Matrimony Scam: మహిళగా నటించి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఓ వ్యక్తి సైబర్ కేటుగాళ్లు భారీగా దోచేశారు. సింగపూర్ లో ఉంటూ ఈ మోసానికి పాల్పడ్డ కేటుగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సమకూర్చటంతోపాటు హవాలా నెట్ వర్క్ ద్వారా డబ్బు చేరవేసిన నలుగురిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి కొంతకాలం క్రితం సంగం మ్యాట్రిమోనీ నుంచి మహిళగా నమ్మించి సైబర్ క్రిమినల్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నిరోజులపాటు చాటింగులు చేసి దగ్గరయ్యాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పూర్తిగా తన వలలో చిక్కాడని నిర్ధారించుకున్న తరువాత తాను చెప్పినట్టుగా పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పాడు. ఆ తరువాత పలు విడతల్లో రూ.1.46 కోట్లను వేర్వేరు ఖాతాలకు బదిలీ చేయించాడు. వాటిపై లాభాలు వచ్చినట్టుగా స్క్రీన్ షాట్లు పంపించాడు.
దానిని నమ్మి బాధితుడు డబ్బు విత్ డ్రా చేయటానికి ప్రయత్నించగా వీలు పడలేదు. దీనిపై ప్రశ్నించిన బాధితునికి డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని కేటుగాడు చెప్పాడు. అప్పుడు మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం సీఐ రాఘవేంద్ర తన బృందంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో సిద్దిపేటకు చెందిన చొక్కాల సంపత్ (29), సికింద్రాబాద్ కు చెందిన హెచ్చు నరేశ్ (37), ఎండ్ల సురేశ్ (43), వడ్కల మహేశ్ (33)లను అరెస్ట్ చేశారు. వీరిని విచారించినపుడు సైబర్ కేటుగాని సూచనల మేరకు సంపత్ మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను నిర్వహించటంతోపాటు డబ్బు ట్రాన్స్ ఫర్ చేయటంలో కీలక పాత్ర పోషించినట్టుగా వెల్లడైంది. దీని కోసం 30 శాతం కమీషన్ తీసుకున్నట్టుగా తేలింది. ఇక నరేశ్ తన పేర బ్యాంక్ ఖాతా తెరవటంతోపాటు మరికొందరితో మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేయించి సైబర్ క్రిమినల్స్ కు సహకరించినట్టుగా వెల్లడైంది. దీని కోసం 15శాతం కమీషన్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read: ఫ్యామిలీస్ కూలిపోతున్నాయి.. చూస్తూ ఊరుకోం.. డ్రగ్స్పై పవన్ సమరశంఖం!
మరోవైపు సురేశ్ కూడా మ్యూల్ ఖాతాలను తెరిపించి పోలీసులకు అనుమానం రాకుండా ఆయా ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేయటంలో సహకరించి 10శాతం కమీషన్ గా తీసుకున్నట్టుగా తేలింది. మహేశ్ కూడా ఖాతాలను సమకూర్చటం, నగదును విత్ డ్రా చేయటంలో సహకరించి 10 శాతం కమీషన్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇలా విత్ డ్రా చేసిన డబ్బును హవాలా నెట్ వర్క్ ద్వారా సింగపూర్ లో ఉన్న ప్రధాన నిందితునికి చేర్చినట్టుగా తేలింది. అతడ్ని పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ వెల్లడించారు.
Also Read: కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్.. కాబోయే భార్య కావాలని చంపలేదా? ప్రియుడే బెదిరించాడా?