నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఒళ్లు గగుర్పొడిచే దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్నారో లేక అతివిశ్వాసమో తెలియదు కానీ కొందరు యువకులు కారుతో ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా.. కారు కింద చిక్కుకున్న అతడిని సుమారు కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లారు.
స్థానికుల వివరాల ప్రకారం.. సతీష్ అనే వ్యక్తి తన పనుల నిమిత్తం రోడ్డుపై వెళ్తుండగా, వేగంగా దూసుకొచ్చిన ఒక కారు అతడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపాల్సింది పోయి, నిందితులు మరింత వేగంతో కారును పోనిచ్చారు. దీంతో సతీష్ కారు కింద ఇరుక్కుపోయాడు. కారుకు సైరన్ అమర్చుకుని, రోడ్డుపై హంగామా సృష్టిస్తూ పోకిరీలు సతీష్ను ఈడ్చుకెళ్లారు.
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి..
దాదాపు కిలోమీటరు దూరం తర్వాత స్థానికులు కారును వెంబడించి ఆపడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అప్పటికే సతీష్ ఒళ్లంతా తీవ్ర రక్తగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కారుకు అక్రమంగా సైరన్ అమర్చడమే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఈడ్చుకెళ్లడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసుతో పాటు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Attapur Murder: హైదరాబాద్లో దారుణం.. ఆఫీసులోనే కత్తులతో పొడిచి దారుణ హత్య..