, కానిస్టేబుళ్లు అశోక్, సాయినాథ్, రాజేందర్, మీనాలతో కలిసి విచారణ చేపట్టారు.
ఇలా మోసం చేశారు..
దర్యాప్తులో నిందితుల్లో ఒకడు కేవలం బ్యాంక్ అకౌంట్లు తెరవటానికి ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఖాతాలు తెరిచిన తరువాత ఇంటర్ నెట్ బ్యాంకింగ్ వివరాలను మిగితా నిందితులతో పంచుకున్నాడు. సైబర్ క్రిమినల్స్ కొల్లగొట్టే డబ్బును తరలించటానికి ఈ అకౌంట్లను ఉపయోగించారు. దాంతోపాటు కమీషన్ ఆశ చూపించి కొంతమంది ఖాతాల వివరాలు తీసుకుని వాటిని కూడా సైబర్ కేటుగాళ్లకు అందచేశాడు. ఇలా చేయటం ద్వారా నిందితులు అందరూ కమీషన్ల రూపంలో భారీగా డబ్బు సంపాదించారు. కేసులో నిందితునిగా ఉన్న ఒకడు సమకూర్చిన ఎస్ బ్యాంక్ మ్యూల్ అకౌంట్ కు దేశవ్యాప్తంగా జరిగిన 26 సైబర్ నేరాలతో సంబంధం ఉండటం.. దీని ద్వారా కోటీ 10లక్షల రూపాయల లావాదేవీలు జరగటం గమనార్హం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మరో మ్యూల్ ఖాతా నుంచి 3.37కోట్ల రూపాయల ట్రాన్సక్షన్లు జరిగాయి. విచారణలో వెల్లడైన వివరాలతో సైబర్ క్రైం పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగితా వారి కోసం గాలిస్తున్నారు.